ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలి కేసు ఇదే... జీవీఎంసీ వర్సెస్ గాజుల శోభారాణి

ఫొటో సోర్స్, sreemannarayana.namburi/facebook
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు బుధవారం మొదలయ్యాయి.
గడిచిన 56 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్లో కొనసాగింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో జనవరి 1వ తేదీని అపాయింటెడ్ డే గా నిర్ణయించి, హైకోర్టు విభజనకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ప్రవీణ్ కుమార్, ఆయనతో పాటు మరో 13 మంది న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించారు.
హైకోర్టు భవనం మరో నెలరోజుల్లో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈలోగా తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.
జీవీఎంసీ వర్సెస్ గాజుల శోభారాణి
ఈ రోజు (జనవరి 2వ తేదీ) నుంచి ఏపీ హైకోర్టులో కేసుల విచారణను ప్రారంభించారు. తొలి కేసు విశాఖ మహా నగర పాలక సంస్థకు సంబంధించినది. రిట్ పిటిషన్ నెం. 1731/2018 గా నమోదయిన విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ కేసు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో పిటిషనర్లు.. జీవీఎంసీ కమిషనర్, జీవీఎంసీ జోన్-2 జోనల్ కమిషనర్ కాగా, రెస్పాండెంట్స్ (ప్రతివాదులు) గాజుల శోభారాణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.

ఫొటో సోర్స్, sreemannarayana.namburi/facebook
ప్రతివాది నివాసం సికింద్రాబాద్
2018 నవంబర్ 2వ తేదీన హైదరాబాద్లోని హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఈ పిటీషన్ దాఖలయ్యింది. ఈ కేసులో పిటిషనర్ల తరుపున న్యాయవాది ఎస్ లక్ష్మీనారాయణ రెడ్డి వాదిస్తుండగా, ప్రతివాదుల పక్షాన న్యాయవాది పరావస్తు కృష్ణ వాదిస్తున్నారు. కాగా, ఈ కేసు విచారణకు పిటిషనర్లు, ప్రతివాదులు స్వయంగా హాజరు కాలేదు. వారి తరపు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. న్యాయవాదుల తరపున జూనియర్ న్యాయవాదులు హాజరై వాయిదా కోరారు. ప్రతివాదుల్లో మొదటివారైన గాజుల శోభారాణిది సికింద్రాబాద్.
తొలిరోజు కేసులు 12.. విచారణ వాయిదా
దీంతో పాటు మొత్తం 12 కేసులపై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే తొలి రోజు కేసుల విచారణ జరగకుండానే ప్రధాన న్యాయమూర్తి వాటిని వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటు కావటం పట్ల బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. ఇదో చారిత్రక ఘట్టమని, కేసుల విచారణ త్వరతిగతిన పూర్తికావడానికి, వాదులు, ప్రతివాదులకు అందుబాటులో ఉండడానికి ఇది దోహదపడుతుందన్నారు. హైకోర్టు భవనం పూర్తయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, http://hc.ap.nic.in/
‘మరో నెల రోజులు ఇంతే’
హైకోర్టు కార్యకలాపాలు తొలిరోజు కావటం, వెబ్సైట్లో మార్పులు పలువురు న్యాయవాదులు హాజరుకాలేకపోవడానికి కారణాలని ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. ప్రస్తుతం కేసుల లిస్టింగ్ జరుగుతోందని, తదుపరి వాయిదాల నుంచి కేసుల విచారణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హైకోర్టు వెబ్సైట్లో మార్పులు మంగళవారం అర్ధరాత్రికి అందుబాటులోకి వచ్చాయని, దీంతో పలువురికి సమాచారం కూడా లేదన్నారు. ప్రస్తుతం కోర్టులో సరిపడినన్ని మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ముఖ్యమంత్రి సమావేశ హాలులో ఒక ధర్మాసనం, సీఎం ప్రెస్మీట్లు నిర్వహించే హాలులో మరో ధర్మాసనం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, పూర్తిస్థాయి భవనం అందుబాటులోకి వస్తే తప్ప కోర్టు విధులు సక్రమంగా సాగేందుకు ఆస్కారం ఉండదన్నారు. మరో నెల రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- హైకోర్టు విభజన: రాయలసీమ వ్యక్తిపై తెలంగాణలో కేసు ఉంటే ఏ కోర్టులో విచారిస్తారు?
- హైకోర్టు విభజన: ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు ఇబ్బంది ఏంటి?
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- 2జీ కుంభకోణం కేసు: ‘ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. ఒక్క సాక్ష్యం లేదు’
- భారత న్యాయ వ్యవస్థలో కొత్త చరిత్ర: సుప్రీం కోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
- అభిశంసన: ఆ ప్రక్రియ అంతా ఒక్క బొమ్మలో
- ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో ఆఫీస్ వేలం
- సచిన్ తెందూల్కర్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మృతి
- రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు
- చైనా యూత్ ఒకరికి మించి ఎందుకు కనడం లేదు? ఇద్దరిని కనేందుకు ఎందుకు భయపడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









