భారత్ - పాక్: మేం కూడా భారత్ ‌పై దాడులు చేయగలమని చెప్పేందుకే విమానం కూల్చాం: ఇమ్రాన్ ఖాన్

imran khan

ఫొటో సోర్స్, Getty Images

భారత యుద్ధ విమానాలను కూల్చామన్న పాక్ వాదనల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

పుల్వామా ఘటన తర్వాత ఎలాంటి విచారణ కావాలనుకున్నా మేం సహకరిస్తాం అని పాకిస్తాన్ చెప్పింది.

అక్కడ జవాన్లు మృతి చెందారు, వారి కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయో నాకు తెలుసు.

పాకిస్తాన్‌లో 10 ఏళ్లలో 70 వేల మంది చనిపోయారు. నేను ఎన్నో కుటుంబాలను కలిశాను. మృతులు, గాయపడిన వారి కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

మేం ముందే భారత్‌కు ఒక ప్రతిపాదన చేశాం. మీరు ఈ ఘటనపై విచారణ చేయాలనుకుంటే, పూర్తిగా సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని చెప్పాం.

తీవ్రవాదులు మా భూభాగాన్ని ఉపయోగించడం మాకిష్టం లేదు. బయటివారు ఎవరైనా మా భూభాగం ఉపయోగించడాన్ని మేం అంగీకరించం

మేం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా, భారత్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇప్పుడు మేం తప్పనిసరి పరిస్థితుల్లోనే స్పందించాం.

దేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడుకోడానికి ఏ దేశమైనా ఇలాగే చేస్తుంది. వేరే దేశం తమ సరిహద్దుల్లోకి రావడాన్ని ఏ దేశమైనా అంగీకరించదు.

మేం నేరం చేశామని అవతలి వారే నిర్ణయాలు తీసుకుని, మాపై దాడులు చేస్తే ఒప్పుకోం.

భారత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఏవైనా చర్యలు చేపడతారని నేను భావించాను.

పాక్ ఆర్మీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వీటిని భారత యుద్ధ విమానం శిథిలాలుగా పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది

కానీ మేం భారత్‌కు సమాధానం ఇస్తామని చెప్పాం. ఉదయం మా ఆర్మీ చీఫ్ ఇతర అధికారులతో మాట్లాడాను.

భారత్ దాడుల వల్ల పాకిస్తాన్‌లో ఎలాంటి నష్టం జరిగిందో మాకు తెలీదు. అది తెలుసుకోకపోతే బాధ్యతారాహిత్యం అవుతుంది.

మా దగ్గర ఎలాంటి ప్రాణనష్టం జరగనపుడు, మేం దాడి చేసి భారత్‌లో ప్రాణనష్టం కలిగించాలనుకోలేదు.

మీరు మా దేశంలోకి వచ్చి దాడి చేస్తే, మేం కూడా మీ దేశంలోకి వచ్చి దాడులు జరపగలమని చెప్పడానికే ఇలా చేశాం

రెండు భారత్ మిగ్ విమానాలు పాకిస్తాన్ సరిహద్దు దాటి లోపలికి వచ్చాయి. వాటిని పాక్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. ఇద్దరు పైలెట్లు కూడా మా దగ్గరే ఉన్నారు.

రెండు దేశాలు ఈ సమయంలో వివేకంతో వ్యవహరించాలి. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా, అన్ని యుద్ధాల్లో మిస్ కాలుకులేషన్స్ జరిగాయి.

రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల అదే జరుగుతుంది. ఆ పరిణామాలు మనకు మంచివి కాదు.

ఇది తీవ్రమయితే ఎక్కడివరకో వెళ్తుంది. యుద్ధం జరిగితే అది నా చేతుల్లో, మోదీ కంట్రోల్లో ఉండదు. మేం చర్చలకు సిద్ధంగా ఉన్నామని మరోసారి ఆహ్వానిస్తున్నాం.

పుల్వామా ఘటనపై విచారణ జరపాలనుకుంటే సహకరించడానికి మేం సిద్ధం.

కానీ మేం మళ్లీ మళ్లీ చెప్పేది ఒక్కటే. మనం కూర్చుని చర్చించి పరిష్కరించుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)