అమెరికా: ఆపరేషన్ తర్వాత గాలిని ఇంజెక్ట్ చేసి నలుగురిని చంపేశాడు

హత్య

ఫొటో సోర్స్, Getty Images

టెక్సాస్‌లో నర్సుగా పనిచేసే 37ఏళ్ల విలియం డేవిస్.. నలుగురు పేషెంట్లను హత్య చేసినట్లు రుజువైంది. ఈ నలుగురికి గుండె శస్త్రచికిత్స అనంతరం గాలిని ఇంజెక్ట్ చేసి డేవిస్ హత్య చేశాడు.

డేవిస్‌ను కోర్టు మంగళవారం దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి మరణశిక్ష పడే అవకాశం ఉంది.

2017 జూన్ నుంచి 2018 జనవరి వరకు ఏడుగురిని డేవిస్ లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు కోర్టులో చెప్పారు.

"జ్యూరీ తీర్పు బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతుంది"అని ఈ ఘటనలు జరిగిన క్రిస్టస్ మదర్ ఫ్రాన్సిస్ హాస్పిటల్ తెలిపింది.

47 నుంచి 74ఏళ్ల మధ్య వయస్సున్న నలుగురు బాధితుల్లో హఠాత్తుగా మూర్ఛ రావడం లాంటి లక్షణాలు గుర్తించారు. వారి నరాల్లోకి గాలిని ఇంజెక్ట్ చేయడం వలన మెదడు దెబ్బతింది.

ఆపరేషన్ల నుంచి బాగా కోలుకుంటున్న నలుగురు పేషెంట్ల పరిస్థితి ఒక్కసారిగా ఎలా క్షీణించిందో డాక్టర్లకు అంతుచిక్కలేదు.

సీటీ స్కాన్‌లో పేషెంట్ల మెదడులో గాలిని చూసిన తర్వాత మాత్రమే వైద్యులు ఏదో తప్పు జరిగిందని గుర్తించారు.

డాలస్‌కు చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ విలియం యార్‌బ్రో జ్యూరీతో మాట్లాడుతూ, తన దశాబ్దాల వైద్య వృత్తిలో ఇలాంటి కేసును ఎన్నడూ చూడలేదన్నారు.

విచారణ సమయంలో ఓ పేషెంట్‌ గదిలోకి డేవిస్ ప్రవేశించిన ఫుటేజీని ప్లే చేశారు. ఆ సమయంలో పేషెంట్‌ గుండె మానిటర్ అలారం కేవలం మూడు నిమిషాలు మాత్రమే వినిపించింది. తర్వాత గాలిని ఇంజెక్ట్‌ చేయడంతో సదరు పేషెంట్ మరణించారు.

పేషెంట్లు డేవిస్‌ చర్య వల్లే చనిపోయారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని విచారణ సమయంలో ఆయన తరఫు న్యాయవాది ఫిలిప్ హేస్ వాదించారు. తీవ్రమైన విధానపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఆసుపత్రి డేవిస్‌ను బలిపశువును చేస్తోందన్నారు.

డేవిస్‌కు మరణశిక్ష వేయాలని ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు. ‘‘డేవిస్‌ ప్రజలను చంపాలనుకున్నాడు. వారి హత్యలతో పైశాచిక ఆనందాన్ని పొందాడు’’అని వారు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)