భారతదేశం అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానాన్ని మార్చుకుంటుందా? - అభిప్రాయం

ఫొటో సోర్స్, AFP
అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న విధానాన్నే భారత్ ఇప్పటికీ పాటిస్తోందని, అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
జమ్మూకశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని భారత్ సవరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో అణ్వాయుధ వినియోగం విషయంలో భారత రక్షణ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
భారత్, పాక్ రెండూ అణ్వస్త్ర దేశాలే. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు, విధానాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి కూడా ఉంటుంది.
విధానపరంగా భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా, అంతర్జాతీయంగా ప్రతిచర్యలు ఎదురుకావొచ్చు.
రాజ్నాథ్ వ్యాఖ్యల గురించి రక్షణ వ్యవహారాల నిపుణుడు రాహుల్ బేదీ బీబీసీతో మాట్లాడారు.
రాబోయే కాలంలో ప్రతిచర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి, ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం బాగా ఆలోచించే తీసుకుంటుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాహుల్ బేది చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ మొదటి సారి కాదు.
మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అణ్వాయుధాలు మొదట ఉపయోగించకూడదన్న విధానం సరికాదని, దానిలో మార్పులు తేవాలని కోరుకుంటున్నానని అన్నారు.
అయితే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు.
రాజ్నాథ్ మాత్రం ఇప్పుడు రక్షణ మంత్రి హోదాలోనే ఈ విషయం గురించి మాట్లాడారు. ఈ అంశంపై బీజేపీ సర్కారులో చర్చోపచర్చలు జరుగుతున్నాయడానికి దీన్ని సంకేతంగా భావించొచ్చు.
1998లో భారత్ ఫోఖ్రాన్లో అణ్వాయుధ పరీక్షలు జరిపినప్పుడు, అప్పుడు ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్కు లేఖ రాశారు. చైనాను ఎదుర్కొనేందుకే తాము ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
ఈ లేఖ బయటకు పొక్కి, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో అచ్చైంది. దీనిపై పెద్ద దుమారమే రేగింది.

ఫొటో సోర్స్, others
ఆ రెండు దేశాలే..
భారత విధానం మార్చుకుంటే, అంతర్జాతీయంగా ప్రతిచర్యలు ఎదురవ్వొచ్చు.
అందరి కన్నా ముందు పాకిస్తాన్, చైనా స్పందిస్తాయి. ఎందుకంటే, భారత్తో ఈ రెండు దేశాలూ సరిహద్దులు పంచుకుంటున్నాయి. పైగా మూడు దేశాలకూ అణ్వాయుధాలున్నాయి.
పాకిస్తాన్తో, చైనాతో భారత్కు సరిహద్దు వివాదాలున్నాయి. అందుకే, విధాన మార్పు చాలా తీవ్రమైన అంశమే అవుతుంది.
అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న విధానాన్ని 'రీటాలియెట్రీ డాక్ట్రిన్ (ప్రతిచర్య సిద్ధాంతం)' అంటారు.
అంటే, తమపై ఇతరులు అణ్వాయుధ దాడి చేసిన తర్వాతే, భారత్ తిరిగి అణ్వాయుధాలతో ప్రతిస్పందిస్తుంది.
ఇలాంటి విధానాలపై చాలా చర్చించే నిర్ణయం తీసుకుంటారు. వాజ్పేయి వర్ధంతికి నివాళులు అర్పిస్తూ రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా సంకేతం పంపాలన్న ఉద్దేశం ఉండుండొచ్చు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- అమెరికా ఇతర దేశాల నుంచి ఎన్ని భూభాగాలను ఎంత ధరకు కొన్నదో తెలుసా
- ఆర్టీఐ కింద వర్షపాతం వివరాలు కావాలంటే.. రూ. 20 లక్షల ఫీజు చెల్లించాలట
- నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్సును ఎలా దొంగిలించారంటే..
- పారీక్: పాకిస్తాన్లో ఉర్రూతలూగిస్తున్న పాట.. మీరు విన్నారా?
- అమ్మానాన్నలు కావాలన్న వీళ్ల ఆశలు ఫలిస్తాయా?
- గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?
- 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సృష్టించడమే లక్ష్యం: ఆర్థిక సర్వే
- దక్షిణాఫ్రికా: 'నాజీ మండేలా' చిత్రంపై వివాదం
- ప్రకృతిని కాపాడేందుకు వేటను వదిలేసిన ఆదివాసీలు
- అమెరికాలో హరికేన్ ఫ్లోరెన్స్: వాళ్లు తిరిగి వచ్చేసరికి వాళ్ల ఇళ్లు ఉంటాయో ఉండవో
- ‘నా కుమారుడు స్వలింగ సంపర్కుడు.. అలా చెప్పుకోవడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








