‘‘భారత జలాంతర్గామి’పై పాకిస్తాన్‌ది దుష్ప్రచారం’

జలాంతర్గామి

ఫొటో సోర్స్, RADIO PAKISTAN

మంగళవారం తమ జలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక భారత జలాంతర్గామిని అడ్డుకున్నామని పాక్ నావికాదళం ప్రకటించింది.

పాకిస్తాన్ నావికాదళం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం రాత్రి పాక్ జలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారత జలాంతర్గామిని వారు గుర్తించారు.

దానిని పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించకుండా చాకచక్యంగా అడ్డుకున్నట్లు పాక్ నావికా దళం తమ ప్రకటనలో తెలిపింది.

ఈ విషయాన్ని ధ్రువీకరించాలని బీబీసీ భారత నావికాదళాన్ని కోరింది. కానీ ఈ కథనం రాసే వరకూ వారి నుంచి ఎలాంటి స్పందన అందలేదు.

దీనికి సంబంధించి పాక్ నావికాదళం భారత జలాంతర్గామి వస్తున్నట్లు కనిపిస్తున్న ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఈ వీడియో ప్రకారం ఆ ఘటన రాత్రి 8.30కు జరిగినట్లు కనిపిస్తోంది.

బీబీసీ కూడా ఆ వీడీయోను చూసింది. కానీ పాక్ దళాలు చెబుతున్నట్లు అది భారత జలాంతర్గామేనని స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.

జలాంతర్గామి

ఫొటో సోర్స్, Getty Images

శాంతి కోసమే దాడి చేయలేదు-పాక్

పాక్ తమ ప్రకటనలో భారత్‌తో శాంతి ప్రయత్నాలను కొనసాగించేందుకు తాము ఆ జలాంతర్గామిని హిట్ చేయలేదని పేర్కొన్నారు.

2016 నవవంబర్ తర్వాత భారత జలాంతర్గామి తమ జలాల్లోకి రావడం ఇది రెండోసారి అని పాక్ నావికా దళం తెలిపింది.

భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి చొచ్చుకెళ్లడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వారం రోజుల తర్వాత పాక్ తాజాగా ఈ ఆరోపణలు చేసింది.

పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

ఆ దాడి తర్వాత భారత్ వైమానిక దళం పాక్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్ సమీపంలో బాంబు దాడులు చేసింది.

భారత్ వైమానిక దళం దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ వైమానిక దళం కూడా భారత భూభాగంలోకి వెళ్లి ఆరు టార్గెట్లను హిట్ చేశామని, రెండు భారత విమానాలను కూల్చేశామని చెప్పింది.

నియంత్రణ రేఖ దగ్గర ఇప్పటికీ భారీగా షెల్లింగ్ జరుగుతుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సైన్యం సరిహహద్దుకు రెండు వైపులా ఉన్న వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

పాక్‌ది దుష్ప్రచారం - భారత్

భారత జలాంతర్గామి తమ జలాల్లోకి ప్రవేశించిందని, దానిని తాము తిప్పికొట్టామని పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తోందని భారత్ తెలిపింది.

ఈ మేరకు భారత నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తూ పాకిస్తాన్ దుష్ప్రచారానికి పాల్పడుతోంది. జాతీయ సముద్ర ప్రయోజనాల దృష్ట్యానే మేం మా నౌకలు, జలాంతర్గాములను వాడుతున్నాం’’ అని ఇండియన్ నేవీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)