రూ. 500 సాయం అడిగితే రూ. 55 లక్షలు విరాళాలుగా వచ్చాయి

ఫొటో సోర్స్, GIRIJA HARIKUMAR
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ హిందీ
తన పిల్లల ఆకలి తీర్చేందుకు కాస్త సాయం కావాలంటూ కోరిన కేరళ మహిళకు, సోషల్ మీడియా నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆమెకు విరాళాల రూపంలో లక్షలాది రూపాయలు సాయంగా అందాయి.
46 ఏళ్ల సుభద్ర కేరళలో నివసిస్తున్నారు.
భర్త మరణించడంతో తన బిడ్డల పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమె.. వారి ఆకలి తీర్చేందుకు రూ. 500 సాయంగా కావాలంటూ తన కొడుకు అభిషేక్ చదువుతున్న స్కూల్లో టీచర్ను సాయం కోరారు.
ఆమె పరిస్థితిని చూసిన టీచర్, సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు.
ఆదివారం నాటికి ఆ కుటుంబానికి విరాళాల రూపంలో రూ. 55 లక్షలు అందాయి.
ఆగస్టులో ఆమె భర్త చనిపోయిన తర్వాత నుంచి సుభద్ర చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆమె కుటుంబానికి పూట గడవడమే కష్టంగా మారింది.
తన ముగ్గురు కొడుకుల్లో చిన్న కొడుక్కి సెరిబ్రల్ పాల్సి వ్యాధి ఉండటంతో సుభద్ర ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నారు. చిన్న కొడుకును నిత్యం దగ్గరుండి చూసుకోవాల్సి ఉంది.
శుక్రవారం తన రెండో కొడుకు చదివే స్థానిక పాఠశాల టీచర్ గిరిజ హరికుమార్ వద్దకు సుభద్ర వచ్చారు. తన పిల్లలకు తినేందుకు ఏమీ లేవని, దయచేసి ఏదైనా సాయం చేయాలని కోరారు.
గిరిజ హరికుమార్ ఆ పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేస్తున్నారు.
తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తన విద్యార్థి అభిషేక్ను తాను ఎన్నోసార్లు అడిగినట్టు గిరిజ హరికుమర్ బీబీసీకి చెప్పారు.
కానీ మొట్టమొదటిసారి అభిషేక్ తల్లి తన సాయం కోరారని తెలిపారు. ‘‘నేను రూ. 1000 ఇచ్చాను. ఎలాగైనా సాయం చేస్తానని ఆమెకు చెప్పాను’’ అని టీచర్ చెప్పారు.
ఆ తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లగా వారెంత పేదరికంలో జీవిస్తున్నారో అర్థమైందని చెప్పారు. వంటగదిలో కనీసం నాలుగు గింజలు కూడా లేవని, వారి వద్ద తినడానికి ఏమీ లేవని గిరిజ హరికుమార్ తెలిపారు.
‘‘ఆమెకు నేను ఇచ్చిన డబ్బులతో ఏమీ రాదు. వారి కుటుంబానికి కనీస సాయంగా కూడా అవి ఉపయోగపడవు’’ అని అన్నారు.
అందుకే ఆ కుటుంబ దీనస్థితిని తెలుపుతూ ఫేస్బుక్లో పోస్టు పెట్టినట్టు గిరిజ హరికుమార్ తెలిపారు. తోచినంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
అలాగే ఆ పోస్టులో సుభద్ర బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా జత చేశారు. దీంతో దాతలు అందించే డబ్బు నేరుగా సుభద్ర అకౌంట్లో పడేలా చేశారు.
టీచర్ గిరిజ హరికుమార్ షేర్ చేసిన పోస్టు వైరల్గా మారింది. సోమవారం నాటికి పలువురు గుర్తు తెలియని దాతల నుంచి సుభద్ర అకౌంట్కి రూ. 55 లక్షల విరాళం అందింది.
దాతల నుంచి పొందిన డబ్బులో కొంత మొత్తాన్ని సుభద్ర ఇంటి నిర్మాణానికి ఉపయోగించనున్నారు. ఆమె భర్త చనిపోవడానికి ముందు ఆ ఇంటి నిర్మాణం ప్రారంభించగా.. ఆయన చనిపోవడంతో నిర్మాణం ఆగిపోయింది.
మిగిలిన మొత్తాన్ని ఆ కుటుంబ అవసరాల కోసం బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఫండ్ రైజింగ్ అభ్యర్థనను క్లోజ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- మెస్సీ వరల్డ్ కప్ సాధిస్తే, భారత అభిమానులు సచిన్ను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అవతార్ 2: ‘కథలో పస లేదు, కథనంలో వేగం లేదు, పాత్రల్లో దమ్ము లేదు.. టెర్మినేటర్ బెటర్’ - బీబీసీ రివ్యూ
- ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?
- ఖతార్: కనీసం ఒక్క నది, తాగడానికి నీటి చుక్కలేని ఈ దేశం.. ఫుట్బాల్ పిచ్ల కోసం నీటిని ఎలా సృష్టిస్తోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
















