హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక: గెలిచేదెవరు

ప్రధాన అభ్యర్థులు
ఫొటో క్యాప్షన్, హుజూర్ నగర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సైదిరెడ్డి, పద్మావతి, చావా కిరణ్మయి, కోట రామారావు

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 84.15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

పోలింగ్ పూర్తయిన గ్రామాల్లోని ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24న చేపడతారు, అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి.

కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు పోటీ చేశారు.

ఈ ఎన్నికలో మొత్తం ముగ్గురు మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇక్కడ 2014 లో సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం ఓట్లు, 2018లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది.

ఉత్తమ్

ఫొటో సోర్స్, facebook/uttamkumarreddy

2018 డిసెంబరులో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచారు.

అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది.

మహారాష్ట్ర, హరియాణాల్లో అసెంబ్లీ గడువు పూర్తయి ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో వాటితో పాటుగానే హుజూర్‌నగర్‌లోనూ ఉప ఎన్నికల నిర్వహించారు.

ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేశారు. టీఆర్ఎస్ గత ఎన్నికలో ఇక్కడ ఓడిపోయిన శాసనపురి సైదిరెడ్డినే మరోసారి బరిలో దించింది.

2018 ఎన్నికల్లో

గత ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 92,996 ఓట్లు సాధించారు.

శానంపూడి సైదిరెడ్డి 85,530 ఓట్లు పొందారు. దీంతో సుమారు 7 వేల ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడడంతో అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు.

ఈసారి కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ నుంచి చావా కిరణ్మయి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.

ఉత్తమ్ పద్మావతి

ఫొటో సోర్స్, facebook/UtamPadmavathi

కోదాడలో ఓటమి.. హుజూర్‌నగర్‌లో పోటీ

ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడిన పద్మావతి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేశారు.

ఆ ఎన్నికల్లో ఆమె టీఆరెస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో కోదాడ నుంచి పద్మావతి గెలుపొందారు.

2018 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు తన భర్త ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ ఖాళీ కావడంతో అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)