బెంగళూరు: ‘కన్న కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం, తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

బెంగళూరు పోలీసులు నలుగురు టీనేజీ కుర్రాళ్లను అరెస్ట్ చేశారు.

46 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తిని చంపేశారన్న ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

కన్న కూతురిపై గత రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి.

బాధిత అమ్మాయికి ఈ నలుగురు అబ్బాయిలు క్లాస్‌మేట్లు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతవారం తల్లి ఊరెళ్లినప్పుడు, తన తండ్రి తనపై మరోసారి అత్యాచారానికి ప్రయత్నించారని బాధిత అమ్మాయి తన క్లాసులోని ఒక స్నేహితుడికి చెప్పింది.

దాంతో అతనితో పాటు మరో ముగ్గురు ఆమె క్లాస్‌మేట్లు కలిసి ఆమె తండ్రిని చంపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధిత అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ఆమె తండ్రి ఒక స్థానిక సంస్థలో సెక్యూరిటీ మేనేజర్‌గా పని చేసేవారు.

డీసీపీ

ఫొటో సోర్స్, Twitter/C K Baba

ఫొటో క్యాప్షన్, బెంగళూరు డీసీపీ సీకే బాబా

అసలేం ఏం జరిగింది? పోలీసులేం చెప్పారు?

ఈ నలుగురు టీనేజీ కుర్రాళ్లు.. ఆదివారం రాత్రి అమ్మాయి ఇంటికి వెళ్లారు. ఆ అమ్మాయి తలుపు తెరిచి, వారిని ఇంట్లోకి రానిచ్చింది.

ఈ నలుగురు స్నేహితులు ఆమె తండ్రిపై కొడవళ్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. పొరుగింటి వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె తండ్రి శరీరాన్ని పోలీసులు గుర్తించారు.

"ఇది చాలా క్లిష్టమైన కేసు. కన్న కూతురిపై భర్త అత్యాచారం చేస్తున్నాడన్న విషయం ఆమె తల్లికి తెలుసు. కూతుర్ని తండ్రి మొదటిసారి లైంగికంగా వేధించినప్పుడే ఆ విషయం ఆమెకు తెలుసు" అని బెంగళూరు డీసీపీ సీకే బాబా బీబీసీకి చెప్పారు.

ఈ విషయంపై అమ్మాయి తల్లి తన భర్తతో మాట్లాడి చూసింది. కూతురు జోలికి వెళ్లొద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆమె భర్త వినలేదు. ఆమె ప్రయత్నాలు విఫలం అయ్యాయి. భర్తతో ఆమె సంబంధాలు తెగిపోయే వరకు పరిస్థితి వచ్చిందని పోలీసు అధికారి చెప్పారు.

అమ్మాయి తల్లి ఒక బట్టల షాపులో పని చేస్తుంటుంది. తండ్రి బిహార్‌కు చెందినవారు. స్థానికంగా ఒక కాలేజీలో ఈ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. 11 సంవత్సరాల ఆమె చెల్లెలు స్కూలుకు వెళ్తోంది.

వీడియో క్యాప్షన్, సైదాబాద్ బాలిక రేప్, హత్య: నిందితుడు ఎలా చనిపోయాడు?

అయితే, హత్య జరిగిన రోజు రాత్రి పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆ అమ్మాయి ఇచ్చిన పొంతనలేని సమాధానాలు అనేక అనుమానాలకు తావిచ్చాయి.

కానీ తన స్నేహితులే తన తండ్రిని చంపేశారని ఆ తర్వాత ఆమె ఒప్పుకుంది.

ఆమె తండ్రిపై దాడి చేసిన తర్వాత ఆ నలుగురు కుర్రాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయారు.

ఈ అమ్మాయి తన చెల్లిని లేపిందని, సాయం కోసం ఇద్దరూ అరిచారని చెబుతున్నారు.

ఎవరో వచ్చి తన తండ్రిపై దాడి చేశారని పెద్దమ్మాయి ఇరుగుపొరుగు వారికి చెప్పింది.

హత్య జరిగిన పది గంటల్లోనే ఈ కేసులో నిందితులందర్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ అబ్బాయిలు.. అమ్మాయి ఇంటికి రావడం, వెళ్లడం సీసీటీవీ కెమేరాల్లో రికార్డయింది. ఇతర ఆధారాలు కూడా లభించాయని పోలీసులు చెప్పారు.

ఈ నలుగురు నిందితులను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వారిని రిమాండ్‌కు తరలించారు.

వీడియో క్యాప్షన్, అత్యాచార బాధితులు: "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)