పారీక్: పాకిస్తాన్లో ఉర్రూతలూగిస్తున్న పాట.. మీరు విన్నారా?
పాకిస్తాన్లోని ఖైబర్ పక్తుంక్వా ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు పాటలతో అందరినీ ఉర్రూతలూగిస్తున్నారు. వీళ్లు కలాష్ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయిలు. ఆ తెగకు చెందిన ప్రజలు ఇప్పుడు కొన్ని వేల మంది మాత్రమే మిగిలారు.
తమ పాటలతో ఇటీవల జనాలను ఉర్రూతలూగించిన ఆరియానా, అమ్రీనాలను బేంబొరైత్ లోయలో బీబీసీ ప్రతినిధి హమైరా కన్వాల్ కలిశారు. వారి సంగీత ప్రయాణం గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ.. ''ఎవరో అతిథులు వచ్చారని మా ఆంటీ మా అమ్మకు చెప్పారు. వాళ్లు కోక్ స్టూడియో నుంచి వచ్చారని మాకు తెలీదు. వచ్చిన వారెవరని అడిగా. అందుకు జవాబుగా ఆమె మేము అక్కడ పాట పాడాలి అంది. మరి వాళ్లకు నా గురించి కూడా చెప్పొచ్చు కదా అన్నాను. వాళ్లు నా కోసం రేపు మళ్లీ వస్తే బాగుండు అనుకుంటూ నిద్రపోయాను'' అన్నారు.
''ఉదయాన్నే పర్వానా జాన్ వాళ్ల అమ్మ మా ఇంటికి వచ్చింది. ఆమె అమ్మతో రాంబూర్లో ఎవరో చనిపోయారు కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్లు పాటలు పాడితే బాగుండదు. అందుకే పిల్లల్ని పంపిద్దాం అని చెప్పారు. అలా నేను పాడటం కోసం తయారయ్యాను. అవును, ఎందుకు వెళ్లకూడదు? వెళ్తాను. ఎందుకంటే, నేను వెళ్లాలి అని ముందు నుంచే అనుకుంటున్నాను. తర్వాత అమ్రీనాను పిలిచాను. ఇద్దరం కలిసి వెళ్లాం. పాట పాడాం'' అని అరియానా వివరించారు.

ఫొటో సోర్స్, cokestudio
''పాట పాడాక.. ఎన్ని కామెంట్లు వచ్చాయో, ఎంత మంది లైక్ చేశారో అని ఐదారు రోజులపాటు ఆ వీడియోను చూస్తూనే ఉన్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది'' అని తన పాటకు వచ్చిన స్పందనను వివరించారు.
''నాకు గాయని అవ్వాలని ఉందని మా అమ్మకు చెబుతుండేదాన్ని. అలా అన్నప్పుడు ఆమెకు కోపం వచ్చేది. నువ్వేమో పాటలు పాడు, మీ అన్న డ్యాన్స్ చేస్తాడు అనేది. మా అన్నకు డ్యాన్సర్ అవ్వాలని ఉంది. అమ్మా, నీ పిల్లలు భిన్నంగా ఆలోచిస్తున్నందుకు నువ్వు సంతోషంగా ఉండాలి అని ఆమెతో అనే దాన్ని'' అంటూ అరియానా తమ ఇంట్లో ఏమనుకుంటున్నారో వివరించారు.
వారి పాట.. మాట కోసం పై వీడియోను చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









