తెలంగాణ ఎన్నికలపై BBC ‘రంగస్థలం’ - ఎవరేమన్నారంటే?
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలుసుకునేందుకు, వారి గొంతు వినిపించేందుకు బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఆధ్వర్యంలో 'తెలంగాణ రంగస్థలం' కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ని ఇక్కడ చూడొచ్చు.
నాలుగున్నరేళ్ల తెలంగాణ సాధించిందేమిటి? సాధించాల్సిందేమిటి?, నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ ఇప్పుడు ఎక్కడ ఉంది?, భవిష్యత్ చిత్రపటం ఏంటి? అనే అంశాలపైన రంగస్థలంలో చర్చించారు. ఆ చర్చలో కీలక అంశాలు..

సాయంత్రం 8.55
బూర నరసయ్య
తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా పురుషులకంటే మహిళల ఆయుర్థాయం ఎక్కువ.
అందుకు తెలంగాణలో కూడా ఆసరా పింఛను భర్తను కోల్పోయిన మహిళలకే ఎక్కువగా దక్కుతున్నాయి.
సాయంత్రం 8.28
పద్మజా షా
నోటా యాక్ట్లో 20-25శాతం కంటే ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే రీ ఎలక్షన్ నిర్వహించాలన్న నిబంధనను చేర్చాలి.
మహాకూటమి ఎందుకు ఏర్పాటు చేశారు? - విద్యార్థిని

దుర్గా ప్రసాద్
ప్రజాకూటమి జెండాలు, ఎజెండాలు వేరు. కానీ, మేం అందరం ఉద్యమంలో పాల్గొన్నాం.
టీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చలేదు కాబట్టి ప్రజా కూటమి ఏర్పాటు చేశాం.
షాదీ ముబారక్కు ఇచ్చినట్లు విద్యార్థినులకు చదువులకు డబ్బులు ఎందుకు ఇవ్వరు? - విద్యార్థిని

సమయం సాయంత్రం 08.10
విద్యాధర్ రెడ్డి
ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు బంధు తీసుకొచ్చారు. ప్రజల డబ్బు పంచి ఓట్లు పొందే పథకం ఇది. పది ఎకరాలు, వంద ఎకరాలు ఉన్నవారికి ఒకే న్యాయమా?

సమయం సాయంత్రం 7.55
బూర నరసయ్య
గతంలో సబ్సిడీ విత్తనాల కోసం పెద్ద పెద్ద లైన్లు, లాఠీ ఛార్జీలు చూశాం. కానీ ఇప్పుడు ఆ దృశ్యాలు లేవు.
రాజకీయాలకు అతీతంగా రైతు బంధును అందిస్తున్నాం.

- తెలంగాణ ఎన్నికల కథనాలు

గతంలో కందుల కొనుగోలు 30శాతమే జరిగేవి. కానీ, మేము వంద శాతం కొంటున్నాం.
గతంలో గోడౌన్లు లేక పంట బయటపెట్టేవారు. 4లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్లు మాత్రమే గతంలో ఉండేవి. కానీ, గత నాలుగేళ్లలో 18లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న గోడౌన్లు కట్టాం.
కౌలు రైతుల వివరాలపై స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ల విషయంలో ఒక చట్టం తీసుకురావాలి.
కౌలుకు రైతుకు స్పష్టమైన స్టేటస్ కల్పించాలి. భూమిదారుడి హక్కు కాపాడాలి. అప్పుడు వాళ్లను కూడా రైతుబంధులో చేర్చడానికి మేం సిద్ధం.

రంగారెడ్డి:
రైతులే వ్యవసాయం లాభదాయకం కాదని భావిస్తున్నారు. అందుకే భూమి కౌలుకు ఇస్తున్నారు. నేనే నా భూమిని కౌలుకు ఇచ్చా. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువమంది రైతు కూలీలే ఉన్నాయి. కానీ ఎక్స్గ్రేషియా పొందాల్సిన కౌలు రైతు కుటుంబాలు పొందట్లేదు. రైతుబంధు ఫలితాలు పట్టా భూమి ఉన్న రైతులకే దక్కుతున్నాయి.
తెలంగాణ విద్యార్థులు చాలా తెలివిమంతులు.
సమయం సాయంత్రం 7.31
బూర నరసయ్య
లక్షకు పైగా ఉద్యోగాల కల్పన కోసం ప్రక్రియ జరుగుతోంది.
32 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. 87,346 ఉద్యోగాల కల్పనకు ప్రక్రియ మొదలైంది.
121 గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేశాం.

సమయం సాయంత్రం 7.22
విద్యాధర్ రెడ్డి, టీజేఎస్ నేత
తెలంగాణలో ఏ విద్యార్థికైనా మొదటి పాఠశాల ప్రైమరీ స్కూల్. కేసీఆర్ ప్రతి స్కూల్ను కార్పొరేట్ స్థాయిలో చేస్తామని ఉద్యమం సమయంలో చెప్పారు.
కానీ, ఇప్పుడు దాదాపు 4వేల స్కూళ్లను మూసేసి, గురుకుల పాఠశాలలను స్థాపించడంల అర్థం లేదు.
ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ రంగంలో కల్పించిన ఉద్యోగాలు దాదాపు 22వేలు కూడా లేవు.
యాపిల్, గూగుల్ లాంటి సంస్థలు వచ్చాయంటారు. కానీ, వాటిలో కేవలం ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకే రావు. భారీగా ఉపాధి కల్పించే ఆటోమొబైల్, ఆగ్రో పరిశ్రమలు లాంటివి మాత్రం రాలేదు.

సమయం సాయంత్రం 7.15
బూర నరసయ్య
క్యాబినెట్లో మహిళ లేకపోవడం మాకు లోటే. దాన్ని అంగీకరిస్తాం. అక్షరాస్యత అనేది 60ఏళ్ల పాలన తాలూకు నిర్లక్ష్యం.
తెలంగాణ ఏర్పడ్డాక అన్ని రంగాలకూ ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించాం.

ఇంద్రసేనా రెడ్డి
ఈ రోజు తెలంగాణలో 50శాతం మహిళలు. వీళ్లలో ఎవరూ ఎమ్మెల్యేగా, మంత్రులుగా అర్హులు కారనా?
పోటీలో నిలబడే మహిళల సంఖ్యను కూడా టీఆర్ఎస్ తగ్గించింది.

సయయం సాయంత్రం 7.05
పద్మజా షా, రిటైర్డ్ ప్రొఫెసర్
ఎన్నికల్లో మహిళలకు సంబంధించిన 33శాతం రిజర్వేషన్ బిల్లు ఎప్పట్నుంచో ఆమోదం పొందట్లేదు. తెలంగాణ అక్షరాస్యతలో దేశంలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. విద్య లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. కానీ, ఈ నాలుగేళ్లలో విద్యారంగం పతనమైంది. ప్రైమరీ స్కూళ్లు మూతబడ్డాయి. ఆర్టీఐ ద్వారా కూడా సమాచారాన్ని బయటకు ఇవ్వట్లేదు. ఆ డేటాను మాయం చేస్తున్నారు.
మేం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా అనేక గ్రామాలు తిరిగాం. ఆడపిల్లల చదువుకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు.

సమయం సాయంత్రం 7.00
జీఎస్ రామ్మోహన్, బీబీసీ తెలుగు ఎడిటర్
సీపీఎం అగ్రకులాలకే పరిమితమైంది అన్న ఆరోపణలు ఉన్నాయి. మీరేమో సామాజిక న్యాయం అంటున్నారు. మరి ఆ విమర్శకు మీరు ఎలా సమాధానిమిస్తారు?... అని సీపీఎం నేతను ప్రశ్నించారు.

సీపీఐ(ఎం) నేత డీజీ నర్సింహా రావు:
తక్షణం పరిష్కరించాల్సిన రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు తదితర అంశాలను ప్రభుత్వం పరిష్కరించట్లేదు. ప్రస్తుతం బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అలాంటి మౌలిక అంశాలపైనే దృష్టి పెట్టింది.
అందుకే అన్ని సామాజిక తరగతుల వారికి కొత్త రాష్ట్రంలో పోటీకి అవకాశం కల్పిస్తున్నాం. మొదటిసారి ఒక ట్రాన్స్జెండర్ను కూడా బీఎల్ఎఫ్ పోటీలో నిలిపింది.

సమయం సాయంత్రం 6.50
కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి:
ముఖ్యమంత్రికి కరెంటు తప్ప ఇంకో అంశమే ఉండదా మాట్లాడటానికి. తెలంగాణ మేధస్సును అణచివేసి, వన్ మ్యాన్ షోను ఆయన నడిపిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు సెంటిమెంటు వాదనను తీసుకొచ్చారు.

సమయం సాయంత్రం 6.39
బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి
తెలంగాణ కేవలం టీఆర్ఎస్ వల్లో, కేసీఆర్ వల్లో రాలేదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల, ఎన్నో పార్టీల పోరాటం ఉంది.
దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి లేకపోతే మూడు లక్షల రూపాయలు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు... ఇలాంటి ఎన్నో హామీలిచ్చారు. కానీ, ఏదీ అమలు చేయలేదు.
ముఖ్యమంత్రికి విద్యార్థులంటే భయం. అందుకే వారిని అణచివేస్తున్నారు. ఓయూ వంద సంవత్సరాల వేడుకకు సపోర్ట్ చేయలేదు. మాట్లాడకుండా మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రతిష్ఠాత్మక సైన్స్ కాంగ్రెస్ను అక్కడ పెట్టనివ్వలేదు.
ముఖ్యమంత్రి మొత్తంగా తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీశారు.

సమయం 6.37
విద్యాధర్ రెడ్డి, టీజేఎస్ నేత
తెలంగాణ రావడం అనేదే తెలంగాణ ప్రజలకు మేజర్ సక్సెస్. దానికి టీఆర్ఎస్ ఒక్కటే కాదు ఎన్నో పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు కలిసి పోరాడాయి.
ఆఫీసుకే రాని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు?

సమయం 6.30
బూర నరసయ్య, టీఆర్ఎస్ ఎంపీ
తెలంగాణలో మిగిలిన పార్టీలతో రాజకీయ వైరుధ్యం ఉంది. లక్ష్యాల విషయంలో కాదు. కానీ తెలుగుదేశంతో లక్ష్యం విషయంలో కూడా వైరుధ్యం ఉంది.
తెలుగు రాష్ట్రాలు సమాంతరంగా, సమానంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణలో మిగిలిన పార్టీలతో రాజకీయ వైరుధ్యం ఉంది. లక్ష్యాల విషయంలో కాదు. కానీ తెలుగుదేశంతో లక్ష్యం విషయంలో కూడా వైరుధ్యం ఉంది.

సమయం 6.20
టీడీపీ నేత దుర్గాప్రసాద్:
ఓట్ల కోసం నాలుగేళ్ల క్రితం తీసుకొచ్చిన సెంటిమెంటు వాదననే మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తోంది.
ఇప్పటిదాకా కేసీఆర్ 72 ప్రచార సభల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతోంది. కానీ, ఇతర సమస్యల గురించి మాట్లాడట్లేదు. ప్రధానంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాల గురించి అస్సలు మాట్లాడట్లేదు. సంక్షేమ పథకాలను అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తున్నాయి.

సమయం 6.10
బీబీసీ తెలంగాణ ఎన్నికల రంగస్థలం ప్రారంభం
బూర నరసయ్య, టీఆర్ఎస్ ఎంపీ: తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, శాంతి భద్రత సమస్యలుంటాయి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వ్యక్తులపై దాడి జరుగుతుంది, తెలంగాణను పాలించే శక్తి స్థానిక నాయకులకు లేదు... ఈ నాలుగు అపవాదులు ప్రధానంగా వినిపించాయి. కానీ, వీటన్నంటినీ ప్రభుత్వం జయించి చూపించింది.

టీఆర్ఎస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్, టీడీపీ నేత దుర్గా ప్రసాద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగా రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, టీజేఎస్ నేత విద్యాధర్ రెడ్డి, సీపీఐ(ఎం) నేత డీజీ నర్సింహా రావు, బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి తదితరులు ఈ చర్చకు హాజరయ్యారు.
అంతకు ముందు క్యాంపస్ టాక్ నిర్వహించింది. రాష్ట్రంలోని నాలుగు యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడి విద్యార్థులతో 'క్యాంపస్ టాక్' కార్యక్రమాన్ని నిర్వహించి, నాలుగేళ్ళ పాలన మీద వారి ప్రతిస్పందనను ఆవిష్కరించింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
గ్రామీణ ప్రాంతాల్లో కచ్చీరు
'కచ్చీరు'లో భాగంగా తెలంగాణలో తొలిసారి ఓటు వేయబొతున్న యువత గొంతు వినిపించే ప్రయత్నం చేసింది బీబీసీ తెలుగు. ఉత్తర తెలంగాణ యాసలో కచ్చీరు పదాన్ని నలుగరు కుర్చుని మాట్లాడే వేదిక, రచ్చబండ, పంచాయితీ తీర్పులిచ్చే చోటు, కొన్న చోట్ల పోలీస్ స్టేషన్ వంటి అర్థాల్లో వాడతారు.
ఇది మేధావుల చర్చా వేదిక కాదు. తమ సమస్యలు, పరిష్కారాలు, ఆశయాలు, ఆకాంక్షలతో రాజకీయాలను ఇప్పటి యువత ఎలా చూస్తుందనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది బీబీసీ తెలుగు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 3
పాతికేళ్లు నిండని యువ ఓటర్లు నవ తెలంగాణపై తమ అభిప్రాయాలను కచ్చీరులో నిక్కచ్చిగా పంచుకున్నారు. ఏ పథకాలు బావున్నాయి, ఏ విధానాలు బాలేవు, పాలనలో ఎక్కడ ఎలాంటి మార్పు రావాలి, వచ్చే ప్రభుత్వం ఏం చేయాలి వంటి అంశాలను బీబీసీ వేదికగా వెల్లడించారు.
నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాల మైదానం, ఖమ్మం లకారం చెరువు గట్టున పార్కులో, వరంగల్ హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో, మంచిర్యాల రాముని చెరువు గట్టున, మహబూబ్ నగర్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పై బీబీసీ తెలుగు కచ్చీరు నిర్వహించింది.
యువత ప్రధానంగా నిరుద్యోగం, విద్యా రంగ అభివృద్ధి గురించి మాట్లాడారు. కొన్ని ప్రభుత్వ పథకాలను స్వాగతించారు, కొన్ని విధానాలను ఘాటుగా విమర్శించారు, కొన్ని పథకాల అమలు మారాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పు బట్టారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 4
అదే సందర్భంలో కౌలు రైతులకు రైతు బంధు అందాలనీ, రైతు బంధు పథకానికి అప్పర్ లిమిట్ ఉండాలనీ కోరారు. చాలా చోట్ల యువత మాట్లాడిన మరో అంశం రిజర్వేషన్లు. రిజర్వేషన్ పొందని కులాలకు చెందిన వారిలో రిజర్వేషన్ పై తీవ్ర వ్యతిరేకత కనిపించింది.
కచ్చీరులో భాగంగా తెలంగాణ బతుకు చిత్రాన్ని పట్టే కొన్ని లోతైన కథనాలు అందించింది బీబీసీ. నల్లగొండలో ఆడపిల్లల అమ్మకాలు కొనసాగుతుండడం, ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోతుండడం, వరంగల్లో ధరీలు నేసే చేనేత కార్మికులకు ప్రభుత్వ సాయం అందకపోవడం, మంచిర్యాలలో సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల సమస్య తెస్తోన్న కొత్త కష్టాలు, మహబూబ్ నగర్లో ఇంకా నీరు అందక ముంబై వలస పోతున్న కుటుంబాలపై కచ్చీరు కథనాలు అందించింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 5
ఇవి కూడా చదవండి:
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- మహిళలకు ప్రమాదకరమైన ప్రాంతం ఆమె ఇల్లే
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- శ్రీలంకలో శవాల దిబ్బ: మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు... అవి ఎవరివి? హంతకులెవరు?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- ‘రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? ఫొటోషాప్ చేస్తున్నారా?’
- పెళ్లి గురించి రాహుల్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








