క్లౌడ్ సీడింగ్: కృత్రిమ వాతావరణ మార్పులకు పూనుకుంటున్న చైనా.. ఆందోళన వ్యక్తం చేస్తున్న పొరుగు దేశాలు

తైవాన్ వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ప్రపంచంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో చైనా రాజధాని బీజింగ్ కూడా ఒకటి. కానీ, ఏదైనా ఒకరోజు వాతావరణం తేట పడి, సూర్యకిరణాలు స్వచ్ఛంగా భూమి మీదకు వాలుతున్నాయంటే ఆరోజు బీజింగ్ నగరంలో ఏదో ఒక ముఖ్యమైన రాజకీయ సమావేశమో లేదా అంతర్జాతీయ స్థాయి కార్యక్రమమో జరుగుతున్నట్టు లెక్క. అయితే, ఇదేమీ యాదృచ్చికం కాదు.

ఎన్నో ఏళ్లుగా చైనా ప్రభుత్వ యంత్రాంగం వాతావరణంలో కృత్రిమ మార్పులు తెచ్చే కార్యక్రమాలు చేపడుతోంది. ఈ దిశగా మరో అడుగు ముందుకేస్తూ గత డిసెంబర్‌లో చైనా తన కార్యాచరణను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది.

2025 కల్లా 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ వర్షం లేదా మంచు కురిపించే ప్రోజెక్ట్ చేపట్టాలనే ఆలోచనలో ఉంది. అంటే చైనా భూభాగంలో దాదాపు 60 శాతానికి ఈ ప్రణాళికను విస్తరిస్తున్నట్టు లెక్క.

కాగా, భారత్ లాంటి పొరుగు దేశాలు ఈ సాంకేతిక విధానం కలిగించే ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, కొత్తగా వాతవరణంలో కృత్రిమ మార్పులు సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

క్లౌడ్ సీడింగ్

ఫొటో సోర్స్, Getty Images

చైనా వాతావరణంలో కృత్రిమ మార్పులను ఎలా తీసుకొస్తుంది?

ఈ పద్ధతిని "క్లౌడ్ సీడింగ్" అంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికత ప్రసిద్ధి చెందింది.

సిల్వర్ అయోడైడ్‌లాంటి పదార్థాలను మేఘాల్లోకి విస్తరింపజేయడం ద్వారా కృత్రిమ వర్షపాతాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తారు.

"అనేక దేశాలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. చాలాకాలంగా చైనా దీన్ని ఉపయోగిస్తోంది. భారత్ కూడా గతంలో ఈ పద్ధతిని ఉపయోగించింది" అని వాతావరణ నిపుణులు ధనశ్రీ జయరాం తెలిపారు. ఈమె కర్ణాటకలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్‌లో పని చేస్తున్నారు.

"ఈ పద్ధతిని సబ్-సహారన్ ఆఫ్రికాలోనూ, ఆఫ్రికా ఖండం ఈశాన్య భూభాగంలో కూడా ఉపయోగించారు. ఆ ప్రాంతాల్లో కరవు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో కూడా ఈ పద్ధతిని ఉపయోగించి కృత్రిమ వాతావరణ మార్పులను కలుగజేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, అవన్నీ కూడా ప్రస్తుతం చైనా రచిస్తున్న ప్రణాళిక కన్నా చాలా చిన్న స్థాయిలో జరిగినవి" అని జయరాం తెలిపారు.

క్లౌడ్ సీడింగ్ పద్ధతి ఇప్పటిది కాదు. దీని వెనుక చాలా చరిత్రే ఉంది. ఈ సాంకేతికతను 1940లలో కనుగొన్నారు. అయితే, దీని ఫలితాలపై ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి.

"దీని ప్రభావాలపై చాలా తక్కువ సైన్స్ వ్యాసాలు వెలువడ్డాయి" అని బీజింగ్ నార్మల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ జాన్ సీ మూర్ తెలిపారు.

"ఏ రకమైన శాస్త్రీయ నిర్థరణ జరగకుండానే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని అభివృద్ధి పరిచారు. చైనాలో క్లౌడ్ సీడింగ్ ఉపయోగించి వాతావరణ మార్పులను తీసుకురావడం కార్యాచరణకు సంబంధించిన అంశమే తప్ప శాస్త్రీయ అధ్యయనం కాదు. ఇందులో శాస్త్రీయత ఏమీ లేదు. దీన్ని ప్రాథమిక స్థాయిలో పరిమిత ప్రదేశాల్లో ఉపయోగిస్తారు" అని ఆయన చెప్పారు.

బీజింగ్‌లో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించి వాతవరణం తేట పడేటట్లు చేస్తారు. అప్పుడప్పుడూ కొన్ని నిర్దిష్ట కార్యక్రమాలకు అంటే వార్షిక పార్లమెంటరీ సెషన్లు లేదా ఏదైనా ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేస్తున్నప్పుడు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

చైనాలో 50,000 నగరాలు, పట్టణాలలో వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లకుండా ఉండేదుకు క్రమం తప్పకుండా క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగుస్తున్నారని మూర్ తెలిపారు.

"వడగళ్ల వాన పడి పంటలు నాశనం కాకుండా ఉండేందుకు క్లౌడ్ సీడింగ్ పద్ధతి వాడతారు. ప్రమాదకరంగా మారడానికి ముందే మేఘాల్లోంచి వర్షాన్ని తొలగిస్తారు" అని ఆయన చెప్పారు.

అయితే, చైనాలో ఏడాదికి ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే క్లౌడ్ సీడింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ది న్యూ సైంటిస్ట్ మ్యాగజీన్‌లో 2020 ఫిబ్రవరిలో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం.. క్లౌడ్ సీడింగ్ వలన 10% కంటే తక్కువగానే వర్షపాతం నమోదవుతుంది.

చైనాలో వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

ఈ వర్షాలు ఎవరికి సొంతం?

కృత్రిమ వాతావరణ మార్పులను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళిక గురించి గత ఏడాది డిసెంబర్ 2న చైనా స్టేట్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.

విపత్తుల నుంచి రక్షణ, వ్యవసాయ ఉత్పత్తి, అడవుల్లో, పచ్చిక భూములలో రగిలే కార్చిచ్చు, అసాధారణ ఉష్ణోగ్రతలు, కరవు సమస్యల నిర్వహణలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.

"ఈ ప్రణాళిక ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్యక్రమాన్ని రూపొందిస్తుందని, స్థానిక ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటాయని తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందిస్తుంది" అని బీజింగ్‌లోని బీబీసీ ప్రతినిధి యిట్సింగ్ వాంగ్ తెలిపారు.

ఈ ప్రకటన విడుదల అయిన నెలలోపే చైనా తొలి డ్రోన్ గన్లిన్-1 (చైనీస్ భాషలో తియ్యటి వర్షం అని అర్థం)ను ప్రవేశపెట్టి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

అయితే, ఈ పద్ధతి అందించే ఫలితాలపై సందేహాలు ఉన్నప్పటికీ, చైనా ఈ ప్రాజెక్టుపై భారీగా పెట్టుబడులు పెట్టింది.

దాంతో, ఇరుగు పొరుగు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. సరిహద్దుల్లో భౌగోళిక, రాజకీయ వివాదాలు పెరుగుతున్న సమయంలో వాతావరణంలో కృత్రిమ మార్పులు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయన్న దానిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

"భారత్‌కు వచ్చే రుతుపవనాలపై ఈ సాంకేతికత ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఒక పెద్ద సందేహం. ఇది ఈ మొత్తం ప్రాంతానికి ఎంతో కీలకం. అయితే, ఈ అంశంలో ఎక్కువ అధ్యయనాలు లేవు" అని ధనశ్రీ జయరాం తెలిపారు.

చైనాతో సత్సంబంధాలు కొనసాగుతున్నట్లైతే ఇంత ఆందోళన ఉండకపోయుండేదని జయరాం అభిప్రాయపడ్డారు.

సరిహద్దుల వద్ద గత కొద్ది కాలంగా పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశంలో చైనా వ్యతిరేక భావనలు పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాన 'దొంగతనం'

కృత్రిమ వాతావరణ మార్పులకు సంబంధించిన కార్యక్రమాల్లో సమన్వయం లోపిస్తే ఇరుగు పొరుగు దేశాల మధ్య "వర్షాన్ని దొంగిలించారనే" ఆరోపణలు రావొచ్చని నేషనల్ తైవాన్ యూనివర్సిటీ నుంచి 2017లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనంలో పరిశోధకులు వివరించారు.

అయితే, ఆసియా రుతుపవనాలకు సంబంధించిన పరిస్థితి కొంత సున్నితమైనదే అయినా ఇలాంటి ఆరోపణలకు మద్దతు ఇవ్వగల శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని మూర్ అంటున్నారు.

"టిబెట్ పీఠభూములకు, హిందూ మహాసముద్రానికి మధ్య ఉష్ణోగ్రతల్లో ఉన్న వ్యత్యాసాలు రుతుపవనాలు ఏర్పడడానికి ఒక కారణం. కాబట్టి టిబెట్ పీఠభూములలో గణనీయమైన వాతావరణ మార్పులు తీసుకొస్తే, అది రుతుపవనాలపై తీవ్ర ప్రభావాలు చూపుతుందనే అనిపిస్తోంది" అని మూర్ అభిప్రాయపడ్డారు.

అభిప్రాయపడుతున్నారు.

బీజింగ్‌లో మంచు

ఫొటో సోర్స్, Getty Images

'కౌబాయ్ బిల్డర్స్'

మొత్తం టిబెట్ పీఠభూమి అంతటా పెద్ద ఎత్తున క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ప్రాంతీయ స్థాయిలో కొందరు చైనా ఇంజనీర్లు ప్రణాళికలు వేస్తున్నారన్న విషయాన్ని మూర్ సూచించారు. అయితే ఈ కార్యక్రమానికి కేంద్ర స్థాయి మద్దతు లేదని, ముందస్తు పరిశోధనలు కూడా జరగలేదని ఆయన తెలిపారు.

"ఎలాక్ మస్క్ రూపొందిస్తున్న స్పేస్‌షిప్ ప్రోగ్రాం చూసి కాపీ కొట్టినట్టు కొంతమంది కౌబాయ్ బిల్డర్స్ (పెద్దగా నైపుణ్యం లేనివారు) ఇలాంటి క్లౌడ్ సీడింగ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలాంటి విధానాలు చూసి అనేకమంది చైనీస్ శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని" మూర్ చెప్పారు.

కాగా, ఈ మొత్తం వ్యవహారం క్లౌడ్ సీడింగ్‌ను మించి ఆందోళనలను రేకెత్తిస్తోందని జయరాం భావిస్తున్నారు. ఇతర దేశాలను సంప్రదించకుండా రేపు చైనా ఇంతకన్నా పెద్ద జియోఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రోజెక్ట్‌లను చేపట్టే అవకాశం ఉందేమో అనే సందేహాలు తలెత్తుతాయని ఆమె అన్నారు. సోలార్ రేడియేషన్‌ను కంట్రోల్ చెయ్యడంలాంటి ప్రోజెక్ట్‌లు చేపడితే మరింత కష్టమని, ముఖ్యంగా ప్రస్తుతం పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేనప్పుడు.. ఇలాంటి ప్రోజెక్టులు మరింత భయాందోళనలను కలిగిస్తాయని జయరాం అభిప్రాయపడ్డారు.

"క్లౌడ్ సీడింగ్ పద్ధతి మరీ అంత భయపడాల్సినదేం కాదు. అది సత్ఫలితాలను ఇవ్వొచ్చు కూడా. కానీ, ఎవరినీ సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, అవి దుష్ఫలితాలను ఇస్తే ఎవరిది పూచీ? ఆ భారాన్ని ఎవరు వహిస్తారు?" అంటూ జయరాం సందేహాం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రోజెక్ట్‌లను, దీనివలన కలగగలిగే ఘర్షణలను రెగ్యులేట్ చెయ్యడానికి ఒక అంతర్జాతీయ వ్యవస్థ అవసరమని జయరాం భావిస్తున్నారు. మూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే, చైనాలో జియోఇంజినీరింగ్ ప్రోగ్రాంకు నాయకత్వం వహిస్తున్నా మూర్.. ఆందోళన చెందవద్దని, చైనా మంచి దేశంగా పేరు తెచ్చుకోవడానికే మొగ్గు చూపుతుందని హామీ ఇచ్చారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)