పాకిస్తాన్లో డాలర్ విలువ 250 రూపాయలు దాటింది... ఈ దేశం ఎటు వెళ్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బిలాల్ కరీబ్ ముగల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- నుంచి, ఇస్లామాబాద్
డాలర్ రేటు ఎలా ఉంది? పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఇప్పుడు దీని మీదే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అమెరికా డాలర్తో పోల్చితే పాక్ రూపాయి విలువ పడిందా, బలపడిందా అని నెటిజన్లు ఒకరినొకరు కనుక్కోవడం సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది.
వాస్తవానికి డాలర్ విలువపై విధించిన 'పరిమితి'ని బుధవారం నుంచి తొలగించినట్లు ఫారెక్స్ కంపెనీలు ప్రకటించాయి. పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు గణనీయంగా క్షీణించిన తరువాత, డాలర్ ధరలను పాకిస్తాన్ ఎక్స్ఛేంజ్ కంపెనీల అసోసియేషన్ స్థిరంగా ఉంచే ప్రయత్నం చేసింది.
మార్కెట్లో గందరగోళ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా ఇంటర్బ్యాంక్ రేటును స్థిరంగా ఉంచుతోంది.
బ్లాక్ మార్కెట్, ఇంటర్బ్యాంక్, బహిరంగ మార్కెట్ల మధ్య ఉన్న డాలర్ మారకపు విలువలోని వ్యత్యాసాలు లేకుండా చేసేందుకే ఈ ప్రయత్నాలు చేపడుతున్నట్లు ఎక్ఛేంజి కంపెనీలు చెబుతున్నాయి.
అయితే, "డాలర్ విలువపై విధించిన పరిమితి ప్రతికూలంగా మారినట్లు రుజువైంది. ఈ చర్య వల్ల డాలర్ విలువ తగ్గడానికి బదులుగా పెరిగింది" అని పాకిస్తాన్ ఫారెక్స్ అసోసియేషన్ ఛైర్మన్ మాలిక్ బోస్తన్ ప్రకటించారు.
దీనివల్ల బ్లాక్ మార్కెట్ పెరిగి మార్కెట్లో గందరగోళం ఏర్పడిందని, ఎక్స్ఛేంజీ కంపెనీలకు చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డాలర్ల కొరత ఎలా ఏర్పడింది?
పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రిగా ఇషాక్ దార్ ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే, “డాలర్ వాస్తవ విలువ 200 రూపాయల కన్నా తక్కువగా ఉంది. మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్లో డాలర్ ధర నిజ స్థాయికి వస్తుంది” అని ప్రకటించారు.ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కూడా మంత్రి అన్నారు.
అయితే, పాకిస్తాన్ ఫారెక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాలిక్ బోస్టన్ మాత్రం, “దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే డాలర్ ధరపై పరిమితి విధించారు. కానీ, ఇప్పుడు ఈ పరిమితిని తొలగించాలని ఎక్స్ఛేంజ్ కంపెనీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి” అని అన్నారు.
డాలర్ల కొరత కారణంగా ఎక్స్ఛేంజ్ కంపెనీలకు ఎక్కడి నుంచీ డాలర్లు రావడం లేదన్నారు మాలిక్. అయితే, ముందుగా దిగుమతిదారులకు డాలర్లు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ సూచిస్తోందని తెలిపారు.
అందుకే, విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీల నుంచి వచ్చే డబ్బు అంతా ఇంటర్బ్యాంక్ మార్కెట్కు ఇస్తున్నారు. గతంలో అయితే, దానిలో 80 శాతం ప్రజలకు, 20 శాతం బ్యాంకులకు ఇచ్చేవారు.
“ప్రజలు తమ వద్ద ఉన్న డాలర్లను అమ్ముతారని స్టేట్ బ్యాంక్ భావించింది. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. దానికి బదులుగా డాలర్ల కొనుగోలు పెరిగింది” అని మాలిక్ అన్నారు. ఈ కొనుగోళ్ళ తరువాత డాలర్ ధర తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
"విదేశాల నుంచి వచ్చే డబ్బు కూడా తగ్గిపోయింది. ఇది 300 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్లకు పడిపోయింది. మార్కెట్, ఇంటర్ బ్యాంక్, బ్లాక్ మార్కెట్ల మధ్య డాలర్ విలువలో అత్యధికంగా 20-30 రూపాయల తేడా ఉండడమే దీనికి కారణం. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాల్సి ఉంది” అని మాలిక్ అన్నారు. అయితే, పరిమితి ఎత్తేయడం వల్ల డాలర్ ధర 250 రూపాయల వరకు చేరుకోవచ్చని ఆయన అన్నారు.
నిజానికి, బుధవారం మార్కెట్లు తెరుచుకునేప్పటికి డాలర్ ధర మరింత బలపడి 12 రూపాయలు పెరిగి రూ. 252 వద్ద ట్రేడ్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
'సరైన దిశలో సరైన అడుగు'
ఇది సరైన దిశగా వేసిన ముందడుగేనని, దీనవల్ల కరెన్సీ మార్కెట్లో హవాలా నిధుల జోక్యం తగ్గడంతో పాటు ఓపెన్ మార్కెట్లో డాలర్ రేటు కూడా తగ్గుతుందని అని పాకిస్తాన్ ఆర్థిక నిపుణుడు ఉజైర్ యూనిస్ బీబీసీతో అన్నారు. ఆయన అట్లాంటిక్ కౌన్సిల్ నిపుణుల బృందంలో పాకికిస్తాన్ ఇనిషియేటివ్ డైరెక్టర్గా ఉన్నారు.
అయితే, ఇంటర్ బ్యాంకులో కూడా డాలర్ ధరను కట్టడి చేయడం అవసరం కాబట్టి ఇదొక్కటే సరిపోదని కూడా ఆయన చెప్పారు. ఇంటర్ బ్యాంకు రేటు విషయంలో జాప్యం జరిగితే మళ్లీ హవాలా నిధుల మూలంగా బ్లాక్ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతుందని ఉజైర్ వివరించారు.
ఈ నిర్ణయం తర్వాత డాలర్లను డిపాజిట్ చేసిన వారు తమ వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తారా అని అడిగినప్పుడు ఆయన, “కొంతమేరకు డాలర్ కొనుగోళ్లు, అమ్మకాలు జరగవచ్చు. కానీ, దేశంలో ఆర్థిక అనిశ్చితి మూలంగా అవి మరీ అంతగా ఉండకపోవచ్చు” అని చెప్పారు.
ఐఎంఎఫ్తో చర్చలు పరిష్కారమయ్యే వరకు, ఆ సంస్థ నుంచి ఆర్థిక సాయం పూర్తిగా విడుదల కానంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే, దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందనే భావన ప్రజల మనసుల్లో బలంగా ఉంది.
"ఇప్పుడు ఎక్స్ఛేంజి కంపెనీలు మార్కెట్లో ఉన్న ధరకే డాలర్ లావాదేవీలు చేస్తాయని స్పష్టమైంది" అని ఉజైర్ ట్వీట్ చేశారు. అయితే, డాలర్ ఇంటర్ బ్యాంకు రేటు సర్దుబాటు విషయంలో ఈ ప్రకటన తొలి అడుగు అనుకోవచ్చా" అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, EPA
డాలర్ అధికారిక రేటు పెరుగుతుందా...
ఒకవైపు బ్లాక్ మార్కెట్లో డాలర్ విలువ తగ్గుతుందని మాలిక్ భావిస్తుండగా, మరోవైపు అందుకు విరుద్ధంగా జరుగవచ్చనే భయాందోళనలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
డాలర్ అధికారిక విలువ కచ్చితంగా ఇంకా పెరుగుతుందని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు.
జర్నలిస్ట్ కమ్రాన్ ఖాన్, "డాలర్ అధికారిక విలు 230 రూపాయలని, ఓపెన్ మార్కెట్లో 240 రూపాయలని, తేడా అల్లా 10 రూపాయలేనని, ఆ వ్యత్యాసం కూడా త్వరలోనే మాయమైపోతుందని స్టేట్ బ్యాంక్ గవర్నర్కు రాత్రి ఏదో కల వచ్చినట్లుంది" అని ట్వీట్ చేశారు.
"అవును, రేపు ఈ తేడా ఉండదు, వెంటనే రూపాయి విలువ కనీసం ఇంకో 10 శాతం పడిపోతుంది. బహిరంగ మార్కెట్లో డాలర్ అధికారిక విలువ 250 దాటుతుంది" అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
'డాలర్ పరిమితిని తీసేయాలని ఎక్స్ఛేంజ్ కంపెనీలు ప్రకటించాయి. దీని తర్వాత డాలర్ ఎక్కడికి వెళుతుందో చూద్దాం' అని ఆర్థిక విశ్లేషకుడు, జర్నలిస్ట్ ఖుర్రం హుస్సేన్ ట్వీట్ చేశారు.
అదే సమయంలో ఒక యూజర్ ఇలా ట్వీట్ చేశారు: 'మాలిక్ బోస్తన్ నిర్ణయం తరువాత చాలా మంది డాలర్ విలువ గురించి చాలా మాట్లాడుతున్నారు. కానీ, అవేమీ జరగవు.'
ఇవి కూడా చదవండి:
- చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా... ఇది దేనికి సంకేతం
- భారత్లో మతపరమైన హింస తగ్గుతోందా, చరిత్ర ఏం చెబుతోంది?
- సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’
- ముకరం జా: ఇస్తాంబుల్లో మరణించిన ఈ ఎనిమిదో నిజాం చరిత్ర ఏంటి?
- ఆక్స్ఫామ్ నివేదిక: ఒకశాతం వ్యక్తుల చేతుల్లో 40శాతం భారత్ సంపద
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















