పల్లేడియం: బంగారం కంటే ఖరీదైన ఈ లోహం ధర ఎందుకు పెరుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images
పల్లేడియం ఒక విలువైన లోహం. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది.
గత రెండు వారాల్లోనే పల్లేడియం ధర 25 శాతానికి పైగా పెరగింది. దీంతో గత ఏడాది సమయంలో దీని ధర దాదాపు రెట్టింపు అయ్యింది.
ఇది ప్రస్తుతం బంగారం కంటే ఖరీదైన లోహం అయిపోయింది. పల్లేడియం ధర ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం ఒక ఔన్స్(28 గ్రాములు) పల్లేడియం ధర దాదాపు 2500 డాలర్లు(లక్షా 78 వేలకు పైనే).
అంటే, 10 గ్రాముల బంగారం ధర భారత్లో రూ.41,175 ఉంటే, అదే పది గ్రాముల పల్లేడియం ధర రూ.63,500కు పైనే ఉంటుంది.


కానీ పల్లేడియం అంటే ఏంటి? ఈ లోహాన్ని దేనికి ఉపయోగిస్తారు? దీని ధరలు ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి?
పల్లేడియం మెరిసే ఒక తెల్లటి లోహం. ప్లాటినం, రుథేనియం, రోడియం, ఓస్మియం, ఇరిడియమ్ గ్రూపుల్లో ఇది భాగం కూడా.
రష్యా, దక్షిణాఫ్రికాలో పల్లేడియం భారీ స్థాయిలో లభిస్తుంది. దీనిని ప్లాటినం, నికెల్కు ఒక బై ప్రొడక్ట్లా తీస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు ఉపయోగిస్తారు?
పల్లేడియంను పెట్రోల్, హైబ్రీడ్ వాహనాల ఎగ్జాస్ట్ కోసం ఉపయోగించే కాటలిస్ట్ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ లాంటి విష వాయువులను నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, లాంటి తక్కువ హానికరమైన వాయువులుగా మార్చడానికి 80 శాతం పల్లేడియంను ఉపయోగిస్తున్నారు.
అంతేకాదు, పల్లేడియం లోహాన్ని విద్యుత్ పరికరాల్లో, దంత చికిత్సలో, ఆభరణాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
పల్లేడియం ధర అంతకంతకూ పెరుగుతుండడంతో ఈ లోహం దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాటలిస్ట్ కన్వర్టర్ల దొంగతనానికి ఈ లోహం ఒక పెద్ద కారణంగా మారింది.
లండన్ పోలీసుల వివరాల ప్రకారం 2019లో ఆరు నెలల్లో నమోదైన కాటలిస్ట్ కన్వర్టర్ దొంగతనం కేసులు గత ఏడాదితో పోలిస్తే 70 శాతం పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
దీని ధర ఎందుకు పెరుగుతోంది?
పల్లేడియం ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడం వల్ల దీని ధర విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న పల్లేడియంలో 40 శాతం దక్షిణాఫ్రికా నుంచి ఉత్పత్తి అవుతోంది.
దక్షిణాఫ్రికాలో గత కొన్ని రోజులుగా పల్లేడియం సహా ప్లాటినం గ్రూప్ లోహాల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే నవంబర్లో 13.5 శాతం తగ్గింది.
రకరకాల కారణాలతో పారిశ్రామికంగా కూడా పల్లేడియం డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
వాయు కాలుష్యం తగ్గించేందుకు...
చైనా సహా చాలా దేశాలు వాయు కాలుష్యం సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయి. దానికోసం పెట్రోల్ వాహనాలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
పల్లేడియం ధర పెరగడానికి యూరప్లో డీజిల్ కార్ల గురించి మొదలైన వివాదం కూడా ఒక కారణమే.
యూరప్లో వినియోగదారులు డీజిల్ కార్లకు దూరం అవుతున్నారు. వాటిలో ఎక్కువ ప్లాటినం ఉపయోగిస్తారు. అందుకే వాటికి బదులు జనం అక్కడ పెట్రోల్ కార్లు కొంటున్నారు. ఈ కార్లలో ఎక్కువగా పల్లేడియం ఉపయోగిస్తున్నారు.
గత నెలలో అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం వల్ల కూడా పల్లేడియం ధరలు పెరిగాయి.
ప్రపంచ ఆర్థికవ్యవస్థపై పడిన ఒత్తిడి తగ్గడానికి ఈ ఒప్పందం వల్ల మద్దతు లభిస్తుందని, దీనివల్ల చైనా కార్ల అమ్మకాలు మెరుగుపడతాయని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం కొనాలా.. అమ్మాలా? ధర ఎందుకు పెరుగుతోంది?
- బంగారు నగలకు 'హాల్మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- ఒక్క బంగారు నాణెం కోసం మీరెన్ని మిరపకాయలు తినగలరు?
- ఊబర్ 'ఈట్స్'.. జొమాటోకు విక్రయం
- ట్విన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్: ఒకేచోట చేరిన 14 వేల కవలలు
- తన లైంగిక ఆనందం కోసం మహిళలను కరెంటు షాక్ పెట్టుకొనేలా చేసిన నకిలీ వైద్యుడు
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









