నైజీరియా: అది ఇస్లామిక్ పాఠశాల కాదు... చిత్ర హింసల కారాగారం

బందీలైన వారిలో ఐదేళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Nigerian Police

ఫొటో క్యాప్షన్, బందీలైన వారిలో ఐదేళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు.

నైజీరియాలోని కడునా నగరంలోని ఒక భవనంలో బందీలుగా ఉన్న దాదాపు 500 మంది పురుషులు, బాలురకు పోలీసులు విముక్తి కల్పించారు.

బందీలుగా ఉన్న వారిని లైంగిక వేధింపులకు గురిచేసి హింసించారని వారు చెప్పారు.

ఇస్లామిక్ పాఠశాలగా చెబుతున్న ఒక భవనంలో అయిదేళ్ల చిన్నారులను సైతం గొలుసులతో బంధించారని అధికారులు వివరించారు..

గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా భవనంపై దాడి చేసినట్లు కడునా పోలీసు అధికారి అలీ జంగా బీబీసీకి తెలిపారు.

ఆయన ఈ భవనాన్ని చిత్రహింసల గృహంగా, బానిసత్వ ప్రదేశంగా అభివర్ణించాడు.

శారీరకంగా, మానసికంగా హింసకు గురైన బందీలు

ఫొటో సోర్స్, Nigerian Police

ఫొటో క్యాప్షన్, శారీరకంగా, మానసికంగా హింసకు గురైన బందీలు

ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

బందీలలో కొందరు తీవ్ర గాయాలతో ఉన్నారని, మరికొందరి ఆకలితో అలమటించిపోతున్నారని పోలీసు అధికారి తెలిపారు.

భవనంలోని వారు తమను లైంగిక వేధింపులకు గురి చేశారని, తిండిపెట్టకుండా శారీరంగా హింసించారని బాధితులు చెప్పారు.

''ఇక్కడ నేను మూడు నెలల నుంచి కాళ్లకు గొలుసులతో గడిపాను'' అని బెల్ హమ్జా అనే బందీ నైజీరియా మీడియాకు చెప్పారు.

ఈ భవనం వెలుపల 'అహ్మద్ బిన్ హన్బాల్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ టీచింగ్స్' అనే బోర్డు కనిపించింది.

ఫొటో సోర్స్, Nigerian Police

ఫొటో క్యాప్షన్, ఈ భవనం వెలుపల ‘దారు ఇమామ్ అహ్మద్ బిన్ హన్బాల్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ టీచింగ్స్’ అనే బోర్డు కనిపించింది.

ఈ భవనం ఒక మదర్సా అనుకొని తమ బంధువులు ఇక్కడికి తీసుకొచ్చారని కొందరు పిల్లలు పోలీసులకు చెప్పారు.

విముక్తి పొందినవారిలో ఎక్కువమంది ఉత్తర నైజీరియాకు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో మదర్సాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కొన్నింటిపై ఆరోపణలు వస్తున్నాయి.

విముక్తి పొందిన పిల్లలను ఒక శిబిరంలో ఉంచినట్లు స్థానిక అధికారి హఫ్సత్ ముహమ్మద్ బాబా బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)