అమరావతి అభివృద్ది పనులు మొదలయ్యాయా, ఇప్పుడు అక్కడి పరిస్థితి ఏమిటి?

అమరావతి
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో ఏర్పడిన సందిగ్ధతకు ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత ముగింపు దక్కుతుందనే ఆశాభావం చాలామందిలో వ్యక్తమయ్యింది. అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో సుమారు మూడేళ్ళుగా నిలిచిన పనులకు మళ్ళీ మోక్షం కలుగుతుందనే ఆశాభావం ఆ ప్రాంత వాసులు వ్యక్తం చేశారు. అసలింతకీ అమరావతిలో పరిస్థితి ఏంటి?

ఆరంభం ఆర్భాటం..

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొన్ని నెలలకే అమరావతిని కొత్త రాజధానిగా నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో నగర నిర్మాణ పనులు మొదలయ్యాయి. ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన భూముల్లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన తర్వాత పనులు ఊపందుకున్నాయి. తొలుత తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ సిద్ధం చేశారు. 2017 నుంచే వాటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం చేశారు. 2019 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి.

వాటితో పాటుగా శాశ్వత వసతి కోసం పలు భవనాలను నిర్మించేందుకు పనులు మొదలయ్యాయి. వాటిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మించిన నివాసాలు కూడా 90 శాతం పూర్తి చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్ ఉద్యోగుల వసతి నిర్మించిన క్వార్టర్స్ కూడా సగం వరకూ పూర్తయ్యాయి.

వాటితో పాటుగా సీడ్ యాక్సెస్ రోడ్డు కొంత పూర్తయ్యింది. కీలకమైన సెక్రటేరియేట్ టవర్స్ నిర్మాణ పనులు పునాది దశలో ఉన్నాయి. జడ్జీల క్వార్టర్స్ కూడా పనులు మొదలయ్యాయి.

కానీ అంతలోనే ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని విషయమై విధానపరమైన నిర్ణయాలు మారడంతో అమరావతి పరిస్థితి అయోమయంగా మారింది. అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాల మొండిగోడలు కొన్ని, పూర్తయ్యే దశలో ఆగిపోయాయి. వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారనే స్పష్టత కొరవడింది.

అమరావతి
ఫొటో క్యాప్షన్, దాదాపు 90 శాతం పనులు పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్

మూడు రాజధానులపై హైకోర్టు తీర్పు తర్వాత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జనవరిలోనే పాలనా వికేంద్రీరణ , సీఆర్డీయే రద్దు బిల్లులును ఏపీ అసెంబ్లీలో ఆమోదించింది.

అనూహ్య పరిణామాల తర్వాత అదే ఏడాది జూలై నెలాఖరుకి చట్టంగా మారింది. దానిని పలువురు సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటీషన్లు వేయడంతో కథ మరో మలుపు తిరిగింది. మూడు రాజధానుల వైపు అడుగులు వేయాలనే ప్రభుత్వ ప్రయత్నం ముందుకు సాగలేదు. అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్న పలు పార్టీలు, అమరావతి పరిరక్షణ సమితి డిమాండ్లు కూడా నెరవేరలేదు.

ఈ నేపథ్యంలో మార్చి 5న ఏపీ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. అమరావతి అభివృద్ధి కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నెలరోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సుదీర్ఘ తీర్పులో వెల్లడించింది. మూడు నెలల్లో లే అవుట్లు అబివృద్ధి చేసి భూములిచ్చిన రైతులకు అప్పగించాలని తెలిపింది. ఆరు నెలల్లో అమరావతి నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించింది. అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాల నివేదికను తమకు సమర్పించాలని కూడా కోర్టు తెలిపింది.

‘‘కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం పనులు ప్రారంభిస్తుందని ఆశించాం. కనీసం పెండింగు పనులకయినా శ్రీకారం చుడతారని అనుకున్నాం. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం సిద్ధపడుతుందని భావించాము. కానీ మళ్లీ అనుమానాలు కనిపిస్తున్నాయి. వేల కోట్లతో చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల పెట్టిన ఖర్చు కూడా వృధాగా పోతోందని కోర్టు కూడా అభిప్రాయపడింది. అయినా మార్పు కనిపించడం లేదు. పనులు చేపడుతున్న దాఖలాలు లేవు. మాకు న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానం మళ్లీ కలుగుతోంది’’ అంటున్నారు మందడం గ్రామానికి చెందిన ఎమ్.అరుంధతి.

ఆమె తన పేరుతో ఉన్న నాలుగు ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు తీర్పు రైతుల విజయం అంటూ సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు పనులు ప్రారంభం కాకపోవడంతో మరోసారి సందిగ్ధంలో పడుతున్నారు.

రైతుల రిజిస్ట్రేషన్‌కు సీఆర్డీఏ ఆదేశాలు..

రాజధాని కోసం భూములిచ్చిన రైతులంతా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని సీఆర్డీఏ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మార్చి 31 లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని రైతులకు లేఖలు కూడా రాస్తున్నారు. మూడు నెలల్లోగా రైతులకు ప్లాట్స్ అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలతో ఇది ముందుకుసాగుతున్నట్టు కనిపిస్తోంది. రైతుల నుంచి సీఆర్డీఏ ఆధ్వర్యంలో 34,385 ఎకరాలు సేకరించారు. వాటిలో 30,913 ఎకరాలు పట్టా భూములుగా సీఆర్డీఏ పేర్కొంది. 28,526మంది రైతుల నుంచి ఈ భూములు తీసుకున్నారు. సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ ప్రకటనకు ముందు 10,050 మంది, ఆ తర్వాత 7458 మంది భూములను అమ్మకాలు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా సీఆర్డీఏ నుంచి ఫ్లాట్లు పొందాల్సిన రైతుల సంఖ్య 11 వేలుగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరిలో ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోని వారంతా సంబంధిత పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి వెళ్లాలని సీఆర్డీఏ తాజా లేఖలో సూచిస్తోంది

వీడియో క్యాప్షన్, పవన్ కల్యాణ్: కమ్యూనిస్టు ఆదర్శాలు.. కాషాయ రోడ్ మ్యాప్.. జనసేన దారెటు?

అమరావతికి బడ్జెట్ కేటాయింపులెంత..

అమరావతి నగరాభివృద్ధి ఆరు నెలల్లో జరగాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. కానీ ప్రభుత్వం మాత్రం తీర్పు వెలువడిన పక్షం రోజుల తర్వాత కూడా ఎటువంటి పనులకు పునః ప్రారంభం చేసిన దాఖలాలు లేవు.

తాజా బడ్జెట్ లో సైతం అమరావతి అభివృద్ధికి అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించిన దాఖలాలు కనిపించడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో అమరావతికి రూ.1329 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కానీ అందులో 800 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని పేర్కొంది. దాంతో కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయం పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్న మొత్తంలో రూ. 529 కోట్లతో భూములిచ్చిన రైతులకు ఏటా చెల్లిస్తున్న కౌలు, కూలీలకు ఇచ్చే పెన్షన్ల చెల్లింపులతో పాటుగా అమరావతి పేరుతో తీసుకున్న అప్పులకు వడ్డీల చెల్లింపు చేయాల్సి ఉంటుంది. దాంతో బడ్జెట్ కేటాయింపుల్లో 40 శాతం పైగా నిర్వహణ ఖర్చులు పోగా కేంద్రం మీద ఆధారపడి అభివృద్ధి ఎలా చేస్తారన్నది సందేహంగా మారుతోంది.

అమరావతి ఆందోళనలో మహిళలు
ఫొటో క్యాప్షన్, అమరావతి ఆందోళనలో మహిళలు

"ఈ ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. ఆరంభం నుంచి అలానే నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇప్పుడీ పరిస్థితి. అప్పట్లో పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికే అనేక భవనాలు, రోడ్లు అందుబాటులోకి వచ్చేవి. అమరావతి రూపు రేఖలు కనిపించేవి. కొన్ని బిల్డింగులకు కేవలం కరెంటు, నీటి సదుపాయం అందిస్తే వినియోగంలోకి వస్తాయి. అందుకే వేల కోట్లు వెచ్చించిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది" అని అమరావతి జేఏసీ నాయకురాలు డాక్టర్ రాయపాటి శైలజ బీబీసీతో అన్నారు.

ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రైతులకు అప్పగించాలని ఆమె కోరారు. జేఏసీకి ఇస్తే తామే నగర నిర్మాణం చేపడుతామని ఆమె అంటున్నారు.

ఇప్పటి వరకూ ఖర్చు చేసిందెంత?

అమరావతి నగరాభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చించాయి. అవి దాదాపుగా రూ. 20వేల కోట్లకు పైబడి ఉంటాయని అమరావతి జేఏసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

కేంద్రం కూడా ఇప్పటి వరకూ అమరావతి కోసం సుమారుగా రూ. 15వందల కోట్లు విడుదల చేసింది.

సజ్జల రామకృష్ణారెడ్డి

ఫొటో సోర్స్, SAJJALAOFFICIAL

"2021 నవంబర్ 23 నాటి లెక్కల ప్రకారం అమరావతి అభివృద్ధికి రూ. 8,572 కోట్లు ఖర్చు అయ్యింది. అందులో మౌలిక సదుపాయాల మీద చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు. మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కన్సల్టెన్సీ ఛార్జీలు, కౌలు చెల్లింపు, పెన్షన్ల కోసం ఖర్చయ్యాయి. ఆ నిధులు కూడా హడ్కో లోన్లు, అమరావతి బాండ్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వాటన్నింటికీ వడ్డీల చెల్లింపు భారం ఈ ప్రభుత్వం భరిస్తోంది" అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

భారీ మొత్తంలో వెచ్చించిన అమరావతి కారణంగా కొందరికే ప్రయోజనం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వికేంద్రీకరణ ప్రయత్నాలు చేసినట్టు వివరించారు.

ప్రభుత్వం చెబుతున్నట్టుగా వివిధ రూపాల్లో సేకరించిన ఎనిమిదిన్నర వేల కోట్లు వెచ్చించినా అమరావతిలోని నిర్మాణాలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం కేవలం ఏపీ హైకోర్టు అవసరాల నిమిత్తం రెండో భవనం నిర్మాణ పనులు మాత్రమే గడిచిన రెండు నెలలుగా సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నమూనా ఆలయ పనులు కూడా సాగుతున్నాయి. ఆ రెండూ మినహా అమరావతిలో ఎటువంటి నిర్మాణాల జాడ కనిపించడం లేదు.

దాంతో సగం సగం పనులు చేసి మధ్యలో ఆపేసిన భవనాలన్నీ ఎందుకూ కొరగాకుండా మారిపోయాయి. వాటిని పూర్తి చేసి ఏదో అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపుతోంది.

ఇప్పటికే అమరావతి పేరుతో చేసిన అప్పులకు వడ్డీలే భారంగా మారాయని ప్రభుత్వం అంటోంది.

అమరావతి
ఫొటో క్యాప్షన్, నిర్మాణపనులు జరుగుతున్న ఏపీ హైకోర్టు అదనపు భవనాలు..

నిర్మాణంలో ఉన్న భవనాలను అందుబాటులోకి తేవాలి

"రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పు తర్వాతనైనా సమగ్రంగా ఆలోచించాలి. కనీసం నిర్మాణంలో ఉన్న భవనాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ లేకపోవడంతో వారికి క్వార్టర్స్ రెంట్ పేరుతో ప్రభుత్వం తరుపున నెలకు రూ. 40వేల వరకూ చెల్లిస్తున్నారు. అదంతా ప్రజాధనం" సీపీఎం నాయకుడు చిగురుపాటి బాబూరావు అన్నారు.

"అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ సిద్ధం చేస్తే వారికి ఇస్తున్న నెలవారీ అద్దె భత్యం అవసరం ఉండదు. ఉన్నతాధికారులకు, సచివాలయ సిబ్బంది కి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. భవనాలు అందుబాటులోకి తీసుకురావడానికి వీలున్నప్పటికీ శ్రద్ధ పెట్టకపోవడం సమంజసం కాదు. అమరావతి పనులు వెంటనే ప్రారంభించాలి" అని డిమాండ్ చేశారు.

అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉండగా నిలిచిపోయిన భవనాలను విషయంలో ప్రభుత్వం దృష్టి పెడితే అందుబాటులోకి వస్తాయనే అభిప్రాయం స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ చేపడుతామని సీఆర్డీయే అధికారులు బీబీసీకి తెలిపారు.

గతంలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష జరిగిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసినట్టు వెల్లడించారు. అమరావతిలో నిర్మాణాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.

వీడియో క్యాప్షన్, ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)