అద్రాస్పల్లి శ్మశానంలో సెప్టెంబర్ 18 రాత్రి ఏం జరిగింది? విశాఖ మన్యంలో గిరిజనుడిని ఎలా సజీవ దహనం చేశారు?

- రచయిత, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
- హోదా, విజయ్ గజం, బీబీసీ కోసం
హైదరాబాద్ శివార్లలో, మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో అద్రాస్ పల్లి గ్రామం ఉంది. ఊళ్లో పంచాయతీ కార్యాలయం ఎదురుగా అమ్మవారి గుడి, పక్కనే చిన్న మసీదు, ముందుకెళ్తే గాంధీ విగ్రహం ఉన్నాయి. అక్కడికి కొంత దూరంలో కొన్ని పొలాలు. వాటి మధ్యలో ఒక శ్మశానం. అక్కడ కొన్ని సమాధులు, కొన్ని మృతదేహాలు కాల్చిన ఆనవాళ్లు.
శ్మశానం మొదట్లో ఒక చోట కాష్టం ఆరింది. బూడిద మిగిలింది. ఆ బూడిద ఒక్క శరీరానిది కాదు. అవును... అక్కడి చితిలో ఇద్దర్ని కాల్చారు. ఒకరిది మరణం, మరొకరిది 'హత్య'.
సెప్టెంబరు 18 బుధవారం రాత్రి. అద్రాస్ పల్లికి చెందిన ఆటోడ్రైవర్ బోయిని ఆంజనేయులు ఇంటికి చేరుకున్నారు. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో ఆటో ఉంచి లోపలకు వెళ్లారు. తర్వాత ఇంటి బయట ఉన్న తన పెద్దన్న గణేశ్ చెప్పులు వేసుకుని ఆయన పొలాల్లోకి బయల్దేరారు. రోజూ రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత బహిర్భూమికి వెళ్లడం ఆంజనేయులుకు అలవాటు. అలా వెళ్లిన ఆయన గంటో రెండు గంటల్లోనో తిరిగి రావాలి. కానీ, మళ్లీ ఇంటికి రాలేదు.
పంచాయతీ కార్యాలయం నుంచి లోపలకు వెళ్తే అంబేడ్కర్ విగ్రహం ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న వీధిలో గ్యార లక్ష్మి నివాసం ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, సెప్టెంబరు 17 మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు 18వ తేదీ బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 18న రాత్రి లక్ష్మి అంత్యక్రియలు ముగిశాయి.

శ్మశానంలో గొడవ అవుతోందన్న సమాచారం అందుకున్న కొందరు అక్కడికి వెళ్లారు. పోలీసులూ వచ్చారు. వారంతా వచ్చేసరికి అక్కడ లక్ష్మిని కాల్చిన చితిలో ఒక శరీరం కాలుతోంది. అది ఆంజనేయులుది.
ముందు కాలిన మృతదేహం కాళ్ల వైపు రెండో శరీరం తల ఉన్నట్టుగా ఉంది. ఆ శరీరం బోర్లా ఉంది. మెడ, వీపు భాగం మినహా అంతా కాలిపోయింది. పోలీసులు ఆ మిగిలిన భాగాన్ని తీసి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు.
పరీక్షల తర్వాత తిరిగి వచ్చిన సగం కాలిన, మిగిలిన శరీర భాగాలకు ఆంజనేయులు పొలం దగ్గరే మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు.
సెప్టెంబరు 19 గురువారం ఉదయం. ఆ బోర్లా పడ్డ మనిషిని హత్య చేశారన్న అభియోగంతో లక్ష్మి బంధువులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదంతా జరిగింది ఒకే ఒక్క అనుమానంపై- అదే చేతబడి.

పోలీసుల కథనం ఏమిటంటే- సెప్టెంబరు 18 రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆంజనేయులు బహిర్భూమికి వెళ్లారు.
లక్ష్మి బంధువులు, ఆమె చితిపైనే ఆంజనేయుల్ని కూడా కాలుస్తున్నారని 8.30కి ఊళ్లో ప్రచారం జరిగింది. ఆంజనేయులు పెద్దన్న గణేశ్, ఇంకొందరు శ్మశానానికి వెళ్లారు. సగం కాలిన శరీరాన్ని చితి నుంచి బయటకు లాగారు. తమ్ముడు ఆంజనేయులు నంబరుకు ఫోన్ చేస్తే లైన్ కలవలేదు. ఇంటి నుంచి ఆయన వేసుకెళ్లిన చెప్పులు అక్కడ పడి ఉన్నాయి. వాటిని చూసి అన్న గుర్తుపట్టారు.
లక్ష్మికి ఆంజనేయులు మంత్రాలు వేశారని (చేతబడి చేశారని) ఆమె బంధువులు అనుమానించారని, అందుకే ఈ పని చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో రాశారు.

లక్ష్మి నాలుగైదేళ్ల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. ఈ మధ్యే ఆస్పత్రిలో చేరారు. 17న మరణించారు.
ఆమెకు చేతబడి జరిగిందన్న అనుమానమున్న లక్ష్మి బంధువులు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా శ్మశానం దగ్గరే ఉన్నారు. చేతబడి చేసిన వ్యక్తి, చనిపోయిన వారి చితి దగ్గరకు వచ్చి పూజలు చేస్తాడనీ, అప్పుడు అతణ్ని పట్టుకోవచ్చని వారి ఉద్దేశం.
వారు అక్కడ వేచి ఉన్నప్పుడే ఆంజనేయులు శ్మశానం సమీపంలోని చెరువు దగ్గర కనిపించారు. ఆంజనేయులే క్షుద్రపూజలు చేశాడని, లక్ష్మి మృతికి కారణమయ్యాడని వారు అనుమానించారు. వెంటనే ఆయన్ను పట్టుకున్నారు. అదే విషయాన్ని మిగిలిన గ్రామస్థులకు ఫోన్లో చెప్పారు. అందరూ కలసి రాళ్లు, కట్టెలు, గొడ్డలితో ఆయన్ను కొట్టారు. ఆంజనేయులు బతికి ఉండగానే, కాలుతున్న లక్ష్మి చితిపైకి తోసేశారు. అందులో ఒకరు తర్వాత విషయాన్ని గ్రామ సర్పంచ్ భర్త నరసింహకు ఫోన్ చేసి చెప్పారు.

నలుగురి అరెస్టు
హత్య, సాక్ష్యాలను తారుమారు చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, కొందరు వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం అనే నేరాభియోగాల కింద భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 302, 201, 148 రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు.
19వ తేదీ గురువారం ఏ1 అంటే మొదటి నిందితుడు గ్యార బలరాం(వయసు 52 ఏళ్లు, రైతు) సహా నలుగురిని అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో ఏ2 గ్యార కిష్టయ్య (55 ఏళ్లు, రైతు); ఏ3 బండల శ్రీరాములు (35 ఏళ్లు, లారీ డ్రైవర్); ఏ4 గ్యార నరసింహ (30 ఏళ్లు, లారీ డ్రైవర్) ఉన్నారు.
అద్రాస్ పల్లి ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. మృతుడు ఆంజనేయులు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి. నిందితులు ఎస్సీలు. గ్రామ సర్పంచ్ బాధితులకు బంధువు. ఉప సర్పంచ్ నిందితులకు బంధువు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అక్కడ రాజకీయ, లేదా కులవైరం ఏమీ లేదు.

లక్ష్మి భర్త ఆరోపణ?
"నా భార్య చితి చుట్టూ ఆంజనేయులు బట్టలు లేకుండా తిరిగాడు. అందుకే మావాళ్లు పట్టుకున్నారు" అని లక్ష్మి భర్త సీతయ్య చెబుతున్నారు.
"నా భార్యకు షుగర్, బీపీ ఉన్నాయి. ఆస్పత్రుల్లో చూపించాం. చనిపోయింది. ఇంటికి తీసుకొచ్చాం. అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వచ్చాక సంప్రదాయం ప్రకారం 'ఇంగళం' (చితి చుట్టూ పిడకలు పెట్టి పాటించే ఒక ఆచారం) చేయడానికి మా వాళ్లు నలుగురు శ్మశానానికి వెళ్లారు. నేను వెళ్లలేదు.
మా వాళ్లు వెళ్లే సరికి ఆంజనేయులు చితి చుట్టూ బరిబాతల (నగ్నంగా) తిరుగుతున్నాడు. మా వాళ్లు అతణ్ణి పట్టుకున్నారు. బరబాతల తిరుగుతున్నాడనే పట్టుకున్నారు.
మావి వేరే కులాలు. అతను మా కాడి దగ్గర తిరగడం వల్లే ఇది అయింది. మా వాళ్లు పట్టుకున్నారు. కొట్లాట అయింది. కొట్టేశారు. అతను మా కాడి దగ్గరకు రాకపోతే వాళ్లకూ మాకూ అవసరమే లేదు. అతను నగ్నంగా చితి చుట్టూ తిరిగాడు కాబట్టే ఇలా అయింది. లేకపోతే వాళ్లకూ మాకూ ఏమీ లేదు. పంచాయితీలు, కొట్లాటలూ ఏమీ లేవు" అని సీతయ్య బీబీసీతో చెప్పారు.
అభియోగం ఎదుర్కొంటున్న వారిలో ఒకరి చేతికి కాలిన గాయాలు అయ్యాయని వారి బంధువులు చెప్పారు.

మా తమ్ముడికి మంత్రాలు రావు, అన్యాయంగా చంపేశారు: గణేశ్
"ఆ రోజు సాయంత్రం ఆటో ఇంటి వద్ద పెట్టాక ఆంజనేయులు కాసేపు టీవీ చూశాడు. ఐదు నిమిషాల తక్కువ ఎనిమిది ప్రాంతంలో ఫోన్ వస్తే బయటకు వెళ్లాడు. ఇక రాలేదు. ఆ రోజు రాత్రి మా బంధువు ఫోన్ చేసి మా తమ్ముడికి ఇలా అయిందని చెప్పాకే మాకు విషయం తెలిసింది. నేను ముందు నమ్మలేదు. వెంటనే బయల్దేరి వెళ్లాను" అని ఆంజనేయులు పెద్దన్న గణేశ్ బీబీసీతో చెప్పారు.
"నేను వెళ్లే సరికే శ్మశానంలో పోలీసులూ, జనం ఉన్నారు. కాష్టం కాలుతూనే ఉంది. తమ్ముడు వేసుకెళ్లిన నా చెప్పులు చూసి గుర్తుపట్టాను. ఎలా జరిగిందో తెలీదు. ఎందుకు జరిగిందో అర్థం కాలేదు.
వాళ్లకూ మాకూ ఏ గొడవలూ లేవు. మంత్రాలు లేవు, మాకు రావు. వాళ్లు కావాలనే పుకార్లు పుట్టించారు. మా తమ్ముణ్ని కొట్టి చంపేశారు. దాన్నుంచి తప్పించుకోవడానికి మంత్రాలు వేశాడంటూ పుకార్లు పుట్టించారు. తప్పించుకోవడానికే ఈ నింద వేశారు" అని గణేశ్ ఆరోపించారు.
"ఆంజనేయులు పగటి పూట బహిర్భూమికి వెళ్లడు. రాత్రుళ్లు డ్యూటీ ముగించుకున్న తర్వాత పొలాల వైపు వెళ్తాడు. రోజూ అతను ఆ దారిలోనే కాష్టానికి చాలా దూరంగా పొలాల వైపు వెళ్తాడు. సాధారణంగా రాత్రి పదీ పదిన్నరకు వెళ్తాడు. ఆ వేళ తొందరగా వెళ్లాడు" అని కుటుంబ సభ్యులు చెప్పారు.
ఆంజనేయులు తల్లి, కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నారు. ఆంజనేయులు వయసు పాతికేళ్లు.

సర్పంచ్ భర్త సాక్షి... ఆయన మాటేమిటంటే?
"నేను కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉన్నాను. బయటకు రాగానే 8.30 ప్రాంతంలో గ్యార నరసింహ నాకు ఫోన్ చేశారు. 'ఇక్కడ కాష్టం దగ్గరకు వచ్చిన ఆంజనేయుల్ని పట్టుకున్నారు' అని చెప్పాడు. 'కొడుతున్నారు' అని కూడా అనలేదు. అంతలోనే ఫోన్ కట్ అయింది. నేను మళ్లీ కాల్ చేసినా ఎత్తలేదు" అని ఈ కేసులో సాక్షిగా ఉన్న సర్పంచ్ భర్త బోయిని నరసింహ బీబీసీతో చెప్పారు.
అప్పుడు తాను పక్క ఊరిలో ఉండడంతో, ఊళ్లో ఉన్న కొందరికి ఫోన్ చేసి శ్మశానం వద్దకు వెళ్లి చూడాలన్నానని ఆయన తెలిపారు.
"శ్మశానం దగ్గర లొల్లి అవుతోందనీ, తాము వెళ్లలేదనీ వాళ్లు చెప్పారు. వాళ్లను వెళ్లి చూడాలని చెప్పి, పోలీసులకు ఫోన్ చేశాను. అప్పటికే పోలీసులకు సమాచారం ఉంది. నేనూ, పోలీసులూ, కొందరు గ్రామస్థులం అక్కడకు చేరుకునేసరికి అక్కడెవరూ లేరు. అప్పటికే రాత్రి 9 దాటింది. చీకట్లో ఎవరూ పెద్దగా కనపడలేదు. కాష్టం మీద ఉన్నది ఒక మృతదేహమా, రెండు శరీరాలా, ఆడా, మగా అనే తర్జనభర్జన జరిగింది. చివరకు మిగిలిన భాగాన్ని పక్కకు తీసి పోస్టుమార్టానికి పంపారు" అని నరసింహ చెప్పారు.
లక్ష్మి అనారోగ్యంతో మరణించారని, ఆమెకు చేతబడి చేశారని కుటుంబ సభ్యుల అనుమానమని ఆయన చెప్పారు.
"చేతబడి చేశారన్న అనుమానంతోనే బహుశా వారు కాష్టం దగ్గర కావలి కాసి ఉండొచ్చు (చేతబడి చేసిన వారు, చనిపోయిన వారి చితి దగ్గరకు వస్తారని ఒక నమ్మకం). రోజూ రాత్రుళ్లు బహిర్భూమికి వెళ్లే అలవాటు ఆంజనేయులుకు ఉంది. కానీ అతను ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? ఎందుకు పట్టుకున్నారు అనేది తెలియదు" అని ఆయన వివరించారు.
తాను మంత్రాలను నమ్మనని, కావాలంటే తనకే మంత్రం చేయండని ఊళ్లో చెబుతుంటానని నరసింహ తెలిపారు.
సెప్టెంబరు 18న ఘటన గురించి ముందుగా సమాచారం అందిన వారిలో నరసింహ ఒకరు. ఆయనకు సమాచారం ఇచ్చి ఫోన్ కట్ చేసిన గ్యార నరసింహను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటన జరిగిన సమయంలో ఆంజనేయులు, నిందితులూ మద్యం ప్రభావంలో ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు గ్రామస్థులు అన్నారు.
ఊళ్లో పెద్దవాళ్లు గ్రామ దేవత గుడి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సెప్టెంబరు 18 ఘటన గురించి దాదాపు ఎవరూ కొత్తవారితో మాట్లాడడం లేదు.
అద్రాస్ పల్లిలో అధికారులు ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. మూడు చోట్ల క్యాంపు పెట్టి, గొడవలు జరగకుండా కాపలా కాస్తున్నారు.
విశాఖ మన్యంలో భార్య ఎదురుగా గిరిజనుడి సజీవ దహనం
అద్రాస్ పల్లి ఘటన జరిగాక వారం వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో విశాఖ మన్యంలో చేతబడి అనుమానాలతో ఒక గిరిజనుడిని గ్రామంలోని ఇతర గిరిజనులు సజీవ దహనం చేశారు. విశాఖ మన్యంలోని డుంబ్రిగూడ మండలం పుట్టబంద గ్రామంలో కిల్లో జయరాం అనే గిరిజనుడిని చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు చిత్రహింసలు పెట్టి, గ్రామం నడిబొడ్డున పేర్చిన చితిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశారు.
కొద్ది కాలంగా ఇదే గ్రామానికి చెందిన ముకుంద అనే వ్యక్తి కుమార్తె 12 ఏళ్ల రాధకు ఆరోగ్యం బాగోవడం లేదు. ఆమెకు జయరాం చేతబడి చేశారని ముకుంద కుటుంబ సభ్యులు భావించారు. తన కుమార్తెకు చేసిన "చేతబడికి విరుగుడు ఇవ్వాలి" అని జయరాంపై ఒత్తిడి చేశారు.

పంచాయితీకి రావాలంటూ ఈ నెల 24న మధ్యాహ్నం జయరాంను ఇంటికి వచ్చి తీసుకువెళ్లారు.
తనకు ఏం తెలియదని జయరాం ఎంత చెప్పినా వినకుండా, ఆయన్ను కర్రలతో కొడుతూ, కాళ్లూ చేతులు కట్టివేసి, అప్పటికే రహదారిపై సిద్ధం చేసుకున్న చితిపైకి చేర్చి బతికుండగానే నిప్పు పెట్టారు.
జయరాంను ఇంటి నుంచి తీసుకువెళ్లే సమయంలో భార్య చెల్లెమ్మ, కుమార్తె కమల, తల్లి దస్సు ఆయన వెంట వెళ్లారు. జయరాంను హింసిస్తున్నప్పుడు వాళ్లు అడ్డం వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న గుంపు వీరిని కూడా చంపేస్తామని బెదిరించింది.
"మమ్మల్ని నా కొడుకు జయరామే చూసుకునే వాడు. ఇప్పుడు నా కొడుకుని చంపేశారు. మమ్మల్ని చూసుకునేవారు ఎవ్వరు? నా కొడుకుతో పాటూ నన్ను కూడా చంపేయ్యమన్నాను. కానీ నా మనుమడు నన్ను అక్కడ నుంచి లాక్కొచ్చాడు. నేను చూస్తుండగానే నా బిడ్డపై నూనె (పెట్రోలు) పోసి కాల్చేశారు. కాళ్లు మొక్కి ప్రాధేయపడినా కనికరించలేదు" అని దుస్సు వాపోయారు.

జయరాం రైతు. కాఫీ సాగు చేస్తాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు.
జయరాంను చంపేసిన తర్వాత, ప్రాణభయంతో జయరాం భార్యాపిల్లలూ అక్కడి నుంచి పారిపోయారు.
వృద్ధులైన జయరాం తల్లితండ్రులు మాత్రం ఊరిలోనే ఉండిపోయారు. వేరే ప్రాంతంలో ఉన్న జయరాం భార్యాపిల్లలను ఈ నెల 26న అతికష్టమ్మీద బీబీసీ బృందం కలిసింది.
ఈ ఘటనతో పెద్ద కుమార్తె కమల షాక్లోకి వెళ్లిపోయింది. చిన్న కూతురు కుమారి అసలు మాట్లాడలేకపోతోంది.
సారా తాగుతూ పైశాచిక ఆనందం పొందారు: జయరాం భార్య
జయరాం భార్య చెల్లమ్మ మాట్లాడుతూ- ''మేం కష్టపడి పనిచేస్తాం. ఎవ్వరి జోలికీ వెళ్లే వాళ్లం కాదు. మంత్రాల గురించి అసలు తెలియదు. నా భర్తను కాళ్లూ చేతులూ కట్టేసి బతికుండగానే తగులబెట్టారు. మా కుటుంబం అనాథ అయింది. ఇప్పుడు మా కుంటుంబానికి దిక్కు ఎవరు? కాళ్లు పట్టుకొని ప్రాధేయపడినా కనికరించలేదు. నా భర్త చనిపోతుంటే సారా తాగుతూ పైశాచిక ఆనందం పొందారు" అని చెప్పారు.
తన భర్తను చంపి కుటుంబాన్ని అనాథను చేశారని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఘటన గురించి ఈ నెల 25న పోలీసులకు తెలిసింది. జయరాం భార్య పోలీసుకులకు ఫిర్యాదు చేశారని అరకు సీఐ పైడయ్య తెలిపారు.
డుంబ్రిగూడ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సరికి జయరాం దేహం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు జయరాం అస్థికలు సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
ముకుంద తన కుమార్తె రాధకు జయరాం చేతబడి చేశాడనే అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డారని సీఐ బీబీసీతో చెప్పారు.

ప్రణాళికతోనే చంపారు: సీఐ
"ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మగవాళ్లూ, ఒక మహిళ పాల్గొన్నారు. నిందితులు జయరాంను చంపాలనే ప్రణాళిక వేసుకున్నారు. దానిలో భాగంగానే ముందుగా పెట్రోలు తీసుకొచ్చారు. నిందితులందరూ పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటాం" అని సీఐ వివరించారు.
గతంలో కూడా డుంబ్రిగూడ మండలంలో ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన తెలిపారు. విశాఖపట్నం నుంచి సైకియాట్రిస్టులనూ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులనూ రప్పించి గిరిజనుల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ఏజెన్సీలో గత సంవత్సరం మంత్రాలు వేస్తున్నారన్న అనుమానంతో తండ్రీకొడుకులను ఒక గ్రామంలోని వారు సజీవదహనం చేశారని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు ఏం చేసింది?
- ‘మీకు ఇలాంటి రిపోర్టర్స్ ఎక్కడ దొరుకుతారు...’ మోదీ, ఇమ్రాన్ ఖాన్లను ఒకే ప్రశ్న అడిగిన ట్రంప్
- గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో మూవీ కెమెరా
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- గర్ల్ఫ్రెండ్కు నీటి లోపల ప్రపోజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమెరికన్
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- ట్రంప్ చేతులు కట్టుకున్న ఈ ఫొటో చెబుతున్న కథేంటంటే..
- కశ్మీర్లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








