ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. వీరిలో యాక్టింగ్ హై కమిషనర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హై కమిషనర్ పాట్రిక్ హెబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, లాన్ రాస్ డేవిడ్ ట్రైట్స్, ఆడమ్ జేమ్స్ చుయిప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. వారు 2024 అక్టోబర్ 19 శనివారం రాత్రి 11:59 గంటల లోగా భారతదేశం నుంచి వెళ్లిపోవాలని కోరింది.
అంతకుముందు కెనడాలోని తమ హైకమిషనర్ సంజయ్ వర్మతో పాటు, మరికొందరు దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నట్టు భారత్ ప్రకటించింది.
అయితే, భారత్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడా రాజధాని ఒట్టావాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రూడో మాట్లాడారు. ఆరుగురు భారత దౌత్యవేత్తలను తామే బహిష్కరించామని ఆయన చెప్పారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం సహకరించకపోవడమే ఇందుకు కారణమని ట్రూడో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్తోపాటు ఇతర దౌత్యవేత్తలను కెనడా ‘పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (దర్యాప్తుకు సంబంధించిన సమాచారం ఉండటం, లేదా కేసుతో సంబంధం ఉండటం) గా పేర్కొనడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఆదివారం కెనడా నుంచి ఈ వార్త దౌత్య సందేశం ద్వారా అందిందని, దీనిపై ప్రతిగా చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
"ఈ అసంబద్ధమైన ఆరోపణలను భారత ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తోంది" అని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

గతేడాది కెనడాలో జరిగిన నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని గత ఏడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఈ వివాదంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో వీసా సేవలను నిలిపివేయాలని, దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కెనడాను భారత్ కోరింది.
ఇక తాజాగా సోమవారం (అక్టోబర్ 14) కెనడా ప్రకటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహంగా స్పందించింది. కెనడా ఆరోపణలు ట్రూడో ‘రాజకీయ ఎజెండా’లో భాగమని విమర్శించింది.
‘‘భారత దౌత్యవేత్తలపై ఆరోపణలు చేయడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నాలకు ప్రతిస్పందనగా తదుపరి చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉంది’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ 36 ఏళ్ల కెరీర్ను ప్రస్తావిస్తూ ఆయనకు మద్దతుగా భారత విదేశాంగ శాఖ కొన్ని వ్యాఖ్యలు చేసింది.
"కెనడా ప్రభుత్వం ఆయనపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవి, ధిక్కారపూరితమైనవి’’ అని వ్యాఖ్యానించింది.
కెనడా చర్యలపై వివరణ ఇవ్వాలని దిల్లీలోని ‘కెనడా డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్’ స్టువర్ట్ వీలర్కు భారత విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీచేసింది.
కెనడాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయనకు తెలియజేసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తమ దౌత్యవేత్తల భద్రతకు ప్రస్తుత కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నమ్మకం తమకు లేదని, అందుకే కెనడాలోని తమ హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.
భారత్ ప్రకటన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు.
కెనడాలో హింస-సంబంధిత కార్యకలాపాల్లో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయంపై దర్యాప్తుకు సహకరించడానికి భారత ప్రభుత్వం నిరాకరించిందని ట్రూడో ఆరోపించారు.
"కెనడా గడ్డపై కెనడియన్లకు వ్యతిరేకంగా జరిగే నేరపూరిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం తప్పు చేసింది" అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘భారత దౌత్యవేత్తలు కెనడా పౌరుల సమాచారాన్ని సేకరించి, హింసాత్మక నేరాలకు పాల్పడేవారికి చేరవేస్తున్నారు’’ అని ట్రూడో ఆరోపించారు.
పౌరుల భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాల్లో భారత ప్రభుత్వ ఏజెంట్లు పాల్గొంటున్నారని, అందుకు సంబంధించి తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) చెప్పింది.

ఫొటో సోర్స్, SIKH PA
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో..
హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం ఉన్న భారత సంతతి వ్యక్తి, వయసు 45 ఏళ్లు. ఆయన్ను 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ సిక్కు గురుద్వారా బయట ముసుగులు ధరించిన ఇద్దరు సాయుధులు కాల్చి చంపారు. ప్రత్యేక సిక్కు దేశం డిమాండ్ చేసే ఖలిస్తాన్ ఉద్యమానికి ఆయన మద్దతుదారు, దాని కోసం బహిరంగంగా ప్రచారం కూడా చేశారు.
పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్ను ‘ఉగ్రవాది’గా ప్రకటించింది. ఈ ఆరోపణలు ఆధార రహితమైనవని ఆయన మద్దతుదారులు చెప్పారు.
నిజ్జర్ హత్య ‘టార్గెటెడ్ ఎటాక్ (లక్షిత దాడి)’గా కెనడా పోలీసులు తెలిపారు. ఈ ఘటన కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని ట్రూడో గతంలో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, 2023 అక్టోబర్లో భారత్ వీసాల జారీని పునఃప్రారంభించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైనట్లు కనిపించాయి.
అయితే, భారత్తో కెనడా సంబంధాలు ఉద్రిక్తమైనవని, చాలా కష్టమైనవని కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీ గతవారం వ్యాఖ్యానించారు. కెనడియన్ గడ్డపై నిజ్జర్ వంటి మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని కూడా ఆమె చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














