చంద్రబాబు అరెస్ట్: ప్రజలే అండగా ఉండాలన్న భువనేశ్వరి.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి జోక్యం కోరుతూ లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్

ఫొటో సోర్స్, TDP
ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని, ఆయనకు అందరూ చేయూత అందించాలని ఆయన భార్య నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు నాయుడును కాపాడాలని, ఆయనకు మనో ధైర్యం ఇవ్వాలని విజయవాడ కనకదుర్గమ్మను వేడుకున్నాను’’ అని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
‘‘చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటం మీ అందరి కోసం. మీరంతా చేయిచేయి కలిపి ఈ పోరాటం దిగ్విజయం చేయాలి’’ అని ఆమె అన్నారు.
చివర్లో జైహింద్, జై అమరావతి అంటూ ఆమె నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, Ram Mohan Naidu Kinjarapu
రాష్ట్రపతి, ప్రధాని జోక్యం చేసుకోవాలి: టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడు
చంద్రబాబు అరెస్టు విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడు లేఖలు రాశారు.
‘‘చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, దీని వెనుక పరిణామాలపై చాలా సందేహాలు ఉన్నాయి. దీనిపై పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు హక్కులను నిలబెట్టేలా తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి’’ అని రామ్మోహన్ నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుపై ఎలాంటి అవినీతి మచ్చ లేదు. మంచి దార్శనికతతో రాష్ట్ర అభివృద్ధికి ఆయన పాటుపడ్డారు. కానీ, అప్రజాస్వామిక విధానంలో ఆయనను అరెస్టు చేశారు. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలనూ అనుసరించలేదు’’ అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
రాష్ట్రంలో ప్రధాన విపక్ష నాయకులందరిపైనా వైసీపీ ప్రభుత్వం కావాలనే ఇలా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులన్నీ రాజకీయ దురుద్దేశాలతో నమోదుచేసినవే. వీటిని వెనుక వారి అజెండా ఉంది. నియంతృత్వ ధోరణితో వీరు ముందుకు వెళ్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన అభ్యర్థించారు.
పదేళ్లకంటే ఎక్కువ శిక్ష పడే కేసు ఇది-ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్

ఫొటో సోర్స్, APCID
కాగా అంతకు ముందు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను స్కామ్ చేసేందుకే ప్రారంభించారని ఆయన అన్నారు. ఇందుకోసం అప్పటి కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను తీసుకొచ్చిన చంద్రబాబు ఆ సంస్థ బాధ్యతలను గంటా సుబ్బారావుకు అప్పగించారన్నారు.
అంతేకాక ఈ సుబ్బారావుకు సీఎం సలహాదారు, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత హోదా సహా నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన ద్వారా బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని అన్నారు.
‘‘ఇది రూ. 550 కోట్ల స్కామ్. ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వచ్చింది. నకిలీ ఇన్వాయిస్ ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. ఇందులో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే. ఇందులో జరిగిన లావాదేవీలన్నీ ఆయనకు తెలుసు. ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. దీనిపై ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేశాయి.’’ అన్నారు సంజయ్.
‘‘ఈ స్కామ్ లో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశాం. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందే. నిధులు దారి మళ్లించడానికి సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. 2014 జూలై నాటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్తో ఒప్పందం కుదిరింది. కేబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు’’ అని సంజయ్ వెల్లడించారు.
ఇది కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే కేసు అని సంజయ్ అన్నారు.
చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని సంజయ్ తెలిపారు. ఓర్వకల్లు నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని చెప్పామని, కానీ, చంద్రబాబు తిరస్కరించారని ఆయన వెల్లడించారు. ఆయన వయసు, ఆరోగ్యం, హోదా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
మరోవైపు నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు తరలించారు.
అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ఆయన ఛాతిలో అసౌకర్యంగా ఉన్నట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు.
చంద్రబాబుకు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నం చేస్తున్నామని, ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని న్యాయవాది అన్నారు.
ఇటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఇదే కేసులో అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున ఆయన నివాసానికి చేరుకున్న దిశ ఏసీపీ వివేకానంద, గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
నిబంధనల ప్రకారమే కేసు, అరెస్టు: ఏపీ హోంమంత్రి తానేటి వనిత
చంద్రబాబు అరెస్ట్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం, కుట్రలు లేవని ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వివరాలను తానేటి వనిత వెల్లడించారు.
‘‘సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ చేసిన తర్వాత నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని సీఐడీ అధికారులు చెప్పిన మాటను చంద్రబాబు వినలేదు..
ఆయన హెలీకాప్టర్లో వెళ్లడానికి ఎందుకు నిరాకరించారో అందరికీ అర్థం అవుతుంది.
స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో జరిగిన స్కామ్ను మొదటగా 2017లో అంటే గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేయాలని చూస్తున్నాయి.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ కుట్రలతో అరెస్ట్ చేయించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఆయన చేసిన తప్పిదాల కారణంగానే జరిగింది.
పురందేశ్వరి పార్టీకి నిబద్దతతో ఉన్నారా? లేక బంధుత్వానికి నిబద్ధతతో ఉన్నారా?
ఈడీ, జీఎస్టీ వంటి కేంద్ర సంస్థలు తప్పు చేశాయని బీజేపీ చెప్పదల్చుకుందా? సమాధానం చెప్పాలి.
ఇన్నాళ్లు మాట్లాడని పవన్ కల్యాణ్ ఈ రోజు ముందుకొచ్చారు. అంటే ఈ స్కాంలో పవన్ కల్యాణ్కు అందుతున్న ప్యాకేజీ ఎంత?’’ అని హోంమంత్రి ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, TDP
లోకేశ్ ఆగ్రహం
యువగళం పాదయాత్రలో బాగంగా ప్రస్తుతం లోకేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ క్యాంపులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియగానే ఆయన విజయవాడ వెళ్లేందుకు బయల్దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు.
ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో నోటీసుల్ని తిరస్కరించారు. దీంతో లోకేశ్ అక్కడే నేలపై కూర్చుని నిరసన చేపట్టారు. పోలీసులకు రాజ్యాంగాన్ని చూపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం తనకు ఎక్కడైనా స్వేచ్చగా తిరిగే హక్కు ఉందని వాదించారు.
తండ్రిని చూసేందుకు బయల్దేరిన కొడుకుని అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, TDP
ఏపీలో పలు చోట్ల ఉద్రిక్తతలు
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్భంధంలోకి తీసుకుంటున్నారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో అధికారులు బస్సులు నిలిపివేస్తున్నారు.
విశాఖలోని ద్వారకా బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు నిలిపివేశారు. విజయవాడలోని పలు కూడళ్లలో పోలీసులను మోహరించారు.

ఫొటో సోర్స్, JANASENA
చంద్రబాబు అరెస్ట్పై ఎవరేమన్నారు?
కావాలని శాంతి భద్రతల చెడగొడుతున్నారు: పవన్ కల్యాణ్
ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంభిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
గతేడాది అక్టోబర్లో విశాఖపట్నంలో జనసేన పట్ల కూడా ఏపీ పోలీసులు ఈ విధంగానే ప్రవర్తించారని ఆయన గుర్తు చేశారు.
‘‘ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలులో పెట్టారు.
నంద్యాలలో చంద్రబాబు నాయుడి అరెస్టు కూడా ఇలాంటిదే. ఆయన అరెస్ట్ను మేం ఖండిస్తున్నాం.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది.
ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకు మద్దతుగా అనుచర వర్గం బయటకు రావడం ప్రజాస్వామ్యంలో మామూలే. వారు అలా బయటకు రావొద్దనడం ఎంతవరకు సమంజసం.
ఇదంతా ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలాగే మేం చూస్తున్నాం.
చంద్రబాబు నాయుడుకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్పై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరీ స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆమె ట్వీట్ చేశారు.
‘‘ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. బీజేపీ దీన్ని ఖండిస్తోంది’’ అని ఆమె రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, UGC
వైకాపా అరాచకాలకు పరాకాష్ట ఈ అరెస్ట్: సీపీఐ నారాయణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు.
శనివారం ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపకుండా పోలీసులు అరెస్ట్ చేయడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోంది. రివర్స్ టెండెరింగ్, రివేంజ్ అనే రెండు రకాల పాలనను వైసీపీ అనుసరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండటం దుర్మార్గం. కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
జగన్ పాలకుడు కాదు కక్షదారుడు: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
చంద్రబాబు అక్రమ అరెస్ట్ దుర్మార్గమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని ఒక పత్రిక ప్రకటనలో బాలకృష్ణ పేర్కొన్నారు.
‘‘జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? ఇది రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర.’’ అని ఆయన అందులో అన్నారు.
‘‘జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం’’ అని బాలకృష్ణ తన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SAJJALA RAMAKRISHNA REDDY
ఇది రాజకీయ కక్ష కాదు: ప్రభుత్వ సలహాదారు సజ్జల
ఈ కేసు రెండేళ్ల కిందటే నమోదైందని, దీన్ని రాజకీయ కక్షపూరిత చర్య అనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
ఇది నిజంగా రాజకీయ కక్షపూరిత చర్య అయితే చంద్రబాబు ఎప్పుడో అరెస్టయ్యేవారని ఆయన అన్నారు. అన్ని రకాలుగా విచారణ జరిపిన తర్వాతనే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారని ఆయన అన్నారు.
‘‘చంద్రబాబు తప్పు కప్పి పుచ్చుకునేందుకు రాజకీయం చేస్తున్నారు. స్కామ్లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 371 కోట్లలో 240 కోట్లు దారి మళ్లినట్లు 2017,18లోనే ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు తన నిజాయతీ నిరూపించుకోవాలి. విచారణ ఎదుర్కోవాలి. చంద్రబాబుపై కేసు బలంగా ఉంది’’ అని సజ్జల అన్నారు.
(ఈ కథనం అప్డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- క్రాబ్ వాక్ చేస్తూ జైలు నుంచి పారిపోయిన ‘డేంజరస్ కిల్లర్’
- చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్హౌస్: ఈ యాప్లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














