బ్రెగ్జిట్: ఎందుకింత సంక్లిష్టం.. ఈయూ, బ్రిటన్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి

వీడియో క్యాప్షన్, బ్రెగ్జిట్ హైడ్రామా

బ్రెగ్జిట్ ఒప్పందంపై ఈ రోజు బ్రిటన్ పార్లమెంటులో జరిగే ఓటింగుకు ఎంపీలంతా సిద్ధమయ్యారు. తను ప్రతిపాదించిన ఒప్పందానికి మద్దతునిచ్చి బ్రిటిష్ పౌరుల ఆకాంక్షలను గౌరవించాలని ప్రధాని థెరెసా మే సభ్యులను కోరారు.

థెరెసా మే పార్టీకి చెందిన ఎంపీల్లోనే కొందరు ప్రతిపక్ష సభ్యులతో కలసి ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటువేయనున్నారనే సమాచారంతో ఈ ఓటింగులో థెరెసా మే ఓడిపోవచ్చని అంచనా.

ఒప్పందంలో కొన్ని సవరణలు చేయాలని ఓటింగు జరగడానికి ముందే ఎంపీలు సూచించే అవకాశముంది.

ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి విడిపోవడానికి అనుకూలంగా ప్రజలు రెండేళ్ల కిందట ఓటు వేశారు.

బ్రెగ్జిట్‌పై నిర్వహించిన రిఫరెండంలో 52 శాతం మంది ఈయూ నుంచి బయటకొచ్చేయాలన్న అభిప్రాయం తెలిపారు.

కానీ, ఈ నిష్క్రమణ ఎలా ఉండాలన్నది రిఫరెండం బ్యాలట్‌లో వివరించలేదు. ఈయూ, బ్రిటన్‌లు ఒక ఒప్పందానికొచ్చాయి. కానీ, దానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం కావాలి.

దీనికోసం ఓటింగ్ పెట్టాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అప్పుడే నిర్ణయించారు. అది జనవరి 15కి వాయిదా పడింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత బ్రిటన్, ఈయూ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదే కీలకం.

థెరెసా మే

ఫొటో సోర్స్, Getty Images

వేర్పాటు గడువు ఎప్పుడు?

2019 మార్చి 29, శుక్రవారం రాత్రి 11గంటలకు యురోపియన్ యూనియన్ నుంచి అధికారికంగా విడిపోవడానికి బ్రిటన్ కట్టుబడి ఉంది. బ్రెగ్జిట్ అనంతర పరిణామాలకు సంబంధించిన ఒప్పందాన్ని థెరిసా మే ప్రభుత్వంతో పాటు యురోపియన్ యూనియన్‌లోని 27 ఇతర దేశాలు ఆమోదించాల్సి ఉంది.

2016 జూన్‌లో బ్రెగ్జిట్ రెఫరెండం ముగిసిన అనంతరం థెరిసా మే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

యురోపియన్‌ యూనియన్‌కు యూకే చెల్లించాల్సిన రుణం, ఉత్తర ఐర్లాండ్ సరిహద్దు అంశం, ఈయూలో ఉండే యూకే ప్రజలు-యూకేలో ఉంటున్న ఈయూ ప్రజల భవిష్యత్తు... వేర్పాటుకు సంబంధించిన ఈ మూడు ప్రధాన అంశాలపై యూకే, ఈయూలు తాత్కాలికంగా ఓ అంగీకారానికి వచ్చాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా పూర్తవడానికి రెండు పక్షాలు 21 నెలల కాల వ్యవధికి అంగీకరించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)