కోవిడ్ వ్యాక్సీన్: భారత్ ఎగుమతులు ఆపేస్తే విదేశాలు విలవిల్లాడతాయా... కంగారు పడుతున్న దేశాలేవి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విజ్దన్ మొహమ్మద్ ఖవూసా
- హోదా, బీబీసీ మానిటరింగ్
భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి నుంచి ప్రారంభమైంది. పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ను తయారు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే వ్యాక్సీన్ తయారు చేస్తున్న అతి పెద్ద సంస్థ.
అంతర్జాతీయ కోవాక్స్ పధకంలో భాగంగా భారతదేశం పొరుగు దేశాలకు, విదేశాలకు విరాళాల రూపంలో గాని, లేదా అమ్మకానికి గాని వ్యాక్సీన్ సరఫరా చేస్తోంది. పేద దేశాలకు కూడా వ్యాక్సీన్ అందేటట్లు చూడటమే కోవాక్స్ లక్ష్యం.
ఎగుమతులకు బ్రేక్
దేశంలో రెండ్ వేవ్ కోవిడ్ కేసులు ప్రబలడంతో వ్యాక్సీన్ ఎగుమతులను భారత్ నిలిపివేసింది. అయితే, ఎగుమతులను పూర్తిగా నిషేధించలేదని, దేశీయ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.
మార్చి - ఏప్రిల్ నెలల మధ్యలో వ్యాక్సీన్ ఎగుమతులు 2.8 కోట్ల నుంచి 20 లక్షలకు అంటే 93 శాతం తగ్గాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
దేశంలో వ్యాక్సీన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వారాల ముందే ఈ వ్యాక్సీన్ ఎగుమతులు తగ్గిపోవడం మొదలయింది.

ఫొటో సోర్స్, REUTERS
ఇతర దేశాలపై ప్రభావం
వ్యాక్సీన్ల కోసం భారతదేశంపై ఆధారపడిన దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పై ప్రభావం పడింది. ఇప్పటి వరకు భారతదేశం 90కి పైగా దేశాలకు 6.64 కోట్ల వ్యాక్సీన్ డోసులను ఎగుమతి చేసింది.
అందులో 54 శాతం వాణిజ్య ఎగుమతులు కాగా 16 శాతం విరాళాలుగా ఇచ్చినవి. మిగిలిన 30 శాతం వ్యాక్సీన్లను కోవాక్స్ పథకం కింద ఎగుమతి చేస్తున్నారు.
విరాళాలుగా ఇచ్చిన 70 శాతం వ్యాక్సీన్లు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్, భూటాన్, శ్రీ లంక, మాల్దీవ్స్ లాంటి దేశాలకు ఎగుమతి అయ్యాయి.
ఇవి మొత్తం వ్యాక్సీన్ ఎగుమతుల్లో మూడు వంతులు. భారతదేశం ఈ దేశాలకు మొత్తం 1.86 కోట్ల డోసులను ఎగుమతి చేసింది.
కోవాక్స్ ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఆఫ్రికాకు వెళ్లాయి. మొరాకో, యూకే, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాలకు వాణిజ్య ఎగుమతులు వెళ్లాయి.
భారతదేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిన విషయం చాలా దేశాల వార్తా మాధ్యమాల్లో ప్రచురించారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనెకా వ్యాక్సీన్ మరో 10 రోజుల్లో అయిపోతున్నట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ఢాకా ట్రిబ్యూన్ ప్రచురించింది.
దీంతో ఆ దేశంలో 10.5 లక్షల మంది ప్రజలు రెండవ డోసు వ్యాక్సీన్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. "ఈ ప్రక్రియ పూర్తి కావడానికి బంగ్లాదేశ్ కు మరో 20.79 లక్షల డోసుల అవసరముందని పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, UNICEF
భారతదేశం నుంచి వ్యాక్సీన్ దిగుమతుల్లో జాప్యం జరగడంతో ఆ దేశం వ్యాక్సినేషన్ నమోదు ప్రక్రియను ఆపేసిందని భారతీయ పత్రిక ఎకనమిక్ టైమ్స్ రాసింది. దీంతో, బంగ్లాదేశ్ చైనా వ్యాక్సీన్ సైనో ఫార్మ్, రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్ల వాడకానికి అత్యవసర ఆమోదం తెలిపినట్లు ఆ పత్రిక రాసింది.
నేపాల్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆపినట్లు ది ఖాట్మండు పోస్టు పేర్కొంది. భారతదేశం నేపాల్ కు 20.5 లక్షల డోసులను ఎగుమతి చేసింది. అందులో 10 లక్షలు వాణిజ్యపరంగా ఎగుమతి చేసినవే.
నేపాల్ ఇంకా మిగిలిన 10 లక్షల డోసుల కోసం ఎదురు చూస్తోంది. వీటి కోసం నేపాల్ ఇప్పటికే 80 శాతం చెల్లింపులు కూడా చేసింది.
"నేపాల్ 65 సంవత్సరాలు నిండిన 10.35 లక్షల మందికి మే నెలలో రెండవ డోసు వ్యాక్సీన్ ఇవ్వాలని చూస్తోంది. కానీ, ప్రభుత్వం దగ్గర అందుకు తగిన వ్యాక్సిన్లు లేవు" అని ఆ రిపోర్టు తెలిపింది.
ఈ వ్యాక్సిన్లను సత్వరమే సరఫరా చేయని పక్షంలో నేపాల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయలేమని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి చెప్పినట్లు ది హిందూ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS
ఆఫ్రికాలోనూ ప్రభావం
’’భారత దేశం ఎగుమతులు నిలుపు చేయడంతో చాలా దేశాలు వ్యాక్సీన్ కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాయి‘‘ అని జర్మనీ మీడియా సంస్థ డాయిష్ వెల్ పేర్కొంది.
ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు భారతదేశం నుంచి వెళ్లే ఎగుమతులు వెన్నెముక లాంటివని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ ఆగ్వేల్ చెప్పారు.
"వ్యాక్సీన్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లను కొనుగోలు చేసిన ఇరవైకి పైగా దేశాలపై ప్రభావం పడింది" ఆగ్వేల్ చెప్పారు.
ఎగుమతుల నిలిపివేత ఆఫ్రికా వ్యాక్సినేషన్ ప్రణాళికలను తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
"ఆఫ్రికాలో ఉన్న 60 కు పైగా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రణాళికలకు ఆటంకం కలగవచ్చు" అని తెలిపింది. భారతదేశం ఎగుమతి చేసే వ్యాక్సిన్ల పై 35 దేశాలు ఆధారపడ్డాయని యూకేకు చెందిన స్కై న్యూస్ తెలిపింది.
"ఈ డోసులను తీసుకుంటున్న 98 శాతం వారిలో అల్పాదాయ దేశాల ప్రజలు ఉన్నారు" అని పేర్కొంది.

ఫొటో సోర్స్, SA GOVERNMENT
భవిష్యత్తు అయోమయం
భారతదేశం ఎగుమతులను ఎప్పటికి చేస్తుందనే విషయంపై స్పష్టత లేదు. ఇండియా ఆస్ట్రా జెనెకా ఎగుమతులను జూన్ నుంచి మొదలుపెట్టవచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అడార్ పూనావాలా ఏపి వార్తా సంస్థతో చెప్పారు.
కానీ, భారతదేశంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గితేనే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కంపెనీ చేసుకున్న ఒప్పందాలను కూడా పక్కన పెట్టి భారతదేశంలో చేసే సరఫరాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.
భారతదేశంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గకపోతే దేశీయ సరఫరాలు కొనసాగించాల్సి వస్తుందని కూడా ఆయన అన్నారు. దేశాన్ని కాపాడవలసిన అవసరం ఉందని అన్నారు.
అయితే, వ్యాక్సీన్ల ఎగుమతుల పై కచ్చితమైన నిషేధాలు అమలు కానప్పటికీ , ఈ ఎగుమతులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయనే అంశం పై స్పష్టత లేదు.
భారతదేశంలోనే వ్యాక్సీన్ల ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతున్నందున ఎగుమతుల్లో జాప్యం జరగవచ్చని అవర్ వరల్డ్ డేటా చెబుతోంది.
ఈ వ్యాక్సీన్ల జాప్యం, అనిశ్చితి వల్ల వ్యాక్సీన్ డోసులకు డబ్బులు ముందుగానే చెల్లించిన నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కలవపడుతున్నాయి.

ఫొటో సోర్స్, REUTERS
నేపాల్ 20 లక్షల డోసులకు డబ్బులు చెల్లించగా, ఇప్పటి వరకు కేవలం 10లక్షల డోసులు మాత్రమే అందినట్లు ది ప్రింట్ పేర్కొంది.
శ్రీ లంక 10.5 లక్షల డోసుల కోసం డబ్బులు చెల్లించి వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తోంది. వ్యాక్సీన్ ఎగుమతులు మొదలవ్వడానికి మరో 6 నెలల సమయం పట్టవచ్చని శ్రీ లంక భావిస్తోంది.
బంగ్లాదేశ్ కు పంపిస్తానన్న డోసులను పంపిస్తుందో లేదో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇంకా చెప్పాల్సి ఉందని ఢాకా ట్రిబ్యూన్ రాసింది.
ఒప్పందం ప్రకారం పంపాల్సిన డోసులను పంపలేకపోతే డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది.
వ్యాక్సీన్ ఎగుమతుల విధానాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఏప్రిల్ 19న సమర్ధించుకున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. వ్యాక్సీన్లను ఎగుమతి చేయకుండా వాటికి కావల్సిన ముడి పదార్ధాలను పొందడం కష్టమని ఆయన అన్నారు.
దీనిని బట్టి చూస్తే భారతదేశం విదేశాల నుంచి వచ్చిన ఆర్డర్లను రద్దు చేసేటట్లు కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కోవిడ్: పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కేసుల పెరుగుదలకు ఇండియన్ వేరియంటే కారణమా
- 'పెళ్లైతే భర్త పేరు తగిలించుకోవాలా?': పాకిస్తాన్ అమ్మాయిల్లో మారుతున్న ట్రెండ్
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- బాలాకోట్ వైమానిక దాడికి రెండేళ్లు.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- సైనోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








