బల్దేవ్ కుమార్: ‘పాకిస్తాన్లో మైనార్టీలకు రక్షణ లేదు.. భారత్లో ఉంటా.. ఆశ్రయం ఇవ్వండి’ - ఇమ్రాన్ ఖాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థన

ఫొటో సోర్స్, ANI/Getty Images
- రచయిత, షుమైలా జాఫ్రీ, రఫాతుల్లా ఒరాక్జాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాకిస్తాన్ అధికార పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడు బల్దేవ్ కుమార్ తనకు రాజకీయ పునరావాసం కల్పించాలని భారత్ను అభ్యర్థించారు.
తన కుమార్తెకు వైద్యం చేయించేందుకు గాను ఆయన ఆగస్టు 13వ తేదీన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి వచ్చారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తరఫున ఆయన గతంలో ఖైబర్ పక్తుంఖ్వా అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు.
తన నిర్ణయం గురించి బల్దేవ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు. పాకిస్తాన్లో మైనార్టీలకు భద్రత లేదని, మతపరంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు.
పాకిస్తాన్కు తిరిగి వెళ్లాలని తాను కోరుకోవడం లేదని, అందుకే రాజకీయ ఆశ్రయం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరానని ఆయన వివరించారు.
‘‘మైనార్టీలే కాదు, ముస్లింలకు కూడా పాకిస్తాన్లో రక్షణ లేదు. చాలా ఇబ్బందుల మధ్య అక్కడ బతుకుతున్నాం. నేను వెనక్కి వెళ్లను. భారత్ ఆశ్రయం ఇవ్వాలి’’ అని బల్దేవ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బల్దేవ్ సోదరుడు తాలిక్ కుమార్ ఖైబర్ పక్తుంఖ్వాలోని స్వాత్లో కౌన్సిలర్గా ఉన్నారు. ఆయనతోనూ బీబీసీ మాట్లాడింది.
బల్దేవ్ రాజకీయ పునరావాసం కోసం భారత్ను అభ్యర్థించినట్లు తాను మీడియా ద్వారానే తెలుసుకున్నానని తాలిక్ బీబీసీతో అన్నారు.
బల్దేవ్ కుమార్తె తలసేమియా వ్యాధితో బాధపడుతోందని, ఆమెకు వైద్య చికిత్స చేయించేందుకు భార్య, పిల్లలతో సహా ఆయన భారత్కు వెళ్లారని తాలిక్ చెప్పారు.
బల్దేవ్ సొంత పట్టణాన్ని వదులుకోవాలని పొరుగు దేశంలో పునరావసం కోరుకోవడం తనకు బాధ కలిగించిందని తాలిక్ అన్నారు.
''మా మొత్తం కుటుంబం పాకిస్తాన్లోనే ఉంటుంది. ఇదే మా దేశం. బల్దేవ్ కూడా ఇక్కడే పుట్టాడు. మాకు ఎప్పుడూ ఏ సమస్యా లేదు. బల్దేవ్ నిర్ణయం గురించి విని మా అన్న తీవ్రంగా బాధపడ్డారు'' అని తాలిక్ వివరించారు.
బల్దేవ్ కుమార్ను గతంలోనే సస్పెండ్ చేశామని, ఆయన తమ పార్టీలో సభ్యుడిగా లేరని ఖైబర్ పక్తుంఖ్వా సమాచారశాఖ మంత్రి, పీటీఐ నాయకుడు షౌకత్ యూసుఫ్జాయ్ తెలిపారు.
తమ పార్టీ మైనార్టీ నాయకుడు సోరన్ సింగ్ హత్య వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు బల్దేవ్పై ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
2016లో సోరన్ సింగ్ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి నమోదైన కేసులో బల్దేవ్ సహా ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు.
వారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. 'యాంటీ-టెర్రరిజం కోర్టు' ఈ కేసు విచారణను చేపట్టింది.
రెండేళ్ల తర్వాత బల్దేవ్ కుమార్కు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టు ఆయన్ను విడుదల చేసింది.
పీటీఐ మైనార్టీ నాయకుల్లో సోరన్ సింగ్ తర్వాత స్థానంలో బల్దేవ్ కుమార్ ఉండేవారు. సోరన్ హత్య తర్వాత ఖైబర్ పక్తుంఖ్వా అసెంబ్లీ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
కానీ, పీటీఐ బల్దేవ్కు మద్దతుగా నిలవలేదు. పార్లమెంటులో ఆయన ప్రమాణ స్వీకారన్ని అడ్డుకుంది. దీంతో, బల్దేవ్ కోర్టును ఆశ్రయించి ప్రమాణ స్వీకారం కోసం అనుమతి తెచ్చుకున్నారు.
అయితే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే అసెంబ్లీ పదవీకాలం తీరిపోయింది. దీంతో ఎమ్మెల్యే పదవిలో ఆయన పూర్తిగా ఒక రోజైనా ఉండలేకపోయారు.
బల్దేవ్ తల్లి, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులంతా స్వాత్లోని బారి కోట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయన భార్య భారతీయురాలు.
బల్దేవ్పై హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని సోరన్ సింగ్ అల్లుడు అజయ్ శరణ్ సింగ్ బీబీసీతో చెప్పారు.
హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి విదేశీ వీసా ఎలా వచ్చిందంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
''సోరన్ సింగ్ హత్య తర్వాత పార్టీ బల్దేవ్ను పక్కనపెట్టింది. అందుకే, ఆయన ప్రమాణ స్వీకారాన్ని పార్టీ చాలా సార్లు అడ్డుకుంది. ఆయన్ను విశ్వసించే ముందు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి'' అని పీటీఐ నాయకుడు ఉమర్ చీమా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించిన 10 మంది శ్రీలంక క్రికెటర్లు
- అక్కడ వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. వజ్రాలు వర్షంలా కురుస్తాయి
- ఎన్ఆర్సీ: పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న అసోం చిన్నారులు
- ‘ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు’.. బరువు 130 కేజీలు.. వారానికి ఏడు కోళ్లు తింటాడు.. ఐదు రోజులు జిమ్లోనే ఉంటాడు
- న్యాయవాదికి బేడీలు వేసిన ఈ పాకిస్తానీ మహిళా కానిస్టేబుల్ వీడియో ఎందుకు వైరల్గా మారింది
- ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- 'గాజులు పంపించమంటారా' అని పాకిస్తాన్ రెచ్చగొడుతోంది: అజిత్ డోభాల్
- వేలిముద్రలను సర్జరీతో మార్చవచ్చా.. పోలీసులనే ఆశ్చర్యపరిచిన వాస్తవాలు
- చంద్రయాన్-2: సొంత మంత్రినే తిట్టిపోస్తున్న పాకిస్తానీలు
- కమలాతాల్: "ఒక్క రూపాయికే ఇడ్లీ.. నేను చనిపోయే దాకా అమ్ముతా.. ఎప్పటికీ ధర పెంచను"
- పాకిస్తాన్: హిందూ సమాజాన్ని 'కించపరిచిన' మంత్రిపై వేటు
- 'పాకిస్తాన్లో ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్, మత మార్పిడి, పెళ్లి'
- పాకిస్తాన్లో మార్పు వస్తుందా?
- పాకిస్తాన్ సెనెటర్గా ఎన్నికైన హిందూ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









