ఇక ఆకాశం నుంచి డబ్బులు కురిపించవచ్చా, భారత్‌లో ప్రైవేట్ శాటిలైట్ విజయాలు ఏం చెబుతున్నాయి?

    • రచయిత, అరుణోదయ్ ముఖర్జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రైవేట్ శాటిలైట్స్

ఫొటో సోర్స్, Getty Images

"మేం ఒక నమ్మకంతో ఈ పని ప్రారంభించాం."

స్కైరూట్ ఏరోస్పేస్ గురించి అడిగినప్పుడు నాగ భరత్ దాక చెప్పిన మాటలవి. 2018లో నాగ భరత్ తన సహోద్యోగి పవన్ చందనతో కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ అనే భారతీయ స్పేస్-టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. 

అప్పటికి ఇస్రోలో పనిచేస్తున్న ఈ ఇద్దరు ఇంజినీర్లు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి ఈ సంస్థను ప్రారంభించారు.

ఇటీవల కాలంలో స్పేస్ సెక్టర్ విస్తరిస్తోంది. పలు ప్రైవేట్ సంస్థలు అంతరిక్షంలోకి కమర్షియల్ శాటిలైట్లను పంపిస్తున్నాయి. ఈ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న నమ్మకమే స్కైరూట్ స్థాపించడానికి స్ఫుర్తి అంటున్నారు నాగ భరత్.

స్కైరూట్ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే రాకెట్ల భాగాలను తయారుచేస్తుంది.

శుక్రవారం, భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను గగనతలంలోకి ప్రవేశపెట్టారు. ఈ ఘనత సాధించిన సంస్థ స్కైరూట్. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. 

భారతీయ స్పేస్ ఇండస్ట్రీలో భాగం కావడానికి ఇది మంచి సమయం. తక్కువ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మక మిషన్లను అంతరిక్షంలోకి ప్రయోగించడంలో భారత్ కు మంచి పేరుంది.

అంతరిక్ష పరిశోధనలపై అమెరికా, చైనాలు పెట్టే ఖర్చులో భారత్ పెట్టే ఖర్చు ఒక చిన్న భాగం మాత్రమే.

గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో భారత్ వాటా కేవలం 2 శాతం. అయితే, ప్రస్తుతం చేపట్టిన సంస్కరణలు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

దేశంలో తొలి ప్రైవేట్ సంస్థ స్కైరూట్

2020లో భారతదేశం స్పేస్ సెక్టర్‌లో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. అంతరిక్షంలోకి పంపే రాకెట్లు, ఉపగ్రహాలను తయారుచేసేందుకు అనుమతించింది. దానితో పాటు, వీటిని ప్రయోగించేందుకు ఇస్రో కార్యాలయాలు,స్టేషన్లను వాడుకునేందుకు అంగీకరించింది. 

"అంతర్జాతీయ స్పేస్ మార్కెట్‌లో భారతదేశానికి ఇంకా పెద్ద వాటా ఉండాలి. కనీసం 8 నుంచి 10 శాతం వాటా సాధించేందుకు మనం కృషి చేయాలి" అని INSPACe అధిపతి పవన్ గోయెంకా అన్నారు. 

INSPACe అనేది ప్రైవేట్ సంస్థలు, ఇస్రో మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. 

ప్రభుత్వ అంచనాల ప్రకారం, 2019లో భారతీయ స్పేస్ ఇండస్ట్రీ విలువ 7 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 57వేల కోట్లు). 2024కి 50 బిలియన్ డాలర్లకు( సుమారు రూ.4 లక్షల కోట్లు ) వృద్ధి చెందగల సామర్థ్యం ఉంది.

ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలను అనుమతించిన అనంతరం, ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి సంస్థ స్కైరూట్. ఆ తరువాత మరో 100 స్టార్టప్‌లు ఈ జాబితాలో చేరాయి.

సెప్టెంబర్‌లో స్కైరూట్ సంస్థ రెండవ రౌండ్ (సీరీస్-బీ) పెట్టుబడులను ఆహ్వానించింది. అందులో భాగంగా 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. భారతీయ స్పేస్-టెక్ రంగంలో ఇదే అత్యధికం.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

ఇతర ప్రైవేటు సంస్థలు కూడా దూసుకొస్తున్నాయి..

మరో 10 ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉత్పత్తులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాయి లేదా అందుకు సిద్ధం అవుతున్నాయి.

పిక్సెల్ (Pixxel) అనే మరో స్టార్టప్.. మైనింగ్, విపత్తు నిర్వహణలో సాయం అందించేందుకు ఉపయోగపడే చిత్రాలను అందించే పరికరంపై పనిచేస్తోంది.

బెంగళూరుకు చెందిన దిగంతర అనే స్టార్టప్ అంతరిక్ష వ్యర్థాలు భూమిపై ఎక్కడ పడతాయో గుర్తించే సాధానాలపై పనిచేస్తోంది.

ధృవ, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ లాంటి సంస్థలు కూడా ఈ రంగంలో గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాయి.

అంతరిక్షం, దానికి సంబంధించిన అంశాలపై పనిచేయాలన్న ఆశ, కుతూహలం ఉన్న యువత తమ కలలను సాకారం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లక్కర్లేకుండా, స్వదేశంలోనే ఉండి పనిచేసే అవకాశాన్ని ఈ స్పేస్ సెక్టర్ స్టార్టప్‌లు కల్పిస్తున్నాయి. 

"ఏరోస్పేస్ ఇంజినీర్లకు భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు వస్తున్నాయి" అని స్కైరూట్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల ఇంజినీర్ హిమానీ వర్ష్నీ చెప్పాారు.

స్కైరూట్ ఏరోస్పేస్
ఫొటో క్యాప్షన్, స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ దాక

ఇస్రో లాభాల పంట

కొన్నేళ్లుగా ఇస్రో తక్కువ ఖర్చుతో కూడుకున్న, విశ్వసనీయ భాగస్వామిగా ఖ్యాతి సంపాదించదని నిపుణులు అంటున్నారు.

ఇస్రో, తమ పరిశోధనా సంస్థలో తయారుచేసిన స్పేస్ మిషన్లే కాకుండా, 30 కంటే ఎక్కువ దేశాలకు సుమారు 400 శాటిలైట్లు ప్రయోగించేందుకు సహాయపడింది.

ఇతర దేశాలకు తక్కువ ఖర్చుతో రాకెట్లు, శాటిలైట్లను తయారుచేసి అందించడం ద్వారా భారతదేశం ఈ రంగంలో మరింత ఉన్నతంగా ఎదగవచ్చని పవన్ గోయెంకా అన్నారు. 

"ప్రస్తుతం భారతదేశంలో తయారవుతున్నవన్నీ ఈ దేశంలో వినియోగానికే. ఇతర దేశాల కోసం తయారుచేయడం మొదలుపెడితే అది భారత వ్యాపారాన్ని విస్తరిస్తుంది" అని ఆయన అన్నారు. 

యుక్రెయిన్ యుద్ధం కూడా భారత్‌కు అనేక అవకాశాలను తీసుకొచ్చింది.

లండన్‌కు చెందిన శాటిలైట్ కంపెనీ వన్‌వెబ్‌కు భారతీయ టెక్ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ఆర్థికంగా మద్దతు అందిస్తుంది. యుక్రెయిన్‌పై దాడి కారణంగా రష్యాపై ఆంక్షల వలన వన్‌వెబ్‌కు రష్యన్ రాకెట్ల వినియోగాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. దాంతో, ఆ సంస్థ ఈ రాకెట్ల కోసం భారతదేశం వైపు దృష్టి సారించింది. 

అక్టోబర్‌లో వన్‌వెబ్ కోసం ఇస్రో ఎల్‌వీఎం3 రాకెట్‌పై 36 రాకెట్లను ప్రయోగించింది. దీంతో, వన్‌వెబ్ ప్రయోగించిన రాకెట్ల సంఖ్య 462కు చేరుకుంది.

వన్‌వెబ్ మొత్తం 648 శాటిలైట్లను పంపించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు ఇందులో రష్యా లేదు కాబట్టి, మిగతా శాటిలైట్లను పంపే సన్నాహాలు కూడా భారతదేశమే చేస్తోంది.

"భారత్‌కు ఇది మారురూపంలో వచ్చిన వరం. అంటే, ఉన్నవాటిలో మెరుగైన అవకాశాలను ఎంచుకోవాలి. రష్యా లేకపోవడంతో ఏర్పడిన ఖాళీని ఇస్రో పూరించే అవకాశం వచ్చింది" అని వన్‌వెబ్ ఇండియా డైరెక్టర్ రాహుల్ వత్స్ అభిప్రాయపడ్డారు. 

"ఇది భారత్‌కు అద్భుతమైన అవకాశం. మనం 30-40 శాటిలైట్లను ప్రయోగిస్తాం అని చెబితే, ప్రపంచం మనల్ని చూసే దృష్టి మారిపోతుంది" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, శాస్త్ర పరిశోధన రంగంలో ఇదో పెద్ద విజయం అంటున్న శాస్త్రజ్ఞులు

ఈ రంగంలో సవాళ్లు

అయితే, ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలకు సవాళ్లు లేకపోలేదు.

సంస్థలు ఒక్కరాత్రిలోనే లాభాలను ఆర్జించలేవని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ అన్నారు. ఈ సంస్థ భారత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తుంది.

"ఇది సుదీర్ఘమైన వ్యాపారం. రాకెట్ ప్రయోగించాలన్న ప్రణాళిక మొదలుకొని, రాకెట్ డిజైన్, శాటిలైట్ డిజైన్లను తయారుచేయడం, తరువాత వాటిని ప్రయోగించడం, ఆపై దానికి మార్కెట్‌లో స్థానం సంపాదించడం.. ఇవన్నీ జరిగాక లాభాలు రావడం మొదలవుతుంది. లాభాలు చూశాకే పెట్టుబడులు కూడా పెరుగుతాయి. భాగస్వాములు వస్తారు" అని ఆయన అన్నారు.

ఈ రంగంలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని పవన్ గోయెంకా కూడా అంగీకరించారు. 

"కొన్నేళ్ల పాటు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే ఫలాలు చేతికి అందుతాయి" అని ఆయన అన్నారు. 

ఇవి కూడా చదవండి: