IPL 2022 GT vs RR: గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్లో విజేతగా నిలిచేదెవరు

ఫొటో సోర్స్, BCCI/IPL
- రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్, రాజస్థాన్ జట్లు ఢీకొంటున్నాయి. సరిగ్గా 64 రోజుల ముందు, మార్చి 26న ఐపీఎల్ 2022 ప్రారంభమైనప్పుడు ఈ రెండు జట్లూ 15వ ఐపీఎల్ ఫైనల్ వరకూ చేరుకుంటాయని ఎవరూ ఊహించలేదు.
కానీ, మొదటిసారి ఐపీఎల్ బరిలో దిగి కొత్త నాయకత్వంతో కదం తొక్కుతున్న గుజరాత్, అనుభవజ్ఞుడైన కెప్టెన్ నేతృత్వంలో దూసుకొచ్చిన రాజస్థాన్ ఇప్పుడు ఫైనల్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.
ఆటగాళ్లు వేలం జరిగిన రోజు నుంచీ గుజరాత్ జట్టు ఎంపిక గురించి ఎన్నో మాటలు వినిపించాయి.
అందరూ మొదట కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించే మాట్లాడుకున్నారు. స్వయంగా ఫామ్ కోసం నానా తంటాలూ పడుతున్న ఒక గాయపడ్డ ఆటగాడు జట్టులోని కొత్త ఆటగాళ్లను ఎలా ముందుకు తీసుకెళ్లగలడు అనే సందేహం వచ్చింది.
దానికితోడు టోర్నీలో మొదటిరోజే ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్(ఇంగ్లండ్) బయో బబుల్లో ఇబ్బందిగా ఉందంటూ జట్టు నుంచి తప్పుకున్నాడు.
మరోవైపు రాజస్థాన్ జట్టును మాత్రం మొదటి నుంచీ చాలా సాలిడ్ టీమ్ అంటూ వచ్చారు. కానీ కెప్టెన్, అతడి బ్యాటింగ్ గురించి అప్పుడప్పుడూ ప్రశ్నలు వినిపించాయి.
కానీ, ఈ రెండు జట్లు ఐపీఎల్ 2022ను భారీ విజయాలతో స్టార్ట్ చేశాయి. సంజు శాంసన్ జట్టుకు నేతృత్వం వహించిన మొదటి మ్యాచ్లోనే టీమ్ స్కోరును 200 దాటించడంతోపాటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇక రెండో మ్యాచ్ నుంచి పరుగుల వరద పారించిన జాస్ బట్లర్ జట్టును విజయంవైపు తీసుకెళ్తే, మరోవైపు యజువేంద్ర చాహల్ బౌలర్లను ముందుకు నడిపించాడు.
దీంతో లీగ్ మ్యాచుల్లో పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఫైనల్ తర్వాత బట్లర్ ఆరెంజ్ కాప్, చాహల్ పర్పుల్ కాప్ గెలుచుకోవడం ఖాయమైంది.
మరోవైపు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన హార్దిక్ టీమ్ మొత్తం టోర్నీ అంతటా తమదైన ప్రదర్శన చూపింది. ఒక్కో మ్యాచ్కూ మెరుగైన ప్రదర్శనతో గుజరాత్ విమర్శకుల నోళ్లకు తాళం వేసింది.
ఆఖరి ఓవర్లలో 10 + రన్ రేట్ను ఈ జట్టు ఐదు సార్లు విజయవంతంగా చేజ్ చేసింది. కెప్టెన్గానే కాదు, జట్టును విజయం వైపు నడపడంలోనూ సక్సెస్ అయిన హార్దిక్ తనపై వచ్చిన విమర్శలన్నింటినీ ప్రశంసలుగా మార్చుకోగలిగాడు.
మొదటి మ్యాచుల్లో మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిలర్, రషీద్ ఖాన్ లాంటి అనుభవజ్ఞులు జట్టుకు విజయాలను అందిస్తే, తర్వాత మ్యాచుల్లో స్వదేశీ జోడీ శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా... జట్టు నుంచి తప్పుకున్న జేసన్ రాయ్ గురించి అంతా మర్చిపోయేలా అద్భుతంగా ఆడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ బలాబలాలు
ఫైనల్ గురించి చెప్పుకునే ముందు.. మనం రెండు టీముల కెప్టెన్ల గురించి చెప్పుకోవాలి. మొదట హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే, ఇతడిపై మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచీ, వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ వరకూ ఎంతోమంది ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ టోర్నీ మొత్తం గుజరాత్ జట్టు గెలిచే స్థితిలో ఉన్నా, లేక ఓటమి అంచుల్లో ఉన్నా హార్దిక్ పాండ్యా మాత్రం మైదానంలో చాలా కూల్గా కనిపించాడు. అందుకే మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత అందరూ అతడిని సెకండ్ కెప్టెన్ కూల్ అని కూడా పిలుచుకున్నారు.
హార్దిక్ పాండ్యాకు ముగ్గురు కెప్టెన్లు అంటే ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నేతృత్వంలో ఆడే చాన్స్ దొరికింది. ఆ సమయంలో ఆ ముగ్గురి నుంచీ అతడు ఎంతోకొంత నేర్చుకున్నాడు. 2022 ఐపీఎల్ వేలానికి ముందు ముగ్గురు కెప్టెన్ల నుంచి తాను ఏమేం నేర్చుకోవాలనుకుంటున్నాడో హార్దిక్ స్వయంగా చెప్పాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
మరోవైపు సంజు శాంసన్ జట్టులో బట్లర్ తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.
మరోవైపు అతడి కెప్టెన్సీకి ఫ్లాటయిన పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వారు అతడిని ఆకాశానికెత్తేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
సంజు శాంసన్ జట్టులో అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆటగాళ్లైన జాస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, ట్రెంట్ బోల్ట్ లాంటి వారు ఉన్నారు.
యశస్వి జైశ్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వర్ధమాన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
తన ఆటగాళ్ల నుంచి ప్రదర్శనను రాబట్టుకున్న సంజు మంచి కెప్టెన్ అనిపించుకున్నాడు.
అతడికి తన జట్టుపై ఎంత నమ్మకం ఉందో, టీమ్లోని ఆటగాళ్లకు కెప్టెన్గా అతడిపై అంతకు మించిన నమ్మకం ఉంది.

ఫొటో సోర్స్, BCCI/IPL
రెండు జట్ల ఆటగాళ్లలో ఎవరి సత్తా ఎంత
లీగ్ దశలో ఈ రెండు జట్లు మొత్తం 14 మ్యాచ్లు ఆడాయి. గుజరాత్ 10 మ్యాచుల్లో, రాజస్థాన్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి.
మొదటి క్వాలిఫయర్ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడగా రాజస్థాన్ను ఓడించిన గుజరాత్ నేరుగా సెమీ ఫైనల్ చేరుకుంది.
తర్వాత రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో లఖ్నవూతో ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించి వచ్చిన బెంగళూరును ఓడించిన రాజస్థాన్.. ఫైనల్లో మళ్లీ గుజరాత్ను ఢీకొనడానికి సిద్ధమైంది.
రెండు జట్లనూ ఫైనల్ వరకూ తీసుకొచ్చిన ఆటగాళ్ల ప్రదర్శన విషయానికి వస్తే రాజస్థాన్ టీంలో ఏడుగురు, గుజరాత్ జట్టులో 8 మంది ఆటగాళ్లు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు.
రాజస్థాన్ జట్టులో జాస్ బట్లర్ ఒక్కడే మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా, యజువేంద్ర చహల్ రెండు సార్లు, కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్, యశస్వి జైశ్వాల్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కోసారి ఈ అవార్డు అందుకున్నారు.
ఇక గుజరాత్ ఆటగాళ్లలో డేవిడ్ మిల్లర్, శుభమన్ గిల్ రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, లోకీ ఫర్గూసన్, వృద్ధిమాన్ సాహా, రాహుల్ తేవతియా ఒక్కోసారి విజేతగా నిలిచారు.

ఫొటో సోర్స్, BCCI/IPL
రాజస్థాన్ జట్టులో అత్యధికంగా జాస్ బట్లర్ 824 పరుగులు, సంజు శాంసన్ 444 పరుగులు చేశారు. బౌలర్లలో యజువేంద్ర చహల్ 26 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 18వికెట్లు తీశారు. ఆల్ రౌండ్ ప్రదర్శన కనపరిచిన రవిచంద్రన్ అశ్విన్ 185 పరుగులు, 12 వికెట్లు పడగొట్టాడు.
ఇక గుజరాత్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శనతో టాప్ పెర్ఫామర్గా నిలిచాడు. 453 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. అది కూడా జట్టుకు చాలా కీలకమైన సమయంలో సత్తా చూపాడు.
మరోవైపు రెండు మ్యాచుల్లో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్ 449 పరుగులు, శుభ్మన్ గిల్ 438 పరుగులు చేశారు. అటు మహమ్మద్ షమీ 19 వికెట్లు తీయగా, 18 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ మ్యాచ్ను గెలిపించడానికి తమ బ్యాట్కూ పనిపెట్టి 91 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
విజయావకాశాలు ఎవరికి ఎక్కువ
మొదట చూడగానే విజయం గుజరాత్దే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ టోర్నీలో ఈ జట్లు రెండు సార్లు తలపడగా, రెండు సార్లూ రాజస్థాన్ గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది.
కానీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, కామెంటరేటర్ గ్రేమీ స్మిత్ మాత్రం రెండు జట్లలోనూ చాంపియన్లు ఉన్నారు కాబట్టి, వీటిలో ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం కష్టం అంటున్నారు. అయితే, గుజరాత్ కంటే రాజస్థాన్ది కాస్త పైచేయిగానే ఉందన్నారు.స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ స్మిత్ దానికి కారణం కూడా చెప్పారు.
"సంజు శాంసన్ ఫైనల్ జరిగే మైదానంలో ఒక మ్యాచ్ ఆడాడు. అతడికి అక్కడి వాతావరణం, పిచ్, బంతి ఎంత బౌన్స్ అవుతుంది, అవుట్ ఫీల్డ్ ఎలా ఉంది అన్నీ తెలుసు" అన్నారు.
ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు బెంగళూరును ఓడించింది.
క్రికెటర్ సురేష్ రైనా కూడా స్మిత్ మాటతో ఏకీభవించారు. కానీ, గుజరాత్కు కూడా చాన్స్ ఉందని, ఎందుకంటే ఆ జట్టుకు కాస్త విశ్రాంతి తీసుకోడానికి సమయం దొరికిందని, ఫైనల్ మ్యాచ్కు వాళ్లు ఎక్కువ ఫ్రెష్గా ఉంటారని అన్నాడు.
మరోవైపు, ఎప్పుడైనా గేర్ మార్చి, పరుగుల వరద పారించగలిగే జాస్ బట్లర్ లాంటి ఆటగాళ్లు ఉండడం రాజస్థాన్కు కూడా కలిసొచ్చే అంశమే అన్నాడు రైనా. అతడు చెలరేగితే మ్యాచ్ ఫలితం మరోలా ఉండచ్చని చెప్పాడు.
గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
- భారత్-నేపాల్ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- పెళ్లి గిఫ్ట్గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- ‘ముస్లింలను ముస్లింలే చంపుతున్నారు, ఇది ఎలాంటి జిహాద్’- అమ్రీనా భట్ తండ్రి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












