పాకిస్తాన్: ఇద్దరు హిందూ బాలికల కిడ్నాప్, మత మార్పిడి, పెళ్లి, పాక్లో మైనారిటీ హిందువుల ఆందోళనలు

పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి వారి మతాన్ని కూడా మార్చిన ఉదంతంలో ఆ దేశ మైనారిటీలైన హిందువులు ఆగ్రహంగా ఉన్నారు.
రోడ్లపై ప్రదర్శనలు నిర్వహిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలంటూ పాకిస్తాన్లోని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.
హోలీకి ఒక రోజు ముందు సింధ్ ప్రాంతంలోని ఘోట్కి జిల్లాలో ఇద్దరు టీనేజీ మైనర్ బాలికలను కొందరు అపహరించారు. ఆ తరువాత వారి మతాన్ని మార్చి పెళ్లి జరిపించి, వాళ్లని కొట్టిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ వీడియోలో నిజమెంత అనేది బీబీసీకి ఇంకా తెలియలేదు.
కానీ ఈ విషయం మీడియాలో వెలుగు చూసిన వెంటనే భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్తాన్ హై కమిషన్ నుంచి వివరణ అడిగారు.
అయితే పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి మాత్రం ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని, మైనారిటీలను హింసించడానికి ఇది మోదీ పాలనలోని భారత్ కాదని విమర్శించారు.
''సుష్మాస్వరాజ్ గారు ఇతర దేశాలలో మైనారిటీలపై జరుగుతున్న అరాచకాలను ఖండించాలనుకోవడం అభినందనీయం. కానీ వారి దేశం నుంచే ఇది మొదలుపెడితే ఇంకా మంచిది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలలోని మైనారిటీలపై జరుగుతున్న అణిచివేతలను ఆపి వారి సంక్షేమం కోసం పని చేస్తే బాగుంటుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇతర దేశాలలోని మైనారిటీల సంక్షేమంపై సుష్మా స్వరాజ్ గారు చూపిస్తున్న శ్రద్ధను వారి దేశంలోని మైనారిటీలపై కూడా చూపిస్తే మంచిది. కానీ భారత్లో మైనారిటీల పట్ల వ్యవహారం దారుణంగా ఉంది. అక్కడ ముస్లింల పట్ల, క్రైస్తవుల పట్ల, ఆఖరికి బౌద్ధుల పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి వారు మాకు ఈ విషయంలో పాఠాలు నేర్పించక్కర్లేదు'' అని ఫవాద్ పేర్కొన్నారు.
''అణిచివేత, హింస లాంటి ఘటనలు అని చోట్లా ఉంటాయి. అయితే ప్రభుత్వం ఎటువైపు ఉందనేది ముఖ్యం. భారత ప్రధానితో పోల్చితే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరి వైపు ఉన్నారన్నదే ముఖ్యం. భారత్, పాకిస్తాన్ల మధ్య తేడా అదే. పాకిస్తాన్ ప్రధానమంత్రి, ప్రభుత్వం బాధిత బాలికలకు తోడుగా ఉన్నాయి. కానీ భారత్లో మాత్రం అణిచివేసే వారి వైపే ప్రభుత్వం ఉంటుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల పై సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. ''నేను రిపోర్ట్ మాత్రమే అడిగాను...దానికే పాకిస్తాన్ మంత్రి కంగారు పడిపోతున్నారు. దీని బట్టి పాకిస్తాన్ చవకబారు ప్రవర్తన అర్థమవుతోంది'' అని సుష్మా అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటన పై విచారణకు ఆదేశించారు.
ఇటువంటి సంఘటనలు జరగడం పాకిస్తాన్లో ఇదే మొదటి సారి కాదు. అసలెందుకు పాకిస్తాన్లోని మైనారిటీలపై ఇటువంటి అరాచకాలు పదేపదే జరుగుతున్నాయి.
ఇవే అంశాలపై పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ మెహదీ హాసన్ బీబీసీతో మాట్లాడారు.
''పాకిస్తాన్కు సంబంధించినంత వరకు ప్రభుత్వాధికారులు ఇటువంటి విషయాలలో ప్రకటనలు మాత్రం బాగానే చేస్తారు. ఈ అంశంపై ప్రధాని కూడా స్పందించారు. అయితే కేవలం స్పందించినంత మాత్రం సరిపోదు, ఇటువంటి విషయాలలో సరైన చర్యలు చేపట్టాలి'' అని ఆయన పేర్కొన్నారు.

''బాలికలను బలవంతంగా మత మార్పిడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. అంతేకాదు సరైన చర్యలు చేపట్టినట్లు ప్రజలకు అర్థమవ్వాలి'' అని చెప్పారు.
''మేం ఈ విషయాల మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు పంపిస్తున్నాం. మా కంప్లైంట్ సెల్ దీనికి సంబంధించి ఫిర్యాదును కూడా పంపిస్తుంది. అంతేకాదు ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా మేం నిశితంగా గమనిస్తాం'' అని మెహదీ హాసన్ వివరించారు.
''దేశంలో రాజకీయాలకు మతాన్ని ఉపయోగించుకోని సెక్యూలర్ పార్టీలు రెండు మూడే ఉన్నాయి. మేం ఆ పార్టీలను కూడా ఈ అంశంపై తగువిధంగా స్పందించమని కోరతాం'' అని తెలిపారు.

బీబీసీ కరాచీ ప్రతినిధి రియాజ్ సోహైల్ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల మంత్రి హరి రామ్ కిశోరీలాల్తో మాట్లాడారు.
''కొంత మందిని అరెస్ట్ చేశాం. కానీ అందులో కొంత గందరగోళం ఉంది. ఈ అమ్మాయిలు కాన్పూర్, కఠోరా వెళ్లారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు’’ అని ఆయన చెప్పారు.
‘‘నిఖా చేసిన మౌలానా సహా కొంత మందిని అరెస్ట్ చేసినట్లు మా వద్ద నివేదికలు ఉన్నాయి. కానీ అమ్మాయిలు దొరికిన తర్వాత, బాధ్యులైన అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది'' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









