హాంకాంగ్లో ప్రజాందోళన: హింసాత్మకంగా మారిన నిరసన ప్రదర్శనలు... భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు

ఫొటో సోర్స్, Reuters
హాంకాంగ్లో నిందితులను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు రబ్బర్ బులెట్లు, భాష్పవాయుగోళాలు ప్రయోగించారు.
'చైనాకు నిందితుల అప్పగింత' బిల్లును నిరసిస్తూ హాంగ్ కాంగ్ ప్రజలు కొంత కాలంగా భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు వరకూ ఈ నిరసనలు శాంతియుతంగానే కొనసాగాయి.

ఫొటో సోర్స్, Reuters
కానీ, ముసాయిదా బిల్లును హాంకాంగ్ శాసన మండలి (లెజిస్లేటవ్ కౌన్సిల్) బుధవారం రెండోసారి చర్చించాల్సి ఉండటంతో.. ఆందోళనకారులు మళ్లీ భారీ ప్రదర్శన చేపట్టారు.

ఫొటో సోర్స్, AFP
ప్రభుత్వ భవనాల చుట్టూ రోడ్లను వేలాది మంది నిరసనకారులు దిగ్బంధించారు. వాటిలోకి అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు ప్రవేశించకుండా అడ్డకునేందుకు ప్రయత్నించారు. బందోబస్తుగా ఉన్న పోలీసుల మీదకు ఇటుకలు, ఇతర వస్తువులు విసిరివేశారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రభుత్వ భవనాల్లోకి చొచ్చుకుపోయేందుకు ఆందోళనకారులు ప్రయత్నించటంతో వారిని చెదరగొట్టటానికి పోలీసులు భాష్పవాయుగోళాలు, రబ్బర్ బులెట్లు ప్రయోగించారు.

ఫొటో సోర్స్, Reuters
నిరసనకారులు ట్రాఫిక్ కోన్లు, చేతికి అందిన ఇతర వస్తువులు పోలీసులపైకి విసురుతూ ఎదురు తిరిగారు. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 22 మంది ప్రజలు గాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
శాసనమండలి భవనంలో ఉన్న బీబీసీ ప్రతినిధి గాబ్రియెల్ గేట్హౌస్.. ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి కూడా గాయపడ్డారని, ఆయనను ఆస్పత్రికి తరలించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
శాసనమండలి భవనంలోకి ఆందోళనకారులు చొరబడకుండా పూర్తిగా మూసివేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఆందోళనకారులు సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్లలో తలదాచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
మరోవైపు.. ఈ బిల్లును ఆమోదించి తీరుతామని ప్రభుత్వం ఉద్ఘాటించింది. ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం జూన్ 20వ తేదీన బిల్లును తుదిగా ఆమోదించి చట్టం చేయాల్సి ఉంది.

అయితే, నిరసనల నేపథ్యంలో బుధవారం జరగాల్సిన రెండో విడత చర్చను శాసనమండలి వాయిదా వేసింది. బుధవారం నాటి సమావేశం రద్దయిందని శాసన మండలి ఒక ప్రకటనలో తెలిపింది. రెండో విడత చర్చ ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Getty Images
హింసాత్మకంగా మారటాన్ని హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ ల్యామ్ ఒక వీడియో సందేశంలో ఖండించారు.
ఇదిలావుంటే, నిందితుల అప్పగింత బిల్లుకు చైనా తన మద్దతును పునరుద్ఘాటించింది.

హాంగ్ కాంగ్లో తీవ్ర నిరసనల నేపథ్యంలో చైనా నుంచి భద్రతా బలగాలను అక్కడికి పంపుతున్నారన్న వార్తలు ''నకిలీ వార్తల''ని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గెంగ్ షాంగ్ మీడియాతో మాట్లాడుతూ ఖండించారు.
అవి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించటానికి పుట్టించిన వదంతులని అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకీ నిరసనలు?
హాంకాంగ్ నుండి 'నేరస్థులు, నిందితుల'ను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది.
అయితే.. ప్రతిపాదిత సవరణలతో హాంగ్ కాంగ్ నగరం నేరస్తులకు సురక్షిత ఆశ్రయంగా ఉండబోదని వాదిస్తోంది. కానీ.. ఈ ప్రతిపాదిత చట్టాన్ని చైనాలో తీవ్ర లోపభూయిష్టమైన పోలీసు, న్యాయ వ్యవస్థ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల హాంగ్ కాంగ్ న్యాయ వ్వవస్థ స్వాతంత్ర్యం ఇంకా తరిగిపోతుందని చెప్తున్నారు.
ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కానీ హాంగ్ కాంగ్ నాయకురాలు క్యారీ ల్యామ్ ఆ ముసాయిదాను నిలిపివేయటానికి నిరాకరించారు. చట్టానికి సవరణలను ఆమోదించటానికి సంసిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ మార్పులు?
హాంకాంగ్లో హత్య, అత్యాచారం వంటి నేరాల్లో అనుమానితులను తమకు అప్పగించాల్సిందిగా చైనా, తైవాన్, మకావు అధికారులు కోరటానికి ప్రతిపాదిత మార్పులు అవకాశం కల్పిస్తాయి.
ఈ విజ్ఞప్తులను హాంకాంగ్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఇలా నిందితులు, అనుమానితులను అప్పగించాలన్న విజ్ఙాపనలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం హాంకాంగ్ కోర్టులకే ఉంటుందని చెప్తున్నారు.
అలాగే, రాజకీయ నేరాలు, మతపరమైన నేరాలలో నిందితులను అప్పగించబోమని కూడా హాంకాంగ్ అధికారులు పేర్కొన్నారు.
వ్యాపారవేత్తల నుంచి వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో.. పన్ను ఎగవేత వంటి పలు వాణిజ్య నేరాలను ఈ అప్పగింత నేరాల జాబితా నుంచి తొలగించారు.
ఈ ప్రతిపాదిత చట్టం మీద ప్రజల ఆందోళనల నేపథ్యంలో వారికి భరోసా కల్పించటానికి హాంగ్ కాంగ్ ప్రభుత్వం ప్రయత్నించింది.
కనీసం ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం గల నేరాల్లో పరారీలో ఉన్న నిందితులను మాత్రమే చైనాకు అప్పగిస్తామని హామీ ఇవ్వటం వంటి మినహాయింపులు చేరుస్తామని హామీ ఇస్తోంది.

ఫొటో సోర్స్, AFP
ఈ చట్టం ఎందుకు వివాదాస్పదం?
కొత్త చట్టం ఫలితంగా.. చైనా చట్ట వ్యవస్థ కింద అనుమానితుల పేరుతో ప్రజలను ఏకపక్షంగా నిర్బంధించటం, అన్యాయంగా విచారించటం, హింసకు గురిచేయటం జరుగుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
''మెయిన్ల్యాండ్ చైనాకు సంబంధించి హాంగ్ కాంగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఈ ప్రతిపాదన ప్రమాదంలోకి నెడుతుంది. ఉద్యమకారులు, మానవ హక్కుల న్యాయవాదులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు.. ఏ ఒక్కరికీ భద్రత ఉండదు'' అని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి సోఫీ రిచర్డ్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చైనా నాయకులను విమర్శించే పుస్తకాలను విక్రయించినందుకు 2015లో తనను అపహరించి చైనాలో నిర్బంధించారని.. 'చట్టవ్యతిరేకంగా బుక్స్టోర్ నిర్వహిస్తున్నా'నని తనపై అభియోగం మోపారని.. హాంగ్ కాంగ్ పుస్తక విక్రేత లామ్ వింగ్ కీ చెప్పారు.
''నేను చైనా వెళ్లకపోతే.. హాంకాంగ్ అధికారులే నన్ను అప్పగిస్తారు. ఈ ప్రభుత్వం నా భద్రతకు కానీ, హాంకాంగ్ నివాసి అయిన ఏ ఒక్కరి భద్రతకు కానీ భరోసా ఇస్తుందన్న నమ్మకం నాకు లేదు'' అని ఆయన పేర్కొన్నారు.
ల్యామ్ గత ఏప్రిల్ చివర్లో హాంగ్ కాంగ్ నుంచి పారిపోయి తైవాన్లో తలదాచుకుంటున్నారు. అక్కడ ఆయనకు తాత్కాలిక నివాస వీసా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రతిపాదిత చట్టాన్ని వ్యతిరేకిస్తున్నది ఎవరు?
ఈ చట్టానికి ప్రజల్లో చాలా విస్తృతంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమాజంలోని అన్ని వర్గాలు, బృందాల వారు - న్యాయవాదులు మొదలుకుని స్కూళ్లు, ఇళ్లలో ఉండే మహిళల వరకూ - తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మార్పులను వ్యతిరేకిస్తూ దరఖాస్తులు సమర్పించారు.
ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనలో పది లక్షల మంది పాల్గొన్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, అత్యధికంగా 2.40 లక్షల మంది మాత్రమే నిరసనలో పాల్గొన్నారని పోలీసులు చెప్తున్నారు.
నిరసన ప్రదర్శన నిర్వాహకుల అంచనా వాస్తవమైతే.. ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉన్న హాంకాంగ్ను 1997లో చైనాకు అప్పగించినపుడు జరిగిన ప్రదర్శన తర్వాత.. ఇదే అత్యంత భారీ ప్రదర్శన అవుతుంది.
ప్రతిపాదిత చట్టాన్ని పక్కనపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల మొదట్లో 3,000 మంది న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, విద్యావేత్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు.

ఫొటో సోర్స్, ANTHONY KWAN
అంతర్జాతీయంగానూ ఆందోళన
హాంకాంగ్ ప్రతిపాదిత చట్టం మీద అంతర్జాతీయంగా కూడా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
హాంకాంగ్ మరింత ఎక్కువగా చైనా రాజకీయ ఒత్తిడి పెరగటానికి, హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి ఇంకా తరిగిపోవటానికి ప్రతిపాదిత చట్టం దోహదపడుతుందని అమెరికా కాంగ్రెస్ కమిషన్ ఇటీవల వ్యాఖ్యానించింది.
బ్రిటన్, కెనడాలు కూడా ఒక సంయుక్త ప్రకటనలో ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశాయి. హాంగ్ కాంగ్లో నివసిస్తున్న బ్రిటన్, కెనడా పౌరుల మీద.. ప్రతిపాదిత చట్టం చూపగల ప్రభావం గురించి కూడా ఆ దేశాలు ఆందోళన తెలిపాయి.

ఫొటో సోర్స్, Getty Images
యూరోపియన్ యూనియన్ సైతం తన ఆందోళనను వ్యక్తం చేస్తూ హాంకాంగ్ నాయకుడు ల్యామ్కు దౌత్య సూచన పంపించింది.
అయితే, ఈ ఆందోళనలు, విమర్శలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. అదంతా హాంకాంగ్ ప్రభుత్వ ప్రతిపాదనను రాజకీయం చేయటానికి, చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నమని ఆరోపించింది.

ఫొటో సోర్స్, AFP
ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు చేస్తోంది?
గత ఏడాది ఫిబ్రవరిలో తైవాన్లో విహారానికి వెళ్లిన హాంకాంగ్కు చెందిన ఒక 19 ఏళ్ల వ్యక్తి.. గర్భిణి అయిన తన 20 ఏళ్ల గర్ల్ ప్రెండ్ను హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఆ వ్యక్తి గత ఏడాది హాంగ్ కాంగ్ తిరిగి వచ్చాడు. అతడిని తమకు అప్పగించటానికి సాయం చేయాలని హాంకాంగ్ అధికారులను తైవాన్ అధికారులు కోరారు. కానీ, తైవాన్తో అప్పగింత ఒప్పందం లేనందున తాము సాయం చేయలేమని హాంగ్ కాంగ్ అధికారులు బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో 'నిందితుల అప్పగింత' ప్రతిపాదనను హాంకాంగ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ.. కొత్తగా చేయబోయే మార్పుల కింద సదరు అనుమానితుడిని అప్పగించాలని తాము కోరబోమని తైవాన్ చెప్తోంది. ఆ హత్య కేసును వేరుగా పరిగణించాలని అంటోంది.

ఫొటో సోర్స్, EPA
హాంకాంగ్... చైనాలో భాగం కాదా?
హాంకాంగ్ ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉండేది. 1997లో చైనా పాలన కిందకు వచ్చింది. కానీ, 'ఒక దేశం - రెండు వ్యవస్థ'ల సూత్రం కింద హాంకాంగ్ పాక్షిక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా కొనసాగుతోంది.
ఈ నగరానికి తన సొంత చట్టాలు ఉన్నాయి. చైనా పౌరులకు లేని పౌర స్వాతంత్ర్యాలు హాంకాంగ్గ్ వాసులకు ఉన్నాయి.
బ్రిటన్, అమెరికా సహా 20 దేశాలతో 'నిందితుల అప్పగింత' ఒప్పందాలు కుదుర్చుకుంది హాంకాంగ్. కానీ, ప్రధాన చైనాతో అటువంటి ఒప్పందం ఏదీ ఖరారు కాలేదు. దీని కోసం రెండు దశాబ్దాలుగా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి.
చైనా చట్టం కింద నిందితులకు సరైన న్యాయ రక్షణ లేకపోవటమే దీనికి కారణమని విమర్శకులు చెబుతున్నారు.
రిపోర్టర్: జెఫ్ లీ, బీబీసీ చైనీస్
ఇవి కూడా చదవండి:
- క్రికెట్కు యవరాజ్ సింగ్ గుడ్బై
- తెలంగాణ ఇంటర్- ఫలితాలు మింగిన ప్రాణాలు... ఒక్కొక్క-రిది ఒక్కో విషాద గాథ
- గాడిద లాగే టాబ్లెట్ కంప్యూటర్తో ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- విరాట్ కోహ్లీ: స్టీవ్ స్మిత్ను అభినందించాలని భారత అభిమానుల్ని ఎందుకు కోరాడు?
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్ ఎవరు
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








