యువరాజ్ సింగ్: క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకూ గుడ్‌బై చెప్పిన సిక్సర్ల యువరాజ్

యువరాజ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

చాలా కాలం నుంచీ వస్తున్న రిటైర్మెంట్ వార్తలకు తెరదించాడు.

ముంబైలో ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన యువీ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.

37 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకూ 304 వన్డేలు ఆడి 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేశాడు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్‌తో 111 వికెట్లు కూడా పడగొట్టాడు.

40 టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు చేసిన యువరాజ్ సింగ్ 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

2000లో కెన్యాతో నైరోబీలో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అడుగుపెట్టిన యువరాజ్ సింగ్‌, 2017లో వెస్టిండీస్‌ పర్యటనలో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇందులో 39 పరుగులు చేశాడు.

యువరాజ్ సింగ్

టీమిండియా బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడుగా పేరు తెచ్చుకున్న యువరాజ్ ముంబయిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో తన నిర్ణయం చెప్పాడు.

ఇక ఇక్కడితో వదిలేసి, ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.

టీమిండియా 1996 అండర్-15 వరల్డ్ కప్, 2000లో అండర్-19 వరల్డ్ కప్, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో యువరాజ్ కీలకం అయ్యాడు.

2007 మొదటి టీ 20 ప్రపంచకప్‌లో డర్బన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదిన యువీ చరిత్ర సృష్టించాడు. యువరాజ్ అంటే అందరికీ ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ గుర్తొస్తుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)