భారత ఎన్నికలపై బంగ్లాదేశ్ ప్రజలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు కేవలం దేశ ప్రజలకు మాత్రమే ఉపఖండంలోని ఇతర దేశాలకు కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల సరళిని సరిహద్దు దేశాలు నిశితంగా పరిశీలిస్తుంటాయి. మరి పొరుగున ఉన్న బాంగ్లాదేశ్ ప్రస్తుత భారత సార్వత్రిక ఎన్నికలను ఎలా చూస్తోంది?
అక్కడి రాజకీయ పార్టీలు ఇక్కడి ప్రభుత్వాల గురించి ఏమనుకుంటున్నాయి? భారత్తో దౌత్య, వాణిజ్య సంబంధాల విషయంలో మార్పులు ఏమైనా వస్తాయని బాంగ్లాదేశ్ భావిస్తోందా? బీబీసీ ప్రతినిధి సాయెదా అక్తర్ కథనం.
పొరుగు దేశమైన భారత్లో జరిగే ఎన్నికలపై బాంగ్లాదేశ్ ప్రజలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఎవరు అధికారంలోకి వస్తారన్నది కూడా వీరికి ముఖ్యమే. భారత ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారని ఢాకా వీధుల్లో కనిపించిన కొందరిని అడిగాను.
''భారత భద్రతాదళాల తీరు మారాలి''
''భారతదేశానికి వెళ్లిన ప్రతిసారీ మమ్మల్ని భద్రతాదళాలు ఇబ్బంది పెట్టాయి. ఈ తీరు మారాలని కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందని ఆశిస్తున్నా'' అని ఒకరు చెప్పారు.
''కొత్త ప్రభుత్వం వచ్చినా మాకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. మా మార్కెట్లు భారత ఉత్పత్తులతో వెల్లువెత్తుతున్నాయి. కానీ వాళ్లు మా నుంచి కొనేది చాలా తక్కువ. మా టీవీ చానళ్లను అక్కడ ప్రసారం కానివ్వరు కానీ, చాలా భారతీయ టీవీ చానళ్లను మేం చూస్తుంటాం'' అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ అవామీ లీగ్ 2009లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా వరకు మెరుగుపడ్డాయి.
భూభాగాల బదిలీ, రహదారులు, చిట్టగాంగ్, మోంగ్లా పోర్టుల విషయంలో రెండు దేశాల మధ్య ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. గత పదేళ్లలో భారతదేశంలో ప్రభుత్వాలు మారినా, బాంగ్లాదేశ్ సంబంధాల విషయంలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు.
బాంగ్లాదేశ్లోని పార్టీలు భారత ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నాయి. భారత అనుకూల పార్టీగా బాంగ్లాదేశ్ అవామీ లీగ్కు పేరుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్తో తమకు సత్సంబంధాలుంటాయని ఆ పార్టీ అంటోంది.

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా...
''నదీ జలాల పంపకం నుంచి అనేక సమస్యలను పరిష్కరించుకునే దిశగా మేం ముందుకు పోతున్నాం. రానున్న రోజుల్లోనూ మా చర్చలు కొనసాగుతాయి. భారత్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బాంగ్లాదేశ్ సమస్యలకు ప్రాధాన్యం ఇస్తాయని నమ్ముతున్నా'' అని బీఏఎల్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ షమ్మీ అహ్మద్ చెప్పారు.
''కొన్నేళ్లుగా భారతదేశానికి బాంగ్లా నమ్మకమైన మిత్రునిగా ఉంటోంది. మేం ఎప్పుడూ భారత్వైపే నిలబడుతున్నాం. అదేవిధంగా వారు కూడా మా సమస్యలు పరిష్కరిస్తారని భావిస్తున్నా. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాం'' అని పేర్కొన్నారు.
బాంగ్లాదేశ్ జాతీయవాద పార్టీ బీఎన్పీతో భారత్కున్న సంబంధాలు అవామీ లీగ్ కంటే భిన్నమైనవి. ఒకప్పుడు భారత వ్యతిరేక భావజాలంతో ఉండే బీఎన్పీ, గత కొద్ది సంవత్సరాలుగా భారత్ విషయంలో మౌనంగా ఉంటూ వస్తోంది.

తీస్తా నది జలాలు, వాణిజ్య లోటు...
సత్ససంబంధాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది బీఎన్పీ సీనియర్ నాయకులు భారతదేశంలో పర్యటించి కాంగ్రెస్, బీజేపీ నేతలను కలిశారు. గతంలో ఉన్న విభేదాలను తొలగించుకోవాలని ఈ పార్టీ భావిస్తోంది.
''బాంగ్లాదేశ్లోని కొన్ని పార్టీలతోనే భారత్ స్నేహ పూర్వకంగా ఉంటోందని చాలా మంది బాంగ్లాదేశీయులు అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ లేదా మూడో ఫ్రంట్ ఇలా ఎవరు అధికారంలోకి వచ్చినా రెండు దేశాల మధ్య ఉండే వివాదాలు.. ముఖ్యంగా తీస్తా నది జలాలు, వాణిజ్య లోటు వంటి వాటి పరిష్కారం కోసం పాటుపడతారని ఆశిస్తున్నా'' అని బీఎన్పీ అసిస్టెంట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ సెక్రటరీ మిన్ ఫర్హాన్ పేర్కొన్నారు.
బీజేపీ హిందుత్వ భావజాలం రానున్న రోజుల్లో బాంగ్లాదేశ్కు ఇబ్బందులు కలిగించొచ్చని కొంత మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
హిందుత్వ రాజకీయాల ప్రభావం...
''ఈసారి కూడా బీజేపీ గెలిచి, నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే హిందుత్వ రాజకీయాలు మరింత పెరుగుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య భారతంలో వాళ్లేం చేశారో ఇక్కడే అదే చేస్తారు. ఇది బాంగ్లాదేశ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది'' అని
యూనివర్సిటీ ఆఫ్ ఢాకాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
''భారత్లో మత రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయకూడదని బాంగ్లాదేశ్లోని మతతత్వ పార్టీలు వాదించొచ్చు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటు భౌగోళికంగా అటు దౌత్యపరంగా భారత్ ఎన్నికలు బాంగ్లాదేశ్కు ఎంతో ముఖ్యం. బాంగ్లాదేశ్ రాజకీయ నాయకులు తమ దేశ ప్రయోజనాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా పరిష్కారం కానీ వివాదాలు ఒక కొలిక్కి రావాలని కోరుకుంటున్నారు.
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- వాట్సాప్లో సమస్య: మొబైల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి.. రహస్యంగా నిఘా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత...
- మోదీ, అమిత్ షాల తెగింపుకు అడ్డుకట్ట వేసి, వెనక్కు తగ్గేలా చేసిన నాథూరామ్ గాడ్సే
- పసిబిడ్డను సజీవ సమాధి చేసిన తల్లి.. మట్టిని తవ్వి బిడ్డను కాపాడిన శునకం
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









