తెలంగాణ: మేడిగడ్డ బరాజ్‌కుంగడంతో ఎండిపోతున్న మిడ్ మానేరు ప్రాజెక్ట్... దీని ప్రభావం హైదరాబాద్ తాగునీటిపై పడుతుందా?

మిడ్ మానేరు

ఫొటో సోర్స్, Praveen Shubham

ఫొటో క్యాప్షన్, మిడ్ మానేరులో ప్రస్తుతం 7.02 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

అడుగంటుతున్న నీటి మట్టాలు, తాగు, సాగు నీరుకు ఇక్కట్లు.. ఇలాంటి శీర్షికలతో తెలంగాణలోని మానేరు పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లపై వార్తా కథనాలు ఈ మధ్య కాలంలో తరచూ వస్తున్నాయి.

తాజాగా మిడ్ మానేరు ప్రాజెక్ట్ ( శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్) నీటి నిల్వలు తగ్గడంతో ముంపు గ్రామాలు పైకి తేలాయి.

పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు పెడుతున్న నిర్వాసితుల వీడియోలు, ఫోటోలు మీడియాలో ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది.

కాళేశ్వరం మల్టీ ఫేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మిడ్ మానేరు కీలకంగా భావిస్తారు.

మేడిగడ్డ నుంచి అనేక లిఫ్ట్‌లు, కాలువలు, పంప్ హౌజ్‌ల ద్వారా మిడ్ మానేరుకు గోదావరి నీరు చేరుతుంది. అక్కడి నుంచి ప్రధాన ప్రాజెక్టులైన లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌కు వెళతాయి.

వీటన్నింటికి మిడ్ మానేరు ఆధారం కావడంతో దీన్ని ‘కాళేశ్వరం వాటర్ జంక్షన్’ గా భావిస్తారు.

మిడ్ మానేరు ముంపు గ్రామాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మిడ్ మానేరులో బ్యాక్ వాటర్ తగ్గిపోయి ముంపు గ్రామాలు కనిపిస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మూడు ప్రధానమైన బరాజ్‌లు. వీటి ద్వారానే రివర్స్ పంపింగ్‌తో గోదావరి నీటిని పైకి తరలిస్తున్నారు.

2023 నవంబర్‌లో మేడిగడ్డ బరాజ్ పిల్లర్లలో పగుళ్లు గుర్తించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఎగువన ఉన్న అన్నారం బరాజ్‌లో లీకేజీ సమస్యలు బయటపడ్డాయి. దీంతో ఈ మూడు బరాజ్‌ల నీటిని పూర్తిగా ఖాళీ చేశారు.

మేడిగడ్డ బరాజ్

ఫొటో సోర్స్, X/Revanthreddy

ఫొటో క్యాప్షన్, 2023 నవంబర్‌లో మేడిగడ్డ బరాజ్ పిల్లర్లలో పగుళ్లు గుర్తించారు.

ప్రస్తుతం ఎలాంటి నిల్వ, తరలింపు లేదు. దీంతో మిడ్ మానేరుకు కాళేశ్వరం నీరు ఆగిపోయింది. దీని ప్రభావం మిడ్ మానేరుతో లింక్ అయిన అన్ని రిజర్వాయర్లపై కనిపిస్తోంది.

27.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్ మానేరులో ప్రస్తుతం (ఏప్రిల్ 10 నాటికి ) 7.02 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇదే కారణంగా బ్యాక్ వాటర్ తగ్గిపోయి ముంపు గ్రామాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 5 మధ్య కాలంలో ఈ ప్రాజెక్ట్ నుంచి 10.37 టీఎంసీల నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు ఇతర ప్రాజెక్ట్ లకు తరలించారు.

గతేడాది ఇదే సమయానికి మిడ్ మానేరులో 20.60 టీఎంసీల నిల్వలు ఉన్నాయి.

బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఒక ‘బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’. అంటే, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన నీటిని ఇక్కడ నిల్వ చేసి అవసరం మేరకు మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుంది.

ఇలా తరలించగా ఖాళీ అయిన మేరకు మెయిన్ సోర్స్ ద్వారా తిరిగి దీన్ని నింపుకోవచ్చు. ఇలా అవసరం మేరకు నీరు నిల్వచేయడానికి, తరలించడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పనిచేస్తాయి.

మరోవైపు, భారీ వరదల సమయంలో దిగువ ప్రాంతాలపై ఒత్తిడిని తగ్గించడం, ముంపు ప్రమాదం లేకుండా వరద సక్రమంగా కిందికి సాగిపోవడంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కీలకంగా పనిచేస్తాయి.

మానేరు నది

ఫొటో సోర్స్, Praveenshubham

ఫొటో క్యాప్షన్, మానేరు నది

మానేరు ప్రాజెక్టులు-వరద కాలువ

తెలుగు రాష్ట్రాలకు పెద్ద నీటి వనరైన గోదావరి నదికి మానేరు ఉపనది.

మానేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టి ఆ జిల్లాలోనే గోదావరిలో కలుస్తుంది.

ఒక రకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మానేరు గుండెకాయ. కరీంనగర్ పట్టణం మానేరు ఒడ్డున ఉంది.

మానేరు నదిపై ఎగువ మానేరు (అప్పర్ మానేరు, మధ్య మానేరు (మిడ్ మానేరు), దిగువ మానేరు (లోయర్ మానేరు-ఎల్ఎండీ) .. ఇలా మొత్తం మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

ఈ మిడ్ మానేరు రిజర్వాయర్‌కు మానేరుతో పాటూ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద కాలువ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) ప్రధాన నీటి వనరులు.

సీజన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) మిగులు జలాలను మిడ్ మానేరుకు తరలించి 2 లక్షల ఎకరాలకు అదనపు ఆయకట్టు సృష్టించే ప్రణాళికలో భాగంగా అప్పటి ప్రధానమంత్రి పీవీ. నర్సింహారావు చేతుల మీదుగా వరద కాలువ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది, 2010లో ఈ పనులు పూర్తయ్యాయి. ఈ కాలువ పొడవు 130 కిలోమీటర్లు.

అయితే, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు, చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో నీటి లభ్యత తగ్గిపోయి ఎస్సారెస్పీ నిండటమే గగనం అయింది.

ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చాక, గాయత్రి పంప్ హౌజ్ ద్వారా మిడ్ మానేరుకు నీరందుతోంది.

మిన్ మానేరు

ఫొటో సోర్స్, Praveenshubham

ఫొటో క్యాప్షన్, అన్నారం బరాజ్

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో కీలకపాత్ర

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 13 జిల్లాల పరిధిలో 19 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలన్నది తమ లక్ష్యంగా తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఒక నివేదికలో చెప్పింది. ఈ లక్ష్యం నెరవేర్చడంలో మిడ్ మానేరు ప్రాజెక్ట్‌ది కీలక భూమికగా భావిస్తారు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి తరలించి తెచ్చే నీటిలో సుమారు 100 టీఎంసీల నీరు ఈ రిజర్వాయర్ గుండానే వెళ్లాలి.

పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాలను బట్టి చూస్తే .. లోయర్ మానేరు (24 టీఎంసీ), అన్నపూర్ణ (3.5 టీఎంసీ), రంగనాయకసాగర్ (3 టీఎంసీ) , మల్లన్న సాగర్ (50 టీఎంసీ), కొండపోచమ్మ సాగర్ (15 టీఎంసీ) లకు నీరు మిడ్ మానేరు నుంచే అందాలి.

ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్‌లో 5 టీఎంసీలు, అన్నపూర్ణలో 0.8 టీఎంసీ, రంగనాయక సాగర్‌లో 0.85 టీఎంసీ, మల్లన్న సాగర్ 9.56 టీఎంసీలు (ఏప్రిల్ 10 నాటికి) నీటి నిల్వలున్నాయి.

కాళేశ్వరం (మేడిగడ్డ బరాజ్) ద్వారా 2019-23 వరకు 162 టీఎంసీల గోదావరి జలాలను తరలించారు. మొదటిసారి 2019-20 సీజన్ లో 61 టీఎంసీలు ఎత్తిపోస్తే, ప్రస్తుత సీజన్ (2023-24)లో కేవలం 8.9 టీఎంసీలు మాత్రమే తరలించారు.

ఇదే కాళేశ్వరం నుండి 2019-2023 మధ్య కాలంలో గాయత్రి పంప్ హౌజ్ ద్వారా మిడ్ మానేరు కు అందిన నీరు మొత్తం 180 టీఎంసీలు.

వ్యవసాయ సీజన్ల వారిగా చూస్తే.. 2019-20 లో 66.44 టీఎంసీలు చేరితే, ఈ సీజన్ (2023-24) లో కేవలం 10.34 టీఎంసీలు మాత్రమే కాళేశ్వరం నుంచి పంపింగ్ అయ్యాయి.

తెలంగాణ నీటిపారుదల శాఖ డాక్యుమెంట్

ఫొటో సోర్స్, Telanganairrigation

ఫొటో క్యాప్షన్, కాళేశ్వరంలో ఆయా ప్రాజెక్టుల కింద నీటి సరఫరాపై తెలంగాణ నీటిపారుదల శాఖ డాక్యుమెంట్.

గతేడాది చూస్తే 31.3 టీఎంసీలు నీరు వచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో అక్కడి నుంచి నీరు పంపింగ్ కాకపోవడం దీని వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మిడ్ మానేరుతో ముడిపడి ఉన్న రంగనాయక సాగర్ కింద 1.14 లక్షలు, కొండపోచమ్మ సాగర్ కింద 2.85 లక్షలు, మల్లన్న సాగర్ కింద 8.33 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది నీటి పారుదల శాఖ లక్ష్యం. అదే సందర్భంలో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్ట్ ల గుండా నీటిని ఎస్సారెస్పీ వరకు తరలించాలన్నది ఆ శాఖ మరో ప్రణాళిక.

కాళేశ్వరం, దానితో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్ట్‌లన్నింటి కింద, ముఖ్యంగా అన్ సీజన్‌లో (యాసంగి) కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలు ముడిపడి ఉన్నాయి. అలాగే మార్గమధ్యలో చెరువులు, కుంటలు నింపడానికి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అవసరాలు కూడా తీరాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగి పంటలను కాపాడుకునేందుకు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్ రైతాంగం నుంచి ఉంది. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో రైతులు ఈ విషయంలో ఆందోళనలకు దిగారు.

ఇటీవలె లోయర్ మానేరు కింద పంటల కోసం 3 వేల క్యూసెక్కులు కాకతీయ కెనాల్ ద్వారా వదిలారు. సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి వాగులోకి కొంత నీటిని వదిలారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో గాయత్రి పంప్ హౌజ్ పంప్ లను కొద్ది సమయం నడిపి నీటిని వరద కాలువలోకి వదిలారు.

‘’ ఒక టీఎంసీ నీటితో 24 వేల ఎకరాల్లో ఆరు తడి పంటలు, 11 వేల ఎకరాల వరి పంటకు నీళ్లు అందివ్వవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న నీటిని చెరువులు, కుంటలు నింపడానికి వాడాం. దీంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది’’ అని ఉమ్మడి మెదక్ జిల్లా సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్ ఒకరు బీబీసీతో తెలిపారు.

మిడ్ మానేరు కాలువలు

ఫొటో సోర్స్, Praveenshubham

పూర్తికాని కాలువలు

సాగునీటి పారుదల శాఖలోని వర్గాల ప్రకారం.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయలేదు.

కమాండ్ ఏరియాలో చాలా ప్రాంతాల్లో ఇంకా డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ ఛానల్స్ కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పొలాల వరకు నీటిని తీసుకెళ్లే పిల్ల కాల్వల నిర్మాణంలో భూసేకరణ సమస్యలున్నాయి. దీంతో రిజర్వాయర్లలోకి వచ్చిన నీటిని చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఎక్కువగా వదులుతున్నారు.

కాళేశ్వరం దానితో లింక్ అయిన ప్రాజెక్ట్‌ల ద్వారా మొత్తం 2,143 చెరువులు నింపి, వాటి కింద 1.67 లక్షల ఎకరాల సాగులోకి వచ్చినట్లు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తన రిపోర్టులో తెలిపింది. కాళేశ్వరం కింద 2023-24 సీజన్‌లో మొత్తం 17 లక్షల 8 వేల ఎకరాలు సాగులోకి తేవాలన్నది ఇరిగేషన్ శాఖ ప్రణాళిక.

‘’సాగు నీరంతా పైకి తరలించడానికే సరిపోతోంది. మా ప్రాంతంలో భూములకు గతంలో ఒక సారి ట్రయల్ రన్ చేసి వదిలేశారు. ఇంతవరకు నీరు పూర్తిస్థాయిలో అందలేదు’’ అని మిడ్ మానేరు ఆయకట్టుకు చెందిన రైతు రవి బీబీసీతో అన్నారు.

నీరు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌కు తాగునీరు..

కాళేశ్వరంలో భాగంగా హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం 30 టీఎంసీల నీరు కేటాయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లింక్‌గా డైరెక్ట్ పైప్ లైన్ ఒకటి వేశారు.

సిద్దిపేట జిల్లా పరిధిలో ఈ పైప్ లైన్‌కే మరికొన్ని కనెక్షన్లు ఇచ్చారు. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి నీరు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్‌ల నుంచి రావాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాకాలం సీజన్ వస్తే తప్ప అది సాధ్యపడే పరిస్థితులు లేవు. మరోవైపు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా సుందిల్ల బరాజ్ నుంచి వచ్చే నీరు ఎల్లంపల్లికి చేరడం ఇప్పట్లో సాధ్యపడదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఈ ఊరు విడిచి జనం ఎందుకు వెళ్ళిపోయారంటే..

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)