Ponniyin Selvan: ఈ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన నవల కథ ఏంటంటే..

ఫొటో సోర్స్, Lyca Productions
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ తమిళ్
మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా 'పొన్నియిన్ సెల్వన్' శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.
మల్టీస్టారర్ సినిమా అయిన పొన్నియన్ సెల్వన్లో కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నటించారు.
దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించగా, సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రాశారు. సినిమాటోగ్రఫర్గా రవి వర్మన్ పనిచేశారు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించింది.

ఫొటో సోర్స్, Lyca Productions
పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారం
పొన్నియిన్ సెల్వన్ అనేది ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు. తన మ్యాగజీన్ 'కల్కి' కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు.
చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. పరాంతక చోళునికే సుందర చోళ అనే మరో పేరు కూడా ఉంది.
కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి.
ప్రముఖ చరిత్రకారులు కె.ఎ. నీలకంఠ శాస్త్రి రాసిన 'ది చోళాస్' పుస్తకం, టి.వి. సదాశివ బండారుతార్ రచించిన 'హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్', ఆర్. గోపాలన్ రాసిన 'పల్లవాస్ ఆఫ్ కంచి' అనే పుస్తకాల ఆధారంగా కల్కి ఈ నవలను రాశారు.
ఈ నవల కోసం చోళులు పాలించిన అనేక ప్రాంతాల్లో కల్కి పర్యటించారు. తంజావూరు, నాగపట్టణం, తిరువారూర్, అరియలూరుతో పాటు శ్రీలంకలో కూడా పర్యటించారు.
ఆయన వెంట మణియన్ అనే చిత్రకారుడు కూడా వెళ్లారు. కల్కి మ్యాగజీన్లో పొన్నియన్ సెల్వన్ నవలలో ప్రచురించిన చిత్రాలన్నీ మణియన్ గీశారు. ఈ నవల 2,400 పేజీలు ఉంటుంది. దీన్ని 5 భాగాలుగా రాశారు.

ఫొటో సోర్స్, MADRAS TALKIES
పొన్నియిన్ సెల్వన్ కథ ఏంటి?
పరాంతక చోళుడు-2 పాలన చివరి సంవత్సరాల గురించి ఈ నవలలో పేర్కొన్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. వారు కుందవై, ఆదిత్య కరికాలన్, అరుల్ మొళి వర్మన్.
ఆదిత్య కరికాలన్కు 'యువరాజు' అనే బిరుదు దక్కింది. పరాంతక చోళుని తర్వాత అదిత కరికలన్ రాజు అవుతాడు.
కాంచీపురంలో అదిత కరికలన్ ఒక బంగారు భవనాన్ని నిర్మిస్తాడు. ఆ తర్వాత తంజావూరులో ఉండే తన తండ్రి పరాంతక చోళుడిని కాంచీపురంలోని బంగారు భవనంలో నివసించడానికి రావాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి, దాన్ని తన మిత్రుడు వందియతేవన్కు ఇచ్చి పంపిస్తాడు.
ఆ ఉత్తరం తీసుకొని వందియతేవన్, తంజావూరుకు బయల్దేరతాడు. మార్గం మధ్యలో కదంపూర్ అనే భవనంలో వందియతేవన్ విశ్రాంతి తీసుకుంటాడు.
అదే సమయంలో చోళ రాజ్య కోశాధికారి పలువెట్టయార్ నేతృత్వంలో ఆదిత్య కరికాలన్కు వ్యతిరేకంగా చేసిన కుట్ర గురించి వందియతేవన్ తెలుసుకుంటాడు.

ఫొటో సోర్స్, Lyca Productions
అదిత్య కరికలన్ ఇచ్చిన ఉత్తరాన్ని కుందవై, పరాంతక చోళుడికి వందియతేవన్ అందజేస్తాడు. శ్రీలంకలో యుద్ధంలో తలపడుతోన్న తన తమ్ముడు అరుల్ను తీసుకురావాల్సిందిగా కోరుతూ కుందావై, వందియతేవన్ను శ్రీలంకకు పంపిస్తుంది. దీంతో వందియతేవన్, శ్రీలంక వెళ్తాడు.
పలువెట్టరైయార్ అదే సమయంలో అరుల్ మొళి వర్మన్ను బందీగా తీసుకురావడానికి శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు. వందియతేవన్, అరుల్ మొళి వర్మన్లను తీసుకువస్తుండగా ఆ ఓడలు తుపానులో చిక్కుకుంటాయి. వీరిద్దరిని పూంగుళలీ అనే ఒక జాలరి కాపాడుతుంది.
అరుల్మొళి వర్మన్ అనారోగ్యం పాలవ్వడంతో చికిత్స కోసం నాగపట్టణంలోని ఒక బౌద్ధ మందిరానికి తీసుకు వెళతారు.
అదే సమయంలో ఆదిత్యను సింహాసనం నుంచి తప్పించి తన పినతండ్రి మధురాంతకన్ను గద్దె ఎక్కించాలనే పలువెట్టయార్ కుట్రలు ఊపందుకుంటాయి. ఈ కుట్రలో పలువెట్టయార్ భార్య నందిని కూడా చురుగ్గా పాల్గొంటుంది.
ఆదిత్య కరికలన్ను కదంబూర్ అనే ప్రాంతంలోని ఒక భవనంలోకి పిలిపించి హత్య చేయాలని పథకం పన్నుతారు. పథకం ప్రకారమే ఆదిత్యను హత్య చేస్తారు. ఈ హత్యా నేరం వందియతేవన్పై పడుతుంది.
ఆ తర్వాత తనపై పడిన నింద నుంచి వందియతేవన్ ఎలా బయటకువచ్చాడు? పలువెట్టయార్ ఏమయ్యాడు? వందియతేవన్, కుందవై మధ్య ప్రేమకథ ఏమైంది? అనేదే మిగతా స్టోరీ..

ఫొటో సోర్స్, Lyca Productions
ప్రజాదరణ పొందిన నవల
1950ల కాలం నుంచే ఈ నవల తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పటివరకు లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. కల్కి రాసిన నవలలను జాతీయం చేశారు. అప్పుడు చాలామంది ప్రచురణకర్తలు, ఆయన నవలలను వివిధ ఫార్మాట్లలో ప్రచురించారు.
ఈ నవల మొదటిసారిగా 1950లో కల్కి మ్యాగజీన్లో ఒక సీరియల్గా ప్రచురితమైంది. ఆ తర్వాత అనేక సార్లు దీన్ని పునఃప్రచురించారు. ఇది ప్రచురితమైన ప్రతిసారి కల్కీ మ్యాగజీన్ అమ్మకాలు గణనీయంగా పెరిగేవి.
ఇప్పుడు ఇది సినిమాగా రానుండటంతో మళ్లీ ఈ నవలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. చాలామంది ప్రచురణకర్తలు మళ్లీ నవలను ప్రచురించారు. దీన్ని ఇంగ్లిష్లోకి కూడా తర్జుమా చేశారు.
ఈ నవలను సంక్షిప్తంగా మార్చి ప్రచురించగా వేలాది కాపీలు అమ్ముడయ్యాయి.

ఫొటో సోర్స్, Lyca Productions
మణిరత్నం ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మణిరత్నం కంటే ముందు చాలామంది ఈ నవలను సినిమాగా తీయడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు.
ప్రముఖ నటుడు, డైరెక్టర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) కూడా ఈ నవలను సినిమాగా తీయాలనుకున్నారు.
1958లో పొన్నియిన్ సెల్వన్ సినిమా తీయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో వైజయంతిమాల, సావిత్రి, జెమినీ గణేశన్, సరోజా దేవి, బాలయ్య కీలకపాత్రల్లో నటించనున్నట్లు తెలిపారు. కానీ, ఇది కార్యరూపం దాల్చలేదు.
ఈ నవలను సినిమా రూపంలో తీసుకురావడం గురించి నటుడు కమల్ హాసన్ కూడా చాలాసార్లు మాట్లాడారు. కానీ, అది జరగలేదు.
ఈ నవలను సినిమాగా తీసుకురావడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మణిరత్నం 1990ల్లోనే ప్రకటించారు. తర్వాత అనేక సార్లు దీని గురించి మాట్లాడారు. కానీ, ఆయన ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు.
చివరకు, 2019లో లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు మణిరత్నం ప్రకటించారు. అయితే, ఈ సినిమా నిర్మాణ వ్యయాన్ని లైకా ప్రొడక్షన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, రెండు భాగాలకు కలిపి దాదాపు 500 కోట్లు ఖర్చు అయి ఉండొచ్చని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది. కేవలం తమిళనాడులోనే దాదాపు 250 థియేటర్లలో దీన్ని విడుదల చేయనున్నారు. తమిళనాడులోని చాలా థియేటర్లలో తెల్లవారుజామున 4.30 గంటల షోకి సంబంధించిన టిక్కెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- షింజో అబే అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?
- ఎడ్వర్డ్ స్నోడెన్: అమెరికా నిఘా రహస్యాలు బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగికి రష్యా పౌరసత్వం – ఎవరీ స్నోడెన్?
- మన జీవితం వేరొకరి గేమ్లో భాగమా, ఆ గేమ్ను మనం ఎప్పటికీ ఆపలేమా?
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












