టీ20 ప్రపంచకప్‌: ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుని ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత్‌

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.

కఠినమైన పిచ్‌పై భారత్ 171 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది.

ఇంగ్లండ్ ఆటగాళ్లంతా భారత్ బౌలింగ్‌కు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 23 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ 25, జోఫ్రా ఆర్చర్ 21 , మొయిన్ అలీ 8 పరుగులు మాత్రమే చేశారు.

రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఆటతీరుతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది.

అయితే భారత ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

నిరాశపరిచిన విరాట్ కోహ్లీ

ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఇరు జట్లు ఎలాంటి మార్పు లేకుండానే రంగంలోకి దిగాయి.

రోహిత్ శర్మ, కోహ్లీ మ్యాచ్‌ను ప్రారంభించారు. డాప్లీ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ థర్డ్ మ్యాన్ వైపు బౌండరీ బాదాడు. ఆర్చర్ వేసిన 2వ ఓవర్‌లో కోహ్లీ, రోహిత్‌లు పరుగులు జోడించేందుకు ఇబ్బంది పడ్డారు.

డాప్లీ వేసిన 3వ ఓవర్ 2వ బంతికి కోహ్లీ సిక్సర్ బాదాడు. తర్వాతి బంతికి 2 పరుగులు చేసిన కోహ్లీ ఆ తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యి, మరోసారి నిరాశపరిచాడు.

ఈ ప్రపంచకప్ సిరీస్‌లో రోహిత్, కోహ్లీల భాగస్వామ్యం 4 ఓవర్ల పాటు కూడా కొనసాగలేదు. పవర్‌ప్లే ఓవర్ల వరకు కూడా నిలవలేదు. ఇప్పటి దాకా ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై వీరిద్దరు కలిసి చేసిన 39 పరుగులే తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం.

ఆర్చర్ వేసిన 4వ ఓవర్‌లో రోహిత్ శర్మ రెండుసార్లు భారీ షాట్‌కు ప్రయత్నించినా బంతి బౌండరీకి ​​వెళ్లలేదు. ఫలితంగా ఈ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

టీ20 ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

వర్షం అంతరాయం..

ఏడో ఓవర్ రషీద్ వేశాడు. తొలి బంతికి రివర్స్ స్వీప్‌లో బౌండరీ బాదిన రోహిత్ శర్మ, 3వ బంతికి స్వీప్ షాట్‌లో బౌండరీ బాది 9 పరుగులు చేశాడు..

జోర్డాన్ బౌలింగ్ ఎనిమిదో ఓవర్, సూర్యకుమార్ ఓవర్ 4వ బంతికి ఫైన్ లెగ్ వైపు అద్భుతమైన సిక్సర్ కొట్టాడు.

ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు సాధించింది. ఆ తర్వాత వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.

వర్షం ఆగడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్‌ల ధాటికి భారత్ 171 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లు సునాయాసంగా ఇంగ్లండ్ జట్టును బోల్తా కొట్టించారు. 3 వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

2022 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్‌ను ఇంగ్లండ్ ఓడించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో భారత జట్టు బదులు తీర్చుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)