నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి: ఇది లెబనాన్ పనేనని తెలిపిన ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters
ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తిగత నివాసం లక్ష్యంగా లెబనాన్ డ్రోన్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఈ దాడి జరిగినప్పుడు నెతన్యాహు, ఆయన భార్య ఇంట్లో లేరని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇల్లు షిజ్రియా ప్రాంతంలో ఉంది. శనివారం ఉదయం ఇజ్రాయెల్ మీద మూడు డ్రోన్ దాడులు జరిగాయని, ఇందులో ఒకటి నెతన్యాహు నివాసంపై కాగా, మిగిలిన రెండింటిని తాము గాల్లోనే పేల్చేశామని సైన్యం తెలిపింది.
గురువారం రాత్రి లెబనాన్ నుంచి 55కు పైగా రాకెట్లు ఇజ్రాయెల్ మీదకు వచ్చాయని కూడా సైన్యం వెల్లడించింది.

లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో కొన్నింటిని తాము కూల్చి వేశామని, మరి కొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడ్డాయని సైనిక ప్రతినిధి తెలిపారు.
తాము ఉత్తర ఇజ్రాయెల్ మీదకు అనేక రాకెట్లు ప్రయోగించామని హిజ్బొల్లా కూడా ఒక టెలిగ్రామ్ పోస్ట్లో తెలిపింది.
ఉత్తర ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయెల్ పట్టణం ష్లోమి మీద పొగ మేఘాలు అలమముకున్న దృశ్యాలు కనిపించాయి.
హైఫా ఉత్తరాన ఉన్న ఇజ్రాయెల్ మిలటరీ బేస్ మీదకు హిజ్బొల్లా రాకెట్లు ప్రయోగించింది.
ప్రధాని నెతన్యాహు వ్యక్తిగత నివాసం మీదకు డ్రోన్ ప్రయోగం జరగడం భద్రత వైఫల్యంగా భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది. ఈ దాడిపై దర్యాప్తు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














