కిడ్నీ మార్పిడి: పంది మూత్రపిండాలను మనిషికి అమర్చిన అమెరికా డాక్టర్లు

పంది

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ హెల్త్ ఎడిటర్

ఒక వ్యక్తికి పంది మూత్రపిండాలను అమర్చారు అమెరికా డాక్టర్లు. అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నారు.

బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు.

న్యూయార్క్‌ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. దీనికి రెండు గంటల సమయం పట్టింది.

కిడ్నీ అమర్చిన తర్వాత అది సక్రమంగా పని చేస్తుందో లేదోనని వైద్యులు పరిశీలించారు.

పంది కిడ్నీ పరాయి జీవికి చెందిన అవయవమని గుర్తించి, మనిషి శరీరం తిరస్కరించకుండా దానికవసరమైన జన్యుపరమైన మార్పులు చేశారు.

ఈ రంగంలో ఇదొక ఆధునిక ప్రయోగం అని కొంతమంది నిపుణులు అంటున్నారు.

ఇటువంటి ప్రయోగాలు ఇతర జీవుల్లో చేశారు కానీ, మనుషులపై మాత్రం ఇప్పటి వరకు జరగలేదు.

అవయవ మార్పిడికి పందులను వాడటం కొత్త కాదు. పంది గుండె వాల్వులను మనుషులకు విరివిగా వాడారు. సైజు విషయానికి వస్తే, పంది అవయవాలు మనుషులకు సరిగ్గా అమరుతున్నాయి.

శస్త్ర చికిత్స రెండు గంటల సేపు సాగింది.

ఫొటో సోర్స్, NYU Langone

ఫొటో క్యాప్షన్, శస్త్ర చికిత్స రెండు గంటల సేపు సాగింది.

రెండున్నర రోజుల పాటు వారు కిడ్నీ పనితీరును పర్యవేక్షించారు. రకరకాల తనిఖీలు, పరీక్షలు నిర్వహించారు.

దీని గురించి ప్రధాన పరిశోధకులు డాక్టర్ రాబర్ట్ మాంట్‌గామెరీ బీబీసీకి వివరించారు.

"మనిషి కిడ్నీని ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు శరీరం పని చేసిన తరహాలోనే పంది మూత్రపిండాలు అమర్చినప్పుడు కూడా మనిషి శరీరం ప్రవర్తించడాన్ని గమనించాం. ఇది సాధారణంగానే పని చేసింది. మనిషి శరీరం దీనిని తిరస్కరించినట్లు కనిపించలేదు" అని చెప్పారు.

పంది మూత్రపిండాలతో పాటూ థైమస్ గ్రంథిని కూడా డాక్టర్లు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. దీని వల్ల దీర్ఘకాలంలో మనిషి శరీరం పంది మూత్రపిండాలను తిరస్కరించకుండా నిరోధిస్తుంది.

డాక్టర్ మాంట్‌గామెరీకి కూడా గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆయన చేసిన పని వివాదాస్పదం అని అంగీకరిస్తూనే వెయిటింగ్ లిస్ట్‌లో అవయవాల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అవయవాలను వెతకాల్సిన సత్వర అవసరం ఉందని ఆయన అన్నారు.

ఒకరు బతకడానికి మరొకరు ప్రాణాలు కోల్పోవాలనే పాత కాలపు ఆలోచన ఎప్పటికీ పురోగతివైపు తీసుకుని వెళ్లదని ఆయన అన్నారు.

"నేను ఈ విధానం గురించి ఎదురవుతున్న ఆందోళనను అర్థం చేసుకుంటాను. కానీ, అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 40 శాతం మంది రోగులు, వారికి అవయవం దొరికే లోపే మరణిస్తున్నారు"

"మనం పందులను ఆహారానికి, వాల్వుల లాంటి ఔషధ అవసరాలకు వాడతాం. ఇది కూడా దానికి భిన్నమైనదేమీ కాదు" అని చెప్పారు.

ఈ అధ్యయనం ప్రాథమిక స్థాయిలోనే ఉందని, దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాలని అన్నారు. కానీ, ఇది మనకు ఒక కొత్త నమ్మకాన్ని కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కిడ్నీ గ్రహీత కుటుంబం ఈ శస్త్ర చికిత్స చేసేందుకు అనుమతి ఇచ్చింది.

పరిశోధనల కోసం జన్యుపరంగా మార్పులు చేసిన పంది అవయవాలను వాడేందుకు యూఎస్ రెగ్యులేటర్ ఎఫ్‌డీఏ కూడా అనుమతినిచ్చింది.

మరో దశాబ్ద కాలంలో అవయవమార్పిడి అవసరమైన రోగులకు పంది గుండె, ఊపిరితిత్తులు, కాలేయం కూడా అమర్చవచ్చని మాంట్‌గామెరీ భావిస్తున్నారు.

శస్త్రచికిత్స వెనుకనున్న వైద్యుల బృందం

ఫొటో సోర్స్, NYU Langone

"జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడం గురించి కొన్ని దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నాం. కానీ, ఈ బృందం దీనిని ముందుకు తీసుకుని వెళ్లడం చూస్తుంటే ఆసక్తిగా ఉంది" అని కిడ్నీ ఇంటెన్సివ్ కేర్ వైద్యులు డాక్టర్ మర్యమ్ ఖోస్రావి అన్నారు.

ప్రస్తుతానికి జంతువుల అవయవాలను మనుషుల అవయవాలతో జత కలిసేలా చూడటం ప్రాధాన్యతగా ఉందని చెప్పారు.

"ఇలాంటి ట్రాన్స్‌ప్లాంట్లు జరగడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అన్నారు.

అవయవ మార్పిడి అవసరమైన రోగులకు పరిస్థితులను మెరుగు పరిచేందుకు అధ్యయనకారులు, వైద్యులు కృషి చేస్తున్నారు. అలాగే, అవయవదానానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)