బతకడం కోసం నడి సముద్రంలో మృత్యువు ముంగిట 11 రోజుల ప్రయాణం, చివరకు ఎలా బయటకు వచ్చారు?

స్పెయిన్

ఫొటో సోర్స్, SALVAMENTO MARÍTIMO DE ESPAÑA

ఫొటో క్యాప్షన్, ఓడ కింది భాగంలో ఉన్న చిన్న ప్రదేశంలో ముగ్గురు కూర్చొని 11 రోజుల పాటు సముద్ర ప్రయాణం చేశారు

పై ఫొటో వలసదారుల పరిస్థితికి అద్దం పడుతుంది. ముగ్గురు వ్యక్తులు, నైజీరియా నుంచి స్పెయిన్ వలస వెళ్లడానికి సముద్రంలో 11 రోజుల పాటు ఆయిల్ ట్యాంకర్ చక్రం మీద కూర్చొని ప్రమాదకర స్థితిలో ఇలా ప్రయాణించారు.

స్పెయిన్ సముద్రతీర రక్షణ శాఖ (మారిటైమ్ రెస్క్యూ) ఈ ఫొటోను విడుదల చేసింది. గ్రాన్ కనారియా ద్వీపంలోని లాస్ పల్మాస్ నౌకాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆ ముగ్గురికి సముద్ర తీర రక్షణ శాఖ సిబ్బంది సహాయం చేశారు.

ఆఫ్రికా మూలాలకు చెందిన ముగ్గురు వలసదారులు నౌక దిగువ భాగంలో ఉన్నట్లు గుర్తించిన తర్వాత వారిని రక్షించినట్లు సాల్వమెంటో, ఈఎఫ్‌ఈ ఏజెన్సీ తెలిపింది.

రెస్క్యూ ఏజెన్సీ తెలిపిన దాని ప్రకారం, నవంబర్ 17న నైజీరియాలోని లాగోస్ నౌకాశ్రయం నుంచి బయల్దేరిన మాల్టా దేశపు జెండాను కలిగిన ‘అలిథిని-2’ ఆయిల్ ట్యాంకర్‌పై వారు ఇలా కూర్చొని ప్రయాణం చేశారు.

ఓడకు బయటివైపు ‘చుక్కాని’ అని పిలిచే ప్రమాదకర ప్రదేశంలో ఈ ముగ్గురు కూర్చొని ఉండటాన్ని గమనించారు. సముద్రపు అలల వల్ల లేదా కాస్త ఏమరపాటుగా ఉన్న వీరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

వలసలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్య సమితి వలసల అంతర్జాతీయ సంస్థ (ఐఓఎం) లెక్కల ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ 2021లో 1,532 మంది మరణించారు

వెంటనే వారిని గ్రాన్ కనారియా ద్వీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు గుర్తించారు.

ప్రయాణం కారణంగా డీహైడ్రేషన్‌కు గురి అయినట్లు తెలిపారు.

స్పానిష్ జర్నలిస్ట్ టీమా సాంటానా, వలసదారుల అంశాల గురించి ఎక్కువగా రాస్తుంటారు.

ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణించిన ఈ వలసదారుల గురించి ఆయన ట్వీట్ చేశారు. ‘‘వారు నైజీరియా నుంచి బయలుదేరి వారంపైనే గడిచింది. వారు కూర్చొన్న ఓడ చుక్కాని సముద్రపు నీటికి అత్యంత సమీపంగా ఉంది. బతుకుదెరువు కోసం వారి సాహసయాత్ర, కాల్పానిక కథలను మించిపోయింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే చివరిసారి కూడా కాబోదు. ఇలాంటి ప్రయాణాలు చేసేవారికి అదృష్టం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు’’ అని ట్వీట్ సాంటానా ట్వీట్ చేశారు.

ఎవరికీ తెలియకుండా ఓడలో ఇలా చుక్కానిపై కూర్చొని ప్రయాణిస్తోన్న వలసదారులను గుర్తించడం ఇదే తొలిసారి కాదని అధికారులు అన్నారు.

వీడియో క్యాప్షన్, 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ.కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు

2020 నవంబర్‌లో కూడా ముగ్గురు వ్యక్తులు ఇలాగే ఓషన్ ప్రిన్సెస్-2 అనే ఓడ చుక్కాని మీద కూర్చొని ప్రయాణించారని తెలిపారు.

‘‘అందులో ఒకరు 14 ఏళ్ల బాలుడు. సముద్రంలోని ఉప్పు నీటిని తాగుతూ యాత్ర ఎలా చేశాడో ఆ బాలుడు మాకు చెప్పాడు. అక్కడే ఉన్న కాస్త ప్రదేశంలో వంతుల వారీగా ఇతరులు కాపు కాస్తుంటే తాము నిద్ర పోయినట్లు ఆ బాలుడు వివరించారు. ఆ విధంగా ప్రయాణించడం అంత కష్టంగా ఉంటుందని తానెప్పుడూ ఊహించలేదు’’ అని ఆ బాలుడు అన్నట్లు అధికారులు వివరించారు.

అదే ఏడాది ఇలాంటిదే మరో ఘటన కూడా జరిగింది. నార్వే ఆయిల్ ట్యాంకర్ ‘చాంపియన్ పులా’ ఓడ చుక్కానిపై కూర్చొని నలుగురు వ్యక్తులు లాగోస్ నుంచి లాస్ పల్మాస్‌కు ప్రయాణించారు.

చుక్కాని వెనుక ఉన్న ఒక గదిలో దాక్కొని పది రోజుల పాటు వారంతా సముద్రంలో ప్రయాణించినట్లు అప్పటి నివేదికలు తెలిపాయి.

ఇటీవలి సంవత్సరాల్లో పశ్చిమ ఆఫ్రికా నుంచి కానరీ ద్వీపాలకు పడవల ద్వారా వెళ్లే వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇలా వీరు చేసే ప్రయాణాలు సుదీర్ఘంగా సాగుతాయి. అవి చాలా ప్రమాదాలతో కూడి కఠినంగా ఉంటాయి. ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ 2021లో 1,532 మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి వలసల అంతర్జాతీయ సంస్థ (ఐఓఎం) వెల్లడించింది.

వీడియో క్యాప్షన్, సైకిల్ పై తండ్రిని 1200 కిలోమీట‌ర్ల దూరంలోని సొంతూరికి తీసుకెళ్లిన 13 ఏళ్ల‌ బాలిక

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)