సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సంక్రాతి అనగానే ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టల తళుకులు, తమిళ నాట అయితే మార్గాహి సాంస్కృతిక సౌరభాలు వెదజల్లుతూ పండగ వాతావరణాన్ని తలపిస్తుంది.
ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో ఇళ్లన్నీ దర్శనమిస్తాయి.
ఈ రంగు రంగుల ముగ్గులకి కూడా ఒక చరిత్ర ఉందా? ఇవి కేవలం సంస్కృతిలో భాగమా? ఆధునిక యుగంలో ఇంకా వీటికి ప్రత్యేకత ఉందా? ముగ్గుల చరిత్ర ఏమిటి? ఇవి ఎలా రూపాంతరం చెందాయి?
"థౌజండ్ సోల్స్: విమెన్, రిచువల్ అండ్ ఎకాలజీ ఇన్ ఇండియా, ఆన్ ఎక్స్ప్లొరేషన్ అఫ్ ది కోలం" అనే పుస్తక రచయత విజయ నాగరాజన్ తన పుస్తకంలో ముగ్గులు, వాటి చరిత్ర, మహిళల జీవితంలో వాటి ప్రాధాన్యతలను విస్తృతంగా చర్చించారు.
ముగ్గుల చరిత్ర వాటి ప్రాధాన్యత గురించి విజయ నాగరాజన్ బీబీసీ న్యూస్ తెలుగుతో ఇ-మెయిల్లో సంభాషించారు.
ముగ్గులను ఉత్తరాదిలో రంగోలి, తమిళనాడులో కోలం, బెంగాల్లో అల్పన, రాజస్థాన్ లో మండన, సంస్కృతంలో మండల అని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏమి లేవని అంటూ, వేదాలలో సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయని నాగరాజన్ తెలిపారు.
తమిళ సంస్కృతిలో తొలిసారిగా ముగ్గు గురించి మధ్య యుగానికి చెందిన ఆండాళ్ అనే కవయిత్రి ప్రస్తావించారని పేర్కొన్నారు.
ముగ్గులు, మహిళల మధ్య సంబంధం గురించి చెబుతూ రంగులతో వేసే రకరకాల రంగవల్లులు మహిళల ధార్మిక క్రతువులో ఒక భాగం అని వివరించారు.
డిసెంబర్-జనవరి నెలలని తమిళనాడులో 'మార్గాహి' అంటారని, శీతాకాలం ప్రవేశంతో, పూజకి, ఆధ్యాత్మికతకు ఈ కాలం నెలవుగా ఉండటం వలన ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సాంప్రదాయంగా స్థిరపడింది అని విజయ అంటారు.
విశ్వంలో ఉండే శక్తులను, భూమాతని, దేవతలను ఆరాధించేందుకు ఇదొక మార్గమని ఆమె అభిప్రాయ పడ్డారు. అలాగే ముగ్గులు లెక్కల పట్ల అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు.
ముగ్గులు పెట్టడం వెనక చాలా కారణాలు దాగి ఉన్నాయని అంటూ, కొన్ని వేల జీవాలకు ఆహారంగా ఈ ముగ్గు పిండి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా ప్రాంతాలలో ముగ్గు కోసం బియ్యం పిండిని వాడతారు. ఈ పిండిని బయట తిరిగే క్రిమి కీటకాలు, పశు పక్ష్యాదులు ఆహారంగా తీసుకునేందుకు ఉపయోగపడతాయని కొందరు భావిస్తారు.
కొన్ని వేల మందికి అన్నదానం చేయడం కేవలం ధనికులకు మాత్రమే వీలవుతుందని, సామాన్యులు కొన్ని వేల మూగ జీవాలకు ఈ విధంగా ఆహారం అందించి తిరిగి ఏమి ఆశించకుండా ఉండటమే ముగ్గు పెట్టడం వెనక ముఖ్య ఉద్దేశ్యం అని వివరించారు విజయ.
సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో తెలవారకముందే ఇంటి ముందు వేసే ముగ్గు చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేయడానికి ఒక సాధనం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కల్చరల్ స్టడీస్లో పరిశోధన చేసిన డాక్టర్ వర్ష గోవాన్కర్ ‘ముగ్గులు - సంస్కృతి’ అనే అంశంపై రాసిన ఒక పరిశోధన పత్రంలో ముగ్గులు ప్రాంతీయ ఆచారాలు, సంస్కృతి ఆధారంగా పరిణమించాయి అని పేర్కొన్నారు.
రంగవల్లులు ఎపుడు ఎలా పుట్టాయి, వీటి సృష్టికర్తలు ఎవరు అని కచ్చితంగా నిర్ధారించలేము అంటూ , రాతి యుగం నుంచే చిత్రాలు వేయడం మనుగడలో ఉందని, ఇది తరతరాల నుంచి ప్రయాణించిన ఒక కళా రూపమని రాశారు.
కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని ఈ పరిశోధన పత్రంలో వర్ష రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ముగ్గులు వేయడం కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది సంస్కృతిలో భాగం అని వివరించారు.
ముగ్గులు కేవలం పండగలకే కాకుండా, ప్రజల నిత్య జీవితంలో భాగం. కొందరు దీనిని పూర్తి కళా రూపంగా చూస్తే కొందరు సంస్కృతికి, మతంలో భాగంగా చూస్తారని ఈ పత్రం పేర్కొంది.
రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు.
'లాంగ్వేజ్ అఫ్ సింబల్స్’ అనే పుస్తకంలో గీత నారాయణన్, అర్చన శాస్త్రి దక్షిణ భారతంలో ఉన్న అనేక గుర్తులు, చిత్రాల చరిత్రని వివరించారు.
కర్ణాటకకు చెందిన బి.కే బైరి ముగ్గులు డిజైన్లతో పుస్తకాన్ని ప్రచురించారు.
హిందువుల వివాహాలు, పండగలు, ఇంకా అనేక ముఖ్య మత సంబంధమైన కార్యక్రమాలలో ముగ్గులు వేయడం ఒక భాగం.
ఇంటి గుమ్మాలు, గోడల అలంకరణ చాలా ఆదివాసీ గిరిజన సంస్కృతులలో భాగంగా అనాది కాలం నుంచి ఉందని ఈ పత్రంలో వర్ష వివరించారు.
సింధు నది నాగరికత సంస్కృతీ నుంచి వచ్చిన చిత్రాలే రంగోలిగా రూపాంతరం చెందుతూ వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
ముగ్గులు రక రకాల డిజైన్లలో ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
పువ్వులు, కొమ్మలు, చతురస్రాకారం, త్రిభుజం, ప్రకృతి, కొండలు, దీపాలు వంటి వివిధ ఆకృతులు ముగ్గుల డిజైన్లలో కనిపిస్తుంటాయి.
ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ముగ్గుల డిజైన్లలో ఎక్కువగా ప్రకృతిలో ఉండే వృక్షాలు, జంతువులూ, పక్షులు, కొండలు ప్రతిబింబిస్తాయని వర్ష తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
తూర్పు ప్రాంతాలలో గుడ్లగూబ చిత్రం కూడా రంగోలిలో కనిపిస్తుందని, ఇది కొంత వరకు తాంత్రిక విధానానికి ప్రతీక అని రాశారు.
ద్రవిడ సంస్కృతి ఇందుకు పూర్తి భిన్నంగా సరళ రేఖలు, వృత్తాలతో కూడి ఉండటం కూడా ఇక్కడ ఉండే నాగ ఆరాధనకు ప్రతిబింబం కావచ్చని అభిప్రాయపడ్డారు.
అపార్ట్మెంట్ సంస్కృతితో పట్టణాలలో కనుమరుగైన ముగ్గులు పల్లెటూర్లలో మాత్రం ఇంకా తమ ఉనికిని కోల్పోలేదు.
అయితే కొందరు ఎన్ఆర్ఐలు మాత్రం సంస్కృతిని పరిరక్షించేందుకు విదేశాలలో స్థిరపడినా వణికించే చలిని కూడా లెక్క చేయకుండా ఈ నెల రోజులు ముగ్గులు వేస్తున్నారు.
షికాగోలో ఒక ఐటి సంస్థలో పని చేస్తున్న రాధిక గరిమెళ్ళ మాట్లాడుతూ, "నాకు ఆరేళ్ళు ఉన్నప్పటి నుంచి ముగ్గులు పెడుతున్నాను. మా అమ్మతో కలిసి, చలిలో, తెల్లవారుజామున ముగ్గులు పెట్టడం ఇప్పటికీ ఒక మరిచిపోలేని జ్ఞాపకం. ఒకసారి చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే, ముగ్గులు వేయడం ఒక కళ మాత్రమే కాదు, ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి ఒక మంచి వేదికగా ఉండేదని అనిపిస్తుంది’’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నేను ముగ్గులు వేయడానికి చుక్కలు పెడుతూ సరి సంఖ్యలు నేర్చుకున్నాను. ధనుర్మాసంలో వేసే నెలగంటి ముగ్గులు మేధస్సుకి సవాలుగా అనిపిస్తాయి.
చిన్నపుడు పక్కింటి వాళ్ళు, ఎదురింటివాళ్ళు వేసిన ముగ్గులు చూసి నేర్చుకున్నవే ఎక్కువ. చాలా వరకు వాటినే కాస్త కొత్త డిజైన్లుగా మార్చాను’’ అని చెప్పారు.
ప్రతి రోజు పాత ముగ్గులని చెరిపేసి, కొత్త ముగ్గు వేయడంలో జీవితాన్ని ప్రతి క్షణం కొత్తగా జీవించాలనే సిద్ధాంతాన్ని చెప్పడమేనేమో అని అనిపిస్తుందంటారు రాధిక.
‘‘ఈ ముగ్గులు వేయడం నాకు ఒక మెడిటేషన్లా అనిపిస్తుంది. ఇది కేవలం సంస్కృతిలో భాగమే కాదు, నాకు బోలెడంత ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, స్నేహితుల నుంచి వచ్చే ప్రోత్సాహం చూసి నాకు మరింత ఉత్సాహంగా అనిపిస్తుంది.’’
ఇంటి ముందు వేసుకునే ముగ్గులు కాలక్రమేణా చీరలు, ఆభరణాల డిజైన్లలోకి వచ్చి కూడా వచ్చి చేరాయి.
"నేను అమెరికాలో స్థిరపడినా ముగ్గులు వేస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు తలచుకుని నోస్టాల్జిక్గా ఫీల్ అవుతాను. ఇవి నక్షత్ర మండలాన్ని తలపించేలా ఉంటాయి. ప్రకృతి లో ఉండే వివిధ అంశాలను ముగ్గుల ద్వారా నేర్చుకోవడమే ముగ్గుల వెనక ఉద్దేశ్యం" అని మేరీల్యాండ్ లో స్థిరపడిన దాక్షాయణి వేదుల అనే ఐటీ ఉద్యోగిని తెలిపారు.
క్రిమి కీటకాదులకి ఆహారాన్ని అందించడానికి బియ్యం పిండితో ముగ్గులు వేస్తామని అన్నారు. మైనస్ ఉష్ణోగ్రతలు ఉన్నా ముగ్గులు వేయడం మానలేదని చెప్పారు.
"భారతదేశం రాతి యుగాన్ని తోడుగా తీసుకుని ప్రయాణిస్తుంది. ఒక వైపు సున్నపురాతి యుగం మరో వైపు అణు యుగం కలిసి ప్రయాణం చేస్తాయి. యుగాల నాటి ఒక నమ్మకాన్ని, సంస్కృతిలో భాగం చేయగలగడం కేవలం భారతీయ సాంప్రదాయాల ప్రత్యేకత" అని రచయిత పుపుల్ జయకర్ అంటారు.
ఇవి కూడా చదవండి:
- క్రైస్తవం అతి పెద్ద మతంగా ఎలా విస్తరించింది...
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- ఇంట్లో వాయు కాలుష్యం: గాలి నాణ్యతను పెంచుకునే ఐదు మార్గాలు
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
- ఏటా 5.6 కోట్ల అబార్షన్లు... ప్రమాదంలో మహిళలు
- గోత్రం అంటే ఏమిటి.. అది ఎలా పుట్టింది
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్స్!
- కోడిపందేల చరిత్ర తెలిసి ఉండొచ్చు.. మరి కోడి చరిత్ర తెలుసా?
- ఉగాది: మనం ఉన్నది 2019లో కాదు... 1940 లేదా 2075!
- ఏ వెలుగు మంచిది? సహజమైనదా, కృత్రిమమైనదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









