ఉగాండా: క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్కులో ముక్కలై కనిపించిన ఆరు సింహాలు: Newsreel

ఉగాండాలో సింహాలకు చెట్లు ఎక్కే సామర్థ్యం కూడా ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉగాండాలోని సింహాలు చెట్లు ఎక్కగలుగుతాయి

ఉగాండాలోని క్వీన్ ఎలిజబెట్ నేషనల్ పార్కులో ఆరు సింహాలు చనిపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. వాటి శరీరాలు ముక్కలు ముక్కలుగా పడిఉన్నాయి. ఆ సింహాలపై ఎవరో విషప్రయోగం చేసి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

క్వీన్ ఎలిజబెత్ జాతీయ అభయారణ్యంలో నిర్జీవంగా కనిపించిన ఈ సింహాలకు తలలు, పంజాలు నరికేసి ఉన్నాయి.

వాటి కళేబరాల పక్కనే చనిపోయిన రాబందులు కూడా కనిపించాయని అధికారులు చెప్పారు.

సింహాల మాంసం తిన్న రాబందులు చనిపోవడంతో వీటికి విషం పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు వన్యప్రాణులను అక్రమంగా తరలించే స్మగ్లర్లే కారణం అయ్యుండవచ్చని ఉగాండా వైల్డ్ లైఫ్ అథారిటీ అధికారులు చెప్పారు.

జంతు సంరక్షకులు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో కలిసి సింహాల మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.

అభయారణ్యంలోని ఈ సింహాలకు చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం కూడా ఉంది.

ఆరు సింహాలు చనిపోవడం తనకు చాలా బాధ కలిగిందని యూడబ్ల్యుఏ కమ్యూనికేషన్స్ మేనేజర్ బషీర్ హంగీ ఒక ప్రకటనలో చెప్పారు.

"ఉగాండా ఆర్థికవ్యవస్థలో నేచర్ టూరిజం ఒక ముఖ్యమైన భాగం. జీడీపీలో అది 10 శాతం ఉంటుంది. దేశంలో జంతు పరిరక్షణకు ఇది కీలకం అవుతోంది" అని ఆయన చెప్పారు.

క్వీన్ ఎలిజబెత్ పార్కులో సింహాలకు విషం పెట్టి చంపిన ఘటనలు ఇంతకు ముందు కూడా చాలాసార్లు జరిగాయి.

2018 ఏప్రిల్లో 8 కూనల సహా 11 సింహాలు చనిపోయి కనిపించాయి. వీటికి కూడా విషం పెట్టారని అనుమానించారు.

2010లో కూడా ఇలాంటి ఘటనలో ఐదు సింహాలు చనిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)