కరోనావైరస్: చైనాలో 80 మంది మృతి... విదేశాలకు విస్తరిస్తున్న భయం

మాస్కులు ధరించిన చైనా పోలీసు అధికారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాస్కులు ధరించిన చైనా పోలీసు అధికారులు. ఇన్‌ఫెక్షన్ లక్షణాలు బయటపడక ముందే కరోనావైరస్ ఇతరులకు సోకగలదని చైనా అధికార యంత్రాంగం చెబుతోంది.

కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనావైరస్‌ వల్ల చైనాలో చనిపోయిన వారి సంఖ్య 80కి పెరిగింది. వైరస్ బారిన పడినట్లు నిర్ధరణ అయినవారి సంఖ్య మూడు వేలను సమీపించింది.

ఒక్క హుబేయ్ రాష్ట్రంలోనే కరోనావైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 56 నుంచి 76కు పెరిగిందని ఆరోగ్య విభాగ అధికారులు సోమవారం చెప్పారు. మిగతా నలుగురు వేరే ప్రాంతాల వారు.

మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు లేదా ఇప్పటికే శ్వాసకోశ సమస్యలున్నవారు.

గీత
News image
గీత

హుబేయ్‌లో వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ, చికిత్స కార్యక్రమాల్లో ఐదు లక్షల మందికి పైగా వైద్య సిబ్బంది పాలుపంచుకొంటున్నారు.

చైనాలో వైరస్ సోకినట్లు నిర్ధరణ అయినవారి సంఖ్య 2,744కు చేరిందని, వీరిలో 300 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

ఈ వైరస్ తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. దీనికి నిర్దిష్టమైన టీకాగాని, దీనిని నయం చేసేందుకు నిర్దిష్టమైన చికిత్సగాని లేవు. దీన్ని నిరోధించాలంటే ఇన్‌ఫెక్షన్ సోకినవారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడటమే మార్గం.

వుహాన్‌ నగరంలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్
ఫొటో క్యాప్షన్, వుహాన్‌ నగరంలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ఆయా దేశాల అధికారుల సమాచారం ప్రకారం చైనా వెలుపల థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో మొత్తం 41 కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ వల్ల చైనా వెలుపల ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు. చైనా వెలుపలి బాధితుల్లో దాదాపు అందరూ ఇటీవల వుహాన్‌కు వెళ్లి వచ్చినవారే.

ఏ దేశంలో ఎన్ని కేసులు?

ఎనిమిది: థాయ్‌లాండ్

ఐదు: అమెరికా

నాలుగు: సింగపూర్, ఆస్ట్రేలియా, తైవాన్, మలేషియా

మూడు: ఫ్రాన్స్, జపాన్

రెండు: దక్షిణ కొరియా, వియత్నాం

ఒకటి: నేపాల్, కెనడా

చైనాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, చైనాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

చైనాలో పరిస్థితి ఎలా ఉంది?

వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా చైనా కొత్త సంవత్సర సెలవులను పాలనా యంత్రాంగం మరో మూడు రోజులు అంటే ఆదివారం వరకు పొడిగించింది.

వైరస్ తొలుత బయటపడిన హుబేయ్ రాష్ట్రంలోని వుహాన్, మరికొన్ని నగరాల్లో ప్రయాణ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాకపోకలు నిలిపేశారు. వుహాన్‌లో అత్యవసర సేవల వాహనాలను తప్ప ఇతర వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు.

ఈ రాష్ట్రంలో కనీసం రెండు వేల పడకలతో రెండు తాత్కాలిక ఆస్ప్రతులను నిర్మిస్తున్నారు. కర్మాగారాల్లో మాస్కుల ఉత్పత్తిని, వైరస్ నుంచి రక్షణ కోసం ధరించే దుస్తుల ఉత్పత్తిని పెంచారు.

ఇంక్యుబేషన్ సమయంలో వైరస్ వ్యాప్తి చెందగలదని గత వారాంతంలో చైనా అధికారులు హెచ్చరించారు. మనుషుల్లో ఇంక్యుబేషన్ సమయంలో ఈ వైరస్ వల్ల వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయటపడవు. ఈ వ్యవధి ఒక్క రోజు నుంచి 14 రోజుల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

చైనాలో వ్యాపిస్తున్న వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రస్తుతానికి నావెల్ కరోనా వైరస్(2019-ఎన్‌సీవోవీ) అని వ్యవహరిస్తోంది.

ఈ కొత్త వైరస్ కరోనావైరస్‌ల కుటుంబానికి చెందినది. గతంలో ఈ వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ బాధితుల్లో 9 శాతం మంది, మెర్స్ బాధితుల్లో ఇంచుమించు 35 శాతం మంది చనిపోయారు.

లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ వైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో ఉండటంతో దీనికా పేరు పెట్టారు. ఈ వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు, ఇది గబ్బిలాల్లో కనిపించే కరోనావైరస్, పాములో ఉన్న వైరస్‌తో కలసి కొత్తగా పుట్టిందని పరిశోధకులు గుర్తించారు.

వీడియో క్యాప్షన్, చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)