బిచ్చమెత్తుకునే వికలాంగురాలు... పిల్లల కోసం రిక్షా నడుపుతున్నారు

రోజినా

అసలే మహిళ, అందులోనూ వైకల్యం... దాంతో తనకు బిచ్చమెత్తుకొని బతకడమే శరణ్యమని గతంలో ఆమె భావించేది. కానీ పిల్లలకు అది అవమానకరంగా మారడంతో ఆ పని మానేసింది. జీవితాన్ని జయించిన ఓ ఒంటరి మహిళ కథ ఇది.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రోజినా బేగం స్వస్థలం. మూడేళ్ల క్రితం వరకు ఆమె బిచ్చమెత్తుకొని తన పిల్లల్ని పోషించేది. కానీ ఇప్పుడు ఓ రిక్షా ఆమె జీవితాన్నే మార్చేసింది.

‘‘గతంలో నేనేం చేస్తానని అడిగితే, బిచ్చం ఎత్తుకుంటానని చెప్పాల్సి వచ్చేది. అది నా పిల్లలకు వారి స్నేహితుల ముందు అవమానంగా అనిపించేది. దాంతో నేను ఆ పని మానేశా. చాలా మంది రకరకాల పనులు చేస్తుంటారు. 'నాకు మాత్రం పని ఎందుకు దొరకదు దేవుడా' అనుకున్నా. కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా పని దొరకాలని కోరుకునేదాన్ని.

వీడియో క్యాప్షన్, బిచ్చమెత్తుకునే వికలాంగురాలు... పిల్లల కోసం రిక్షా నడుపుతున్నారు

నాకు రిక్షా తొక్కడం నేర్పించమని ఒక వ్యక్తిని అడిగా. దానికి అతను 'నువ్వు వికలాంగురాలివి. రిక్షా ఎలా తొక్కగలవు..' అన్నాడు. 'నువ్వు నడపడానికి అది మోటారు వాహనం కాదు కదా' అని చెప్పాడు. కానీ ఏడాదిలో మోటార్ రిక్షాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఆర్నెల్లలో నేను ఆ రిక్షాను నడపడం నేర్చుకున్నా.

నేను మహిళను కాబట్టి చాలామంది నా రిక్షా ఎక్కడానికి వెనకాడతారు. ‘నేను వికలాంగురాలినని, నాకు బతకడానికి ఇదే దారని’ చెబుతా. దాంతో, వాళ్లు నా రిక్షా ఎక్కుతారు.

ఇప్పుడు రోజుకు రూ.300 దాకా సంపాదిస్తున్నా. నా పిల్లలకు తిండి పెడుతూ, వాళ్ల అవసరాలు తీర్చగలుగుతున్నా. గతంలో నాకు బిచ్చం వేసిన వాళ్లు కూడా ఇప్పుడు నన్ను అందరిలానే చూస్తున్నారు. వాళ్లు కూడా నా రిక్షా ఎక్కుతున్నారు’ అంటూ తన విజయాన్ని వివరించారు రోజినా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)