చంద్రయాన్-2: చంద్రుడి మీద దిగబోయే భారతదేశ అంతరిక్షనౌక ఇదే

చంద్రయాన్-2

ఫొటో సోర్స్, PRESS INFORMATION BUREAU, INDIA

చంద్రుడిపై దిగటం కోసం రూపొందించిన అంతరిక్ష నౌకను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆవిష్కరించింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో చంద్రుడిపైకి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించాలన్నది ఇస్రో ప్రణాళిక.

ఇది విజయవంతమైతే.. చంద్రుడి మీద అంతరిక్ష నౌకను క్షేమంగా దింపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

ఇంతకుముందు అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్, చైనాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి.

చంద్రుడి మీద భారతదేశం చేపడుతున్న రెండో పరిశోధన కార్యక్రమం చంద్రయాన్-2.

మొదటి మిషన్ చంద్రయాన్-1ను 2008లో ఇస్రో ప్రయోగించింది. అది చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది కానీ చంద్రుడి ఉపరితలం మీద దిగలేదు.

చంద్రయాన్-2

ఫొటో సోర్స్, PRESS INFORMATION BUREAU, INDIA

ఇప్పుడు చేపట్టిన చంద్రయాన్-2 మిషన్‌లో అంతరిక్ష నౌక చంద్రుడి మీద దిగుతుంది. ఉపరితలం మీద పరిశోధన చేస్తుంది. నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల సమాచారాన్ని సేకరిస్తుంది.

ఈ కొత్త అంతరిక్ష నౌకలో ఒక ల్యాండర్, ఒక ఆర్బిటర్, ఒక రోవర్ ఉంటాయి. దీనిని ఇస్రో పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు.

అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే.. ఈ నౌకలోని ల్యాండర్, రోవర్‌లు సెప్టెంబర్‌లో చంద్రుడి ఉత్తర ధృవం మీద దిగుతాయి. అది విజయవంతమైతే.. ఆ ప్రాంతంలో దిగిన తొలి అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టిస్తుంది.

ఈ రోవర్ చంద్రుడి మీద 14 రోజులు పనిచేసేలా ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో చైర్‌పర్సన్ కె.శివన్ టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికకు చెప్పారు.

''చంద్రుడి ఉపరితలం మీద ఉన్న పదార్థాలను ఈ రోవర్ విశ్లేషిస్తుంది. ఆ సమాచారాన్ని, చిత్రాలను భూమికి పంపిస్తుంది'' అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)