హిరోషిమా డే: 'మంచి నీళ్ళు తాగగానే చనిపోయారు, ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు...వాళ్ళు మనుషుల్లా చనిపోలేదు'

ఫొటో సోర్స్, Getty Images
ఈ కథనంలో కొన్ని దృశ్యాలు, సంఘటనలు మీ మనసును కలచివేయవచ్చు.
ఓపెన్హైమర్ సినిమాలో మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ ఎలా అమలైందో చూపిస్తారు. ఓపెన్హైమర్ నాయకత్వంలో తయారైన అణుబాంబులు సరిగ్గా 80 ఏళ్ల కిందట, ఆగస్టు 6, 9 తేదీలలో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగాసాకిలపై విరుచుకుపడ్డాయి.
ఆ మహా విధ్వంసంతో, మారణహోమంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.

ఫొటో సోర్స్, Getty Images
అణుబాంబు దాడిలో 4 లక్షలకు పైగా జనాభా ఉన్న హిరోషిమా నగరంలో 1,40,000మంది ప్రజలు మరణించారని అంచనా.
నాగాసాకి నగరంలో సుమారు 74 వేలమంది మృతి చెందారు. అణుబాంబు నుండి విడుదలైన రేడియేషన్ వల్ల ఆ తర్వాత కాలంలో ఇంకా కొన్ని వేలమంది చనిపోయారు.


ఫొటో సోర్స్, Getty Images
ఈ బాంబు దాడికి గురై బతికి బైటపడ్డ వారిని ' హిబకుష' అని పిలుస్తారు. ఇలా ప్రమాదం నుంచి బైటపడిన వారు ఆ తర్వాత అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు.
ఈ బాంబుల కారణంగానే ఆసియాలో రెండో ప్రపంచ యుద్ధం హఠాత్తుగా ముగిసింది. ఆగస్టు 14, 1945లో జపాన్ మిత్రపక్షాలకు లొంగిపోయింది. కానీ, జపాన్ అప్పటికే ఓటమికి, లొంగుబాటుకు చేరువగా ఉందని విమర్శకులు చెబుతారు.
యూరప్లో మే7, 1945లోనే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. జూలై 28 నాటికి లొంగి పోవాలని జపాన్ను మిత్రదేశాలు హెచ్చరించగా, గడువు ముగిసినా ఆ దేశం నుంచి ఎలాంటి స్పందనా లేదు.
బ్రిటన్తోపాటు కామన్వెల్త్ దేశాల నుంచి పాల్గొన్న71,000మంది సైనికులు ఈ యుద్ధంలో మరణించారని ఒక అంచనా. వీరు కాక జపాన్కు పట్టుబడ్డ 12,000మంది యుద్ధఖైదీలు ఆ దేశపు జైళ్లలో మరణించారు.
జపాన్ సమయం ప్రకారం ఆగస్టు 6, 1945, ఉదయం 08.15 నిమిషాలకు అమెరికాకు చెందిన 'ఎనోలా గే' అనే B-29 బాంబర్ ప్లేన్ హిరోషిమాపై తొలి అణుబాంబును జార విడిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక యుద్ధంలో అణుబాంబును వాడటం అదే తొలిసారి. హిరోషిమాపై వదిలిన బాంబుపేరు లిటిల్ బాయ్. ఇది సుమారు 12,000 నుంచి 15,000 టన్నుల టీఎన్టీకి సమానమైన పేలుడు సామర్థ్యం ఉన్న బాంబు కాగా, దీని విధ్వంస పరిధి 13 చదరపు కిలోమీటర్లు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
హిరోషిమాపై బాంబు వేసిన తర్వాత కూడా జపాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించలేదు. దీంతో మరో మూడు రోజుల తర్వాత అంటే ఆగస్టు 9, 1945 ఉదయం 11.02 నిమిషాలకు నాగాసాకి నగరంపై అణుబాంబును విడిచింది అమెరికా.
"నేను మా ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఉన్నాను. అలా లోపలికి అడుగువేసే సరికి పెద్ద పేలుడు వినిపించింది'' అని ఆనాటి నాగాసాకి అణుబాంబు పేలుడు ఘటనకు ప్రత్యక్ష సాక్షి రీకో హదా చెప్పారు. అప్పటికి తొమ్మిది సంవత్సరాల వయసున్న ఆమె, ఫోటో జర్నలిస్ట్ లీ కారెన్ స్టోవ్తో అప్పటి జ్జాపకాలను పంచుకున్నారు.
"నా కళ్లకు పెద్ద మెరుపు కనిపించింది. పసుపు, ఖాకీ, నారింజ రంగులు కలిస్తే ఏర్పడే వర్ణంలాగా ఆ మెరుపు ఉంది. ఏం జరిగిందోనని నేను ఆశ్చర్యపోతుండగానే అంతా తెల్లగా మారింది. వెంటనే పెద్ద శబ్దం వినిపించింది. నేను భయంతో తలుపు వేసుకున్నాను" అని హదా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
బాంబు దాడి విధ్వంసాన్ని ఆమె తన కళ్లతో చూశారు. ఆమెకు కూడా విస్ఫోటనం కారణంగా గాయాలయ్యాయి.
‘‘ కోన్పిరా పర్వత ప్రాంతం నుంచి మా ప్రాంతానికి చాలామంది వచ్చారు. వారిలో ఎక్కువమంది చిరిగిన దుస్తులు, మాసిన తలలతో చిందర వందరగా ఉన్నారు. కొందరికి శరీరం కాలి చర్మం వేలాడుతూ కనిపించింది" అని చెప్పారామె.
"మా అమ్మ కొన్ని కండువాలు దుస్తులు తీసుకుని, మా కాలనీలో ఉన్న మరికొందరు మహిళలతో కలిసి గాయాలతో వచ్చిన వారిని వెంటబెట్టుకుని దగ్గర్లో ఉన్న ఓ కాలేజీ బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ వారంతా పడిపోయారు''
"వాళ్లు మంచినీళ్లు కావాలని అడిగారు. నీళ్లు అందించే పని నాకు పురమాయించారు. నేను ఒక చిప్ప పట్టుకుని దగ్గర్లో ఉన్న నది నుంచి నీళ్లు తీసుకువచ్చి వారికి అందించాను'' అని చెప్పారు రీకో హదా.
"కొంతమంది నీళ్లు తాగగానే మరణించారు. ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. వాళ్లెవరో నాకు తెలియదు. కానీ వారు మనుషుల్లాగా మాత్రం చనిపోలేదు'' అని ఆనాటి విషాదాన్ని హదా గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్టు 14, 1945 సంవత్సరంలో జపాన్ బేషరతుగా లొంగిపోయింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ వైట్హౌస్ దగ్గర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
"పెర్ల్ హార్బర్ ఘటన తర్వాత ఈరోజు కోసమే మనం ఎదురు చూస్తున్నాం. మొత్తం ప్రపంచం నుంచి ఫాసిజం తుడిచి పెట్టుకు పోయింది. ఇది జరుగుతుందని మనకు ముందే తెలుసు'' అన్నారు.
ఆ మరుసటి రోజే జపాన్ చక్రవర్తి హిరోహిటో తొలిసారి రేడియోలో ప్రసంగించారు. అమెరికాపై విరుచుకుపడ్డారు.
"జపాన్ను బేషరతుగా లొంగదీసుకునేందుకు అత్యంత క్రూరమైన బాంబును విసిరారు" అని విమర్శించారు.
"మనం యుద్ధం కొనసాగించాలి. ఎందుకంటే ఇది కేవలం జపాన్ జాతిని అంతమొందించడానికే కాదు, మొత్తం మానవాళినే నాశనం చేయడానికి చేసిన ప్రయత్నం'' అన్నారు చక్రవర్తి హిరోహిటో.
"మన చివరి శత్రువు లొంగిపోయాడు'' అని నాటి బ్రిటీష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ వ్యాఖ్యానించారు. "తూర్పున మనకు లభించిన విజయంలో అందిన సహకారం మరింత కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను'' అని అమెరికా చేసిన సాయానికి కృతజ్జతలు చెబుతూ ప్రధాని అట్లీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ లొంగిపోయిన తర్వాత అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలలో రెండురోజులపాటు విజయోత్సవ దినాలుగా పాటించారు. సంకీర్ణ దేశాలలో ఆగస్టు 15న లక్షలమంది ప్రజలు వీధులలోకి వచ్చి విక్టరీ ఓవర్ జపాన్ (వీజే) దినోత్సవం నిర్వహించారు.
లండన్లో బకింగ్ ప్యాలెస్ బాల్కనీలో నిలబడి రాజకుటుంబం ప్రజలకు అభివాదం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ లొంగుబాటుపై అధికారిక ఒప్పందం సెప్టెంబర్ 2న జరిగింది. టోక్యో తీరంలో నిలిచి ఉన్న యుద్ధనౌక యూఎస్ఎస్ మిస్సోరిలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
హిరోషిమాలోని 'ది అటామిక్ బాంబ్ డోమ్' ఈ దాడి తాకిడికి నిలిచిన కట్టడంగా చరిత్రలో మిగిలి పోయింది. దీన్ని వార్ మెమోరియల్గా గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
హిరోషిమాలోని పీస్ మెమోరియల్ పార్క్ సమీపంలో ఉన్న భవనాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














