జులై 16న ఫిన్‌లాండ్‌లో ట్రంప్, పుతిన్ భేటీ

ట్రంప్, పుతిన్

ఫొటో సోర్స్, AFP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకీలో భేటీ కానున్నారు.

జులై 16న ఈ సదస్సు జరుగనుంది. ఇందులో ఇరు దేశాల సంబంధాలు ‘జాతీయ భద్రతకు సంబంధించిన పలు అంశాల’పై ఇరువురు నాయకులూ చర్చలు జరుపుతారని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ తెలిపింది.

బుధవారం మాస్కోలో పుతిన్‌తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సమావేశమైన తర్వాత ఈ సదస్సుపై ప్రకటన వెలువడింది.

ట్రంప్, పుతిన్‌ చివరిసారిగా గత ఏడాది నవంబర్‌లో వియత్నాంలో జరిగిన ఆసియా-పసిఫిక్ సదస్సులో కలిశారు.

పుతిన్‌ను కలిసినప్పుడు సిరియా యుద్ధం, ఉక్రెయిన్‌లో పరిస్థితులపై చర్చిస్తానని గతంలో ట్రంప్ అన్నారు.

రష్యా అధ్యక్షుడితో ‘సమావేశానికి ఉన్న అవకాశాల’ను పరిశీలించాలని ట్రంప్ తనను కోరినందువల్లే మాస్కో వచ్చానని పుతిన్‌తో భేటీ అనంతరం బోల్టన్ విలేకరులతో తెలిపారు.

అమెరికా, రష్యా మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇరువురు నాయకులూ ఈ సదస్సును ఉపయోగించుకోవాలనుకుంటున్నారని ఆయన చెప్పారు.

‘‘అత్యంత కీలకమైన ఈ రెండు దేశాల నాయకులూ కూర్చుని పరస్పర సమస్యలు, వివిధ రంగాల్లో సహకారంపై చర్చించుకోవటం ముఖ్యమని ట్రంప్, పుతిన్‌ ఇద్దరూ భావిస్తున్నారు’’ అని బోల్టర్ వెల్లడించారు.

‘‘వీరిద్దరూ కలసి అమెరికా-రష్యా ద్వైపాక్షిక సంబంధాలను, ప్రపంచంలో సుస్థిరతను మెరుగుపర్చేందుకు కృషి చేస్తారని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

అమెరికాతో సంబంధాలు చక్కగా లేవని అంగీకరించిన పుతిన్.. వాటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలమన్న ఆశలను బోల్టన్‌తో సమావేశం రేకెత్తించిందని చెప్పారు.

రష్యా ఎన్నడూ ఘర్షణను కోరుకోలేదని, అమెరికాలో అంతర్గతంగా నెలకొన్న తీవ్రమైన రాజకీయ సంఘర్షణల ఫలితంగానే ఇరు దేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయని తాను భావిస్తున్నానని పుతిన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)