ఒక యువతి ఆత్మాహుతి, ఇరాన్ దిగివచ్చేలా చేసింది

ఫొటో సోర్స్, EURONEWS
క్రీడా మైదానాల్లోకి మహిళలు ప్రవేశించడం నిషిద్ధం అనే ఇరాన్ చట్టం గురించి సహర్కు తెలుసు. అయినా, ఆమె ఫుట్బాల్ మ్యాచ్ చూడాలని అనుకున్నారు.
సహర్కు ఉన్న ఈ సీదాసాదా కోరికను ప్రపంచంలోని చాలా మంది మహిళలు చాలా సులభంగా తీర్చుకుంటున్నారు. ఇదే ఏడాది మార్చిలో సహర్కు ఇష్టమైన టీమ్ మైదానంలోకి దిగింది. దాంతో ఎలాగైనా ఆ మ్యాచ్ చూడాలని ఆమె పురుషుల దుస్తులు వేసుకుంది. బ్లూ విగ్ పెట్టుకుని, పొడవాటి ఓవర్ కోట్ వేసుకుంది.
తర్వాత టెహ్రాన్లోని ఆజాద్ స్టేడియంవైపు బయల్దేరింది. కానీ స్టేడియం లోపలికి వెళ్లేలోపే ఆమెను భద్రతాదళాలు అరెస్టు చేశాయి. నేరం చేశావంటూ కోర్టు సహర్కు సమన్లు పంపించింది. దాంతో ఆమె కోర్టు హౌస్ బయట తనకు తాను నిప్పుపెట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ రెండు వారాల తర్వాత ఆస్పత్రిలో మృతిచెందింది.
సహర్ మృతి తర్వాత సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర ఉద్యమం నడిచింది. స్టేడియంలోకి మహిళలు ప్రవేశించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఇరాన్పై ఒత్తిడి పెరిగింది. ఈ ఉద్యమంలో ఇరాన్లోని చాలా మంది మహిళలు భాగమయ్యారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచారు.
దాంతో ఇరాన్ దిగివచ్చింది. త్వరలో కంబోడియాతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి 3500 మంది మహిళా అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తామని మాట ఇచ్చింది.
ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అక్టోబర్ 10న టెహ్రాన్ ఆజాదీ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి ఇరాన్ మహిళలను అనుమతిస్తామని ఫిఫాకు మాట ఇచ్చినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఇరనా అక్టోబర్ 4న ధ్రువీకరించింది.

ఫొటో సోర్స్, AFP
గంటలోనే అమ్ముడైపోయిన టికెట్లు
మహిళలకు టికెట్లు అమ్మడానికి మొదట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇరనా వార్తా సంస్థ కథనం ప్రకారం గంటలోపే ఆ టిక్కెట్లన్నీ అమ్ముడైపోయాయి. 2022లో వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆ స్టేడియంలో మహిళలు కూర్చునేందుకు సీట్ల సంఖ్య కూడా పెంచుతున్నారు.
ఇరనా సమాచారం ప్రకారం మహిళలు కూర్చొనేందుకు ఆ స్టేడియంలో మూడు అదనపు వరుసలు ఏర్పాటు చేశారు. ఈ సీట్ల టిక్కెట్లు అప్పటికప్పుడే అమ్ముడయ్యాయి. అంటే కనీసం 3500 మంది మహిళలు స్టేడియంలో మ్యాచ్ చూడ్డానికి వస్తారు.
మహిళల కోసం మొత్తం 4600 టికెట్లు అందుబాటులో ఉంచుతున్నామని, డిమాండ్ అంతకంటే ఎక్కువే ఉండచ్చని ఫిఫా అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ఈ స్టేడియంలో లక్ష మంది కూర్చోవచ్చు. ఇటు ఫిఫా కూడా తమ పర్యవేక్షకులను టెహ్రాన్ పంపిస్తామని, మహిళలను మ్యాచ్ చూసేందుకు అనుమతించారా లేదో తెలుసుకుంటామని చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ద బ్లూ గర్ల్
ఇరాన్కు చెందిన 29 ఏళ్ల ఫుట్బాల్ అభిమాని సహర్ ఖోడయారీ ఆత్మాహుతికి పాల్పడింది. సహర్ను స్టేడియంలోకి వెళ్లడానికి ముందే అరెస్టు చేశారు. సహర్ మృతి తర్వాత మహిళలు స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్ చూసేందుకు అనుమతించాలని ఇరాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీవ్రమైంది.
సహర్ను అందరూ ముద్దుగా 'ద బ్లూ గర్ల్' అంటారు. ఆమె ఫేవరెట్ టీమ్ 'ఎస్టేగ్లల్ ఫుట్బాల్ క్లబ్'. దాని కలర్ బ్లూ. అందుకే సహర్ను అందరూ బ్లూ గర్ల్ అని పిలిచేవారు. సహర్ గత నెల ఒంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె శరీరం 90 శాతం కాలిపోయింది.
సంప్రదాయ షియా ముస్లిం దేశమైన ఇరాన్లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత స్టేడియంలో మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది. "పురుషులు ఉన్న వాతావరణాన్ని, అరకొరగా బట్టలేసుకున్న పురుషులను" మహిళలు చూడకూడదనే అలా చేశామని ఇస్లామిక్ మత పెద్దలు వాదిస్తున్నారు.
ఇరాన్ సమాజంలో 'ఆధునిక విలువలు' తీసుకొస్తానని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూహానీ మాట ఇచ్చారు. కానీ ఆయన దానిని చేయడంలో దాదాపు విఫలం అయ్యారు. ఇరాన్లో మహిళలు ఇప్పటికీ దయనీయ పరిస్థితుల్లో దేశంలో రెండో తరగతి పౌరులుగా జీవిస్తున్నారు.
"ఎక్కడ మహిళల తలరాతలు పురుషులు నిర్ణయిస్తారో, వారి ప్రాథమిక హక్కులను అణచివేస్తారో.. అక్కడి మహిళలు పురుషుల నిరంకుశత్వంలో భాగం అవుతారు. అక్కడ అమ్మాయిలు కాలి బూడిదైపోవడానికి మనందరం బాధ్యులమే" అని సంస్కరణవాది అయిన ఇరాన్ ఎంపీ పరవానేహ్ సలాహ్ షౌరీ ట్విటర్లో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అరెస్టు తర్వాత విసిగిపోయారు
సహర్ మృతి తర్వాత ఇరాన్లో మహిళల హక్కులపై పోరాడే కార్యకర్తలు చాలా యాక్టివ్ అయ్యారు. పహ్లావీ వంశ పాలన అయినా, ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారంలోకి వచ్చినా, గత 8 దశాబ్దాలుగా ఇరాన్ మహిళలు వివక్షాపూరిత చట్టాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు.
అరెస్టు తర్వాత సహర్ విసిగిపోయారు. తర్వాత ఆమె బెయిల్పై విడుదలయ్యారు. హిజాబ్ (బురఖా) వేసుకోకపోవడంతో బహిరంగ మర్యాద ఉల్లంఘించారని, భద్రతాదళాలను అవమానించారని ఆమెపై ఆరోపణలు చేశారు.
సహర్కు సెప్టెంబర్ 2న కోర్టు సమన్లు పంపించారు. అందులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడవచ్చని చెప్పారు.
"ఆమె వాటన్నిటితో విసిగిపోయారు. తనకు తాను నిప్పు పెట్టుకున్నారు" అని ఇరాన్ రోకనా న్యూస్తో మాట్లాడిన సహర్ సోదరి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్ణయం మాకే వదిలిపెట్టండి
ఓపెన్ స్టేడియం మూవ్మెంట్ కోసం ఇరాన్ మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సహర్ మృతిపై అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఫిఫాలో చలనం వచ్చింది. ఫిఫా చైర్మన్ జియానీ ఇన్ఫెటినో "మా వైఖరి సుస్పష్టం. మహిళలను స్టేడియంలోకి వెళ్లడానికి అనుమతించాలి" అని చెప్పారు.
సీఐఐ వరల్డ్ ఫ్యాక్ట్బుక్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇరాన్లోని 8 కోట్ల మంది జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ఇరాన్లో టెక్నాలజీ పరంగా ఫేస్బుక్, ట్విటర్లపై నిషేధం ఉంది. కానీ ఎక్కువ మంది యువత నిషేధాన్ని పట్టించుకోకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగిస్తున్నారు.
వాషింగ్టన్ పోస్ట్ ఫ్రీడం హౌస్ 2018 స్టడీ ప్రకారం ఇరాన్లో 60 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఈ ఉద్యమం వేగంగా వ్యాపించింది.
1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో మహిళలపై ఎన్నో ఆక్షలు విధించారు. కానీ ఈసారి ప్రభుత్వం మెడ వంచాల్సి వచ్చింది. అయతుల్లా రుహోల్లాహ్ ఖుమైనీ పాలనలో మహిళలు జుట్టును కప్పి ఉంచాలని చెప్పారు. మహిళలకు తలాక్ ఫైల్ చేసే అధికారం కూడా వెనక్కు తీసుకున్నారు. మహిళలు బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడాన్ని కూడా నిషేధించారు.
మద్యం, సంగీతంపై కూడా ఇరాన్లో నిషేధం ఉంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం బట్టలు వేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకునే హక్కును తమకే వదిలిపెట్టాలని ఇప్పుడు అక్కడి మహిళలు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ!
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- జోసెఫ్ స్టాలిన్: హిట్లర్నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, నియంత కూడా
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- 'పాకిస్తాన్ నుంచి ఎవరైనా కశ్మీర్కు వెళ్ళి జిహాద్ చేస్తే కశ్మీరీలే నష్టపోతారు' - ఇమ్రాన్ ఖాన్
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- భారత్లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షుల మాయం
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- గోదావరిలో మునిగిన బోటు బయటకు వస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








