Pakistan - Tea: 'దేశ ప్రజలారా.. టీ తాగడం తగ్గించండి.. ఆర్థికవ్యవస్థను కాపాడండి' - ప్రభుత్వం విజ్ఞప్తి

టీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్‌ పౌరులు ఒక్కొక్కరూ ఏడాదికి సగటున కేజీ టీ పొడిని వినియోగిస్తున్నారు
    • రచయిత, లియో శాండ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కుప్పకూలకుండా ఉండటానికి తాగే టీలు తగ్గించాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

జనం రోజూ తాగే టీ కప్పుల సంఖ్యను తగ్గించుకుంటే.. పాకిస్తాన్ భారీ దిగుమతుల ఖర్చులు తగ్గుతాయని సీనియర్ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు.

పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం రెండు నెలల దిగుమతులకు చెల్లించగల నిల్వలే ఉన్నాయి. దీంతో దేశానికి నిధులు అత్యవసరమయ్యాయి.

ప్రపంచంలో తేయాకును మరే దేశంకన్నా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్తాన్. గత ఏడాది 60 కోట్ల డాలర్ల (సుమారు 5,000 కోట్ల రూపాయలు) కన్నా ఎక్కువ విలువైన టీని పాక్ దిగుమతి చేసుకుంది.

''దేశ ప్రజలంతా రోజుకు ఒకటి, రెండు కప్పులు టీ తాగటం తగ్గించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం అప్పు మీద టీని దిగుమతి చేసుకుంటున్నాం'' అని మంత్రి ఇక్బాల్ కోరినట్లు పాకిస్తాన్ మీడియా కథనాలు తెలిపాయి.

కాగా, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయని, పెరిగిన ధరలను తగ్గించకుండా టీ తాగడం తగ్గించాలని ప్రజలను కోరడం తప్పు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అలాగే విద్యుత్‌ను ఆదా చేయటానికి మార్కెట్‌లలో వ్యాపారాలు, దుకాణాలు, స్టాల్స్‌ను రాత్రి 8:30 గంటల కల్లా కట్టివేయాలని సూచించారు.

ప్రజలు టీ తాగటం తగ్గించాలంటూ ప్రభుత్వం కోరటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనటం టీ తాగటం తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు పరిష్కారమవుతాయా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలలు ఫిబ్రవరిలో 1,600 కోట్ల డాలర్లుగా ఉంటే.. జూన్ మొదటి వారానికి 1,000 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తం.. ఆ దేశం చేసుకునే దిగుమతులన్నటికీ రెండు నెలల చెల్లింపులకు మాత్రమే సరిపోతంది.

ఈ నిధులను పొదుపుగా వినియోగించే ప్రయత్నంలో భాగంగా గత నెలలో.. నిత్యావసరం కాని లక్జరీ వస్తువుల దిగుమతిని ప్రభుత్వం నిలిపివేసింది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

పాకిస్తాన్‌లో ఏప్రిల్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త సర్కారుకు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం విషమ పరీక్షగా మాంది.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించిన షాబాజ్.. దానిని గాడిలో పెట్టటం పెద్ద సవాలవుతుందన్నారు.

పాక్ ఆర్థిక వ్యవస్థ ఏళ్ల తరబడి ఎదుగుదల లేకుండా స్తబ్దంగా ఉండిపోవటంతో పాటు విదేశీ మారక ద్రవ్యం నిల్వల కొరత వల్ల కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి గట్టెక్కటానికి పాక్ 2019లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణం తీసుకోవటానికి ఒప్పందం చేసుకుంది.

కానీ.. పాక్ ఆర్థిక వనరుల పరిస్థితుల గురించి ఐఎంఎఫ్ ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో ఐఎంఎఫ్ సహాయ ప్రాజెక్టు అర్ధంతరంగా ఆగిపోయింది.

దీనిని పునఃప్రారంభించేలా ఐఎంఎఫ్‌ను ఒప్పించటం లక్ష్యంగా షాబాజ్ మంత్రివర్గం గత వారంలో 4,700 కోట్ల డాలర్ల వ్యయ ప్రణాళికతో కొత్త బడ్జెట్‌ను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)