మొబైల్ ఫోన్ రేడియేషన్ నుంచి ఈ స్టిక్కర్లు రక్షణ కల్పిస్తాయా? యాంటీ రేడియేషన్ నిజమేనా?

క్వాంటమ్ పెండెంట్

ఫొటో సోర్స్, RIVM

5జీ మొబైల్ నెట్‌వర్కుల నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పుకుంటున్న నెక్లెస్‌లు, ఇతర ఉపకరణాల్లో రేడియోధార్మికత ఉన్నట్లు తేలింది.

ఈ మేరకు నెదర్లాండ్‌కు చెందిన న్యూక్లియర్ సేఫ్టీ అండ్ రేడియేషన్ ప్రొటెక్షన్ - ఏఎన్‌వీఎస్ ఒక హెచ్చరిక జారీ చేసింది.

10 ప్రొడక్టుల్లో ఇలాంటి హానికారక రేడియేషన్ ఉన్నట్లు స్పష్టం చేసింది. అలాంటి ఉత్పత్తులను ఉపయోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వీటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే హాని జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

5జీ నెట్‌వర్కులు ఆరోగ్యానికి హానికరమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఎన్‌వీఎస్ తేల్చి చెప్పింది.

5జీ మొబైల్ నెట్‌వర్కులు సురక్షితమని, వాటికి, ప్రస్తుతం వాడుతున్న 3జీ, 4జీ సిగ్నల్స్‌కు ప్రాథమికంగా పెద్దగా తేడా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

రేడియేషన్

మొబైల్ నెట్‌వర్కులు 'నాన్ ఆయానైజింగ్ రేడియో వేవ్స్‌'ను ఉపయోగించుకుంటాయి. డీఎన్‌ఏకు అవి హాని కలిగించవు.

అయినప్పటికీ ట్రాన్స్‌మిటర్లతో ప్రమాదం ఉందంటూ కొందరు తరచూ ఆరోపణలు చేస్తున్నారు.

రేడియోధార్మికత ఉన్నట్లు ఏఎన్‌వీఎస్ గుర్తించిన వాటిలో ఎనర్జీ ఆర్మోర్, స్లీపింగ్ మాస్క్, బ్రాస్లెట్, నెక్లెస్‌లు ఉన్నాయి.

చిన్నారుల కోసం మాగ్నటిక్స్ బ్రాండ్ తీసుకొచ్చిన వెల్‌నెస్‌ బ్రాస్లెట్‌ నుంచి కూడా రేడియేషన్ వెలువడుతోందని తేలింది.

"ఎట్టిపరిస్థితుల్లో వాటిని పెట్టుకోకండి. ఎలా తిరిగిచ్చేయాలో చెప్పే వరకు వాటిని ఒక సురక్షితమైన ప్రాంతంలో పెట్టండి" అని ఏఎన్‌వీఎస్ ఒక ప్రకటనలో కోరింది.

వీటి అమ్మకాలను వెంటనే ఆపేయాలని, ఈ విషయాన్ని కస్టమర్లకు తక్షణం తెలియజేయాలని నెదర్లాండ్‌లో వీటిని విక్రయిస్తున్న సంస్థలకు ఏఎన్‌వీఎస్ సూచించింది.

5జీకి వ్యతిరేకంగా తెరపైకి వచ్చిన కుట్ర సిద్ధాంతాలు యాంటీ 5జీ పరికరాలకు మంచి మార్కెట్‌ను సృష్టించాయి. నిజానికి ఆ పరికరాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేలింది.

5జీ నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పుకున్న ఒక యూఎస్‌బీ స్టిక్‌ విక్రయాలను 'బ్రిటన్ ట్రేడింగ్ స్టాండర్డ్స్' 2020 మేలో నిలిపేసింది. ఈ యూఎస్‌బీ స్టిక్ ధర సుమారు 35వేల రూపాయలు.

బ్రేస్లెట్

ఫొటో సోర్స్, RIVM

యాంటీ రేడియేషన్ నిజమేనా?

ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రాల (electromagnetic fields-EMF) నుంచి తమ స్టిక్కర్లు రక్షణ కల్పిస్తాయని కొన్ని కంపెనీలు చెప్పుకుంటున్నాయి.

విద్యుదయస్కాంత క్షేత్రాలు హానికరమని, వాటి నుంచి తమ స్టిక్కర్లు రక్షణ కల్పిస్తాయని గ్లోబల్ ఈఎంఎఫ్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

వీటిని యాంటీ రేడియేషన్ స్టిక్కర్లుగా పిలుస్తున్నారు. అమెజాన్‌లో కూడా వీటిని విక్రయిస్తున్నారు.

రేడియేషన్ నుంచి తమ స్టిక్కర్లు రక్షణ కల్పిస్తాయని పలు కంపెనీలు చెప్పుకోవడంపై బ్రిటన్‌ అడ్వటైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఏఎస్ఏ) గతంలో తీవ్ర అభ్యంతరం తెలిపింది.

వైర్‌లెస్ పరికరాల నుంచి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రాల నుంచి స్మార్ట్‌డాట్ స్టిక్కర్లు రక్షణ కల్పిస్తాయని చెప్పడానికి వీల్లేదని ఏఎస్ఏ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది.

బీబీసీ పరిశోధనలో భాగంగా గతంలో యూనివర్శిటీ ఆఫ్ సర్రేలో ఒక అధ్యయనం చేపట్టారు. 4జీ మొబైల్ ఫోన్లు, వైఫై పరికరాలకు స్మార్ట్‌డాట్ స్టిక్కర్లు అంటించి, అంటించకుండా పరీక్షించారు.

ఈ అధ్యయనంలో ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్‌ల ప్రభావానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఈ అధ్యయనంలో లభించలేదు. అయితే, ఆ ప్రభావాన్ని తెలుసుకోవడానికి జీవసంబంధమైన పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఎనర్జీ డాట్స్‌ పేర్కొంది.

మొబైల్ ఫోన్ రేడియేషన్ నుంచి రక్షిస్తాయని చెప్పుకుంటున్న స్టిక్కర్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)