అమృత్సర్ రైలు ప్రమాదం: ఒకపక్క రావణ దహనం.. మరోపక్క రావణ పాత్రధారి దుర్మరణం

పంజాబ్లోని అమృత్సర్లో జోడా ఫాటక్ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం మృతుల్లో ఒకరైన దల్బీర్ సింగ్ అక్కడ నిర్వహించిన రామ్లీలా ప్రదర్శనలో రావణుడి వేషం వేశారు. తర్వాత రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాల వద్దకు వెళ్లారు. ఇంతలో ప్రమాదం సంభవించింది.
శనివారం మధ్యాహ్నం వరకున్న సమాచారం ప్రకారం ఈ విషాదంలో 58 మంది చనిపోయారు. దసరా వేడుకల్లో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటైంది.
శనివారం తెల్లవారుజామున దల్బీర్ సోదరుడు బల్బీర్ సింగ్ ప్రమాద స్థలిలో కనిపించారు. ప్రమాద స్థలంలో తమ ఆత్మీయుల జాడ కోసం వెతుకుతున్న చాలా మందిలో ఆయన ఒకరు.

బాధిత కుటుంబాల వారు మొబైల్ ఫోన్ల టార్చి వేసి రైల్వే పట్టాల దగ్గర వెతుకుతున్నారు. వీరిలో ఒకరైన ఉష తన సమీప బంధువైన ఆశీస్ కోసం ఆస్పత్రులకు వెళ్లి చూశారు. అక్కడ కనిపించకపోవడంతో ఘటనా స్థలికి వచ్చి వెతుకుతున్నారు. ప్రమాదంలో ఆశీష్ పొదల్లో ఏమైనా పడిపోయాడా అని అక్కడ చూస్తున్నారు.
మంజిత్ సింగ్ అనే వ్యక్తి ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన అంకుల్ అజిత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు అప్పుడు రావణుడి బొమ్మ దహనాన్ని చూస్తూ రైలు పట్టాలు దాటుతున్నారు. దూసుకొస్తున్న రైలును చూసి మంజిత్ తక్షణం ఒక్క ఉదుటున పట్టాల మీద నుంచి పక్కకు దూకేశారు. అజిత్ సింగ్ అలా దూకలేకపోయారు. స్నేహితుడి సాయంతో మంజిత్ ఆయన్ను ద్విచక్ర వాహనంపై గురు నానక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అజిత్ సింగ్ అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు.

దల్బీర్ గాలిపటాల తయారీదారుడని, ఆయనకు నటనంటే బాగా ఆసక్తి అని బల్బీర్ బీబీసీతో చెప్పారు. దల్బీర్ ఎప్పుడూ రాముడి వేషం వేసేవారని, స్నేహితుల ఒత్తిడి మేరకు ఈసారి తొలిసారిగా రావణుడి వేషం వేశారని బల్బీర్ వివరించారు.
''ప్రదర్శనలో చివరి అంకం పూర్తయిన తర్వాత దల్బీర్ వేదిక దిగి వచ్చారు. విల్లు తీసుకొని రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాల వద్ద ఉన్న గుంపుతో కలిశారు'' అని బల్బీర్ తెలిపారు.
ప్రదర్శన జరిగిన వేదికకు, రైలు పట్టాలకు మధ్య దూరం దాదాపు 25 మీటర్లు.
దల్బీర్కు భార్య, కుమార్తె ఉన్నారు.

అజిత్ సింగ్ దసరా వేడుకలకు తనను ఆహ్వానించారని మంజిత్ సింగ్ తెలిపారు. మంజిత్ది కూడా అమృత్సరే. ఆయన హాల్బజార్లో దుకాణదారు. అజిత్ సింగ్ వెల్డింగ్ పనులు చేస్తుంటారు.
ఆ రైల్వే ట్రాక్పై నుంచి అయితే రావణ దహనం బాగా కనిపిస్తుందనే ఉద్దేశంతో వారు అక్కడకు వెళ్లి నిలబడ్డారు. ''బాణసంచా పేలుళ్ల భారీ శబ్దాలు, పండగ సందడితో రైలు వస్తున్న శబ్దం మాకు వినిపించలేదు. నేను చివరి క్షణంలో రైలును చూడటం వల్ల పక్కకు దూకి తప్పించుకోగలిగాను'' అని మంజిత్ వివరించారు. అప్పటివరకు వేడుక జరిగిన ప్రాంతం కాస్తా క్షణాల్లో మారిపోయింది. తెగిపడ్డ శరీర అవయవాలు, రక్తపు మరకలతో భయానకంగా కనిపించింది.
ఇవి కూడా చదవండి:
- హార్వ ర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ‘ఆసియా దరఖాస్తుదారులపై వివక్ష’
- చిన్నపిల్లలకు గ్రోత్ హార్మోన్లు.. బ్రోకర్ల దారుణాలు
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









