ఇరీడియం: దీని ధర బంగారం, ప్లాటినం, బిట్‌కాయిన్‌ల కంటే ఎక్కువగా పెరిగింది.. ఈ అరుదైన లోహాన్ని ఎందులో వాడతారు?

ఇరీడియం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2021లో ఇరీడియం ధర 131శాతం పెరిగింది.

ఇరీడియం.

ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా.

అవును. మహేశ్‌బాబు నటించిన ఖలేజా సినిమా కథ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది.

ఆ సినిమాలో విలన్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్ ఇరీడియం కోసం ఒక గ్రామాన్నే తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తారు.

ఇప్పుడు ఇరీడియం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

దానికి కారణం దాని ధర.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇరీడియం ధర 131 శాతం పెరిగింది. బిట్‌కాయిన్ ధర పెరుగుదల (దాదాపు 120శాతం) కంటే ఇది ఎక్కువ.

ఒక ఔన్స్ ఇరీడియం ధర దాదాపు 4 లక్షల 40 వేలు రూపాయలు.

ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాములు.

ఈ లెక్కన చూస్తే ఒక గ్రాము ఇరీడియం ధర 15,520 రూపాయలు.

ఏప్రిల్ 5న గ్రాము బంగారం ధర 4450 రూపాయలు ఉండగా, ప్లాటినం ధర ఒక గ్రాము దాదాపు 3800 రూపాయలుగా ఉంది.

అంటే బంగారం, ప్లాటినం కంటే ఇరీడియం ధర మూడింతల కంటే ఎక్కువ.

ఇరీడియం

ఫొటో సోర్స్, CREATIVE COMMONS

ఇరీడియం ఎందులో వాడతారు

విమానం ఇంజన్లు, కారు కాటలిస్టులు, నీటి లోపల వేసే పైపుల తయారీకి ఇది అత్యంత అవసరం.

స్పార్క్ ప్లగ్గులు, మెడికల్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా దీన్ని వాడతారు.

చివరికి గడియారాలు, దిక్సూచిల్లో కూడా స్వల్ప మోతాదులో ఇరీడియం ఉపయోగిస్తారు.

ఎందుకింత ధర

ఇది పెద్దగా తుప్పు పట్టదు.

ఎంత వేడినైనా తట్టుకుంటుంది.

ఇది అత్యంత అరుదుగా దొరుకుతుంది. పైగా దీనికి డిమాండ్ ఎక్కువ.

ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే పరికరాల్లో దీని వినియోగం పెరగడం ఇరీడియం ధర పెరుగుదలకు కారణమని హెరాయస్ గ్రూప్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

ఇరీడియం

ఫొటో సోర్స్, Getty Images

గ్రీన్ ఫ్యాక్టర్

ప్లాటినం, పల్లాడియం మైనింగ్‌లో ఇది ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.

సరఫరా తక్కువగా ఉండటంతో ఇదిప్పుడు మరింత విలువైన లోహంగా మారింది.

శిలాజ ఇంధనాల స్థానంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి హైడ్రోజన్‌ కీలకంగా మారుతోంది.

హైడ్రోజన్‌ తయారీకి ఇరీడియం వాడకం పెరిగే అవకాశం ఉందని, అంటే డిమాండ్‌తో పాటు ధరలు కూడా ఇంకా పెరగొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.

ప్లాటినం గ్రూప్‌కు చెందిన ఇతర లోహాల ధరలు కూడా పెరుగుతున్నాయి.

అంటే రోడియం, పల్లాడియం లభ్యత కొరతగా ఉండటంతో వాటి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

ఆంగ్లో-అమెరికన్ ప్లాటినమ్.. దక్షిణాఫ్రికాలో నిర్వహించే ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ 2020లో చాలాకాలం మూతపడింది. అదే సమయంలో డిమాండ్ పెరిగింది. కానీ దానికి తగ్గట్టుగా సరఫరా లేదు. దాంతో ధర పెరిగింది.

గనులు

ఫొటో సోర్స్, Getty Images

80 నుంచి 85 శాతం దక్షిణాఫ్రికా నుంచే..

ప్రపంచ ఇరీడియం ఉత్పత్తిలో 80 నుంచి 85 శాతం దక్షిణాఫ్రికా నుంచే వస్తుంది.

ఇరీడియాన్ని సాధారణంగా స్పార్క్ ప్లగ్గుల్లో ఎక్కువగా వాడుతుంటారు.

కానీ ఇతర పరిశ్రమల్లో కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.

ఇది చాలా చిన్న మార్కెట్. అందుకే ఇరీడియం సరఫరాలో ఏ చిన్న అంతరాయం కలిగిన దానిధరపై చాలాపెద్ద ప్రభావం కనిపిస్తుంది.

కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇరీడియం కొంటూ, అమ్ముతూ ఉంటాయి.

ఇరీడియం

ఫొటో సోర్స్, Getty Images

ఉల్కల్లో పుష్కలంగా దొరుకుతుంది

ఇరీడియం వెండిలా తెల్లగా.. కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది.

దీన్ని గ్రహాంతర లోహంగా భావిస్తారు.

ఎందుకంటే ఉల్కల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.

భూమిపై ఉపరితలంలో ఇది దొరకడం చాలా అరుదు.

ఇరీడియాన్ని 1803లో కనిపెట్టారు.

సహజ ప్లాటినం ముడి లోహంలో దీన్ని గుర్తించారు.

ఇది భూమిపై అత్యంత అరుదుగా లభించే లోహం.

గనులు

ఫొటో సోర్స్, Getty Images

ఏడాదికి మూడు టన్నులే

సంవత్సరానికి దాదాపు మూడు టన్నుల ఇరీడియం మాత్రమే వెలికితీస్తారు.

ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సింథటిక్ క్రిస్టల్స్ పెరగడానికి ఉష్ణోగ్రతను నిరోధించే క్రూసిబుల్స్‌ వాడతారు.

వాటిలో ఇరీడియాన్ని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా అత్యంత అవసరం.

ఇక డిమాండ్ పరంగా చూస్తే గతేడాది ఎలక్ట్రిసిటీ రంగం నుంచి 31శాతం, ఎలక్ట్రో కెమికల్ రంగం నుంచి 26శాతం, ఆటోమోటివ్ రంగం నుంచి 13శాతం, మిగిలింది ఇతర పరిశ్రమల నుంచి వచ్చిందని ఎస్అండ్‌పీ గ్లోబల్ అనే కన్సల్టింగ్ సంస్థ చెబుతోంది.

5జీ స్మార్టు ఫోన్ల అభివృద్ధి, OLED తెరలుండే పరికరాల తయారీతో ఇరీడియానికి డిమాండ్ మరింత పెరగొచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)