#100WOMEN: కృత్రిమ గర్భసంచితో నెలలు నిండని శిశువులకు ప్రాణదానం

నెదర్లాండ్స్కు చెందిన కొందరు వైద్యులు కృత్రిమ గర్భసంచిని రూపొందించే పనిలో ఉన్నారు. నెలలు నిండడానికి చాలా సమయం ఉంటుండగానే జన్మించే శిశువుల ప్రాణాలు కాపాడేందుకు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఇది ప్రస్తుతం ఇలాంటి శిశువుల కోసం వాడుతున్న ఇంక్యుబేటర్ల కంటే పూర్తిగా భిన్నమైనది.
37 వారాల గర్భస్థ దశ కంటే ముందే జన్మించే శిశువుల మరణాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి.
మరో పదేళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు చెబుతుండగా, ఈ వైద్య సాంకేతికతను దుర్వినియోగం చేసే ఆస్కారమూ ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి అనంతరం బయట ప్రపంచంలోకి రావాల్సిన బిడ్డ నెలలు నిండక ముందే జన్మిస్తే, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడడం వైద్యులకు సవాలే.
ఇలాంటి శిశువుల కోసమే నెదర్లాండ్స్కు చెందిన డిజైనర్ లీసా మేడ్మేకర్, కొందరు వైద్యులు కలిసి కృత్రిమ గర్భసంచిలను అభివృద్ధి చేస్తున్నారు. ఇవి అచ్చంగా తల్లి గర్భాన్నే పోలి ఉంటాయి.

ఇంక్యుబేటర్కు, కృత్రిమ గర్భసంచికి తేడా ఏమిటి?
ఇంక్యుబేటర్లో గాలి ఉంటుంది. కృత్రిమ గర్భసంచిలో ద్రవాలుంటాయి.
అవి కూడా శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్కడుండే ద్రవాల్లానే ఉంటాయి.
ఇంక్యుబేటర్లో గాలి ఉండడం వల్ల శిశువు తల్లి గర్భంలో కదిలినట్లు కదలలేదు, పైగా ఈ గాలి ఊపిరితిత్తుల్లో సమస్య కలిగించొచ్చని వైద్యులు చెబుతున్నారు.

కృత్రిమ గర్భసంచి ఎలా పనిచేస్తుంది?
ఇందులో అయిదు బెలూన్లు ఉంటాయి. వీటిలోకి అవసరమైన ద్రవాలు పంపిస్తారు. అందులో శిశువు తల్లి గర్భంలో కదిలినట్ల కదులుతుంది.
కృత్రిమ గర్భసంచిని కృత్రిమ మాయ(ప్లాసెంటా)తో అనుసంధానిస్తారు.
కృత్రిమ గర్భసంచిలో నీరు, ఖనిజ ద్రవాలు ఉండడం వల్ల శిశువు పూర్తిగా తల్లి గర్భంలో ఉన్నట్లే ఉంటుంది.
అంతేకాదు, తల్లి గర్భంలో శిశువుకు ఆక్సిజన్, పోషకాలు బొడ్డుతాడు ద్వారా అందినట్లే ఇందులోనూ కృత్రిమ బొడ్డు తాడు ద్వారా అందుతాయి.

ఎన్ని రోజులు ఉంచాలి?
నెలలు నిండకుండా జన్మించిన శిశువును కృత్రిమ గర్భసంచిలో 4 వారాల పాట ఉంచిన తరువాత బయటకు తీయాలి.
ఆ 4 వారాల సమయంలో శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటిలాగే పోషకాలు అందుకుంటూ పూర్తిస్థాయిలో ఎదుగుతుంది.
దీనివల్ల ఆ శిశువు ప్రాణాలకు ప్రమాదం తప్పుతుంది.

దుష్ప్రభావాలుంటాయా?
ఈ విధానంలో మంచిచెడ్డలు ఇంకా పూర్తిగా తెలియవని ఈ పరిశోధనల్లో భాగస్వామి అయిన డాక్టర్ గైడ్ ఓయీ అంటున్నారు.
కృత్రిమ గర్భసంచిలో ఉన్న సమయంలో కానీ, దీర్ఘకాలికంగా కానీ దీని వల్ల శిశువుపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇంకా పూర్తిగా తెలియదంటున్నారాయన.
తమ ప్రయోగాలు పూర్తి కావడానికి ఇంకో అయిదేళ్లు పడుతుందని.. ఆ తరువాత మానవ శిశువులను ఇందులో ఉంచి పరీక్షిస్తామని ఆయన చెబుతున్నారు.

దుష్పరిణామాలకూ అవకాశం
ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది శిశువులు నెలలు నిండకుండా జన్మిస్తుండగా వారిలో సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అలాంటి వారి కోసం రూపొందిస్తున్న ఈ కృత్రిమ గర్భసంచుల పద్ధతిని దుర్వినియోగం చేసే ఆస్కారముందన్న వాదనా ఒకటి ఉంది.
గర్భిణులు తమ సౌకర్యం కోసం వైద్యుల సహాయంతో ముందుగానే శిశువుకు జన్మనిచ్చి కృత్రిమ గర్భసంచుల్లో ఉంచినా ఉంచొచ్చని అది సహజ పద్ధతిలో బయట ప్రపంచంలోకి రావాల్సిన శిశువులకు కూడా ఇలాంటి అవసరం కల్పిస్తుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- మధ్యాహ్న భోజన పథకం: దక్షిణ భారత్లో అమలవుతోంది, ఉత్తరాదిలో ఎందుకు కావడం లేదు
- భూమిలో మూడు అడుగుల లోతులో పాతిపెట్టారు.. బతికి బయటపడ్డ చిన్నారి
- 'మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి' అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








