రాజాసింగ్...వీడియో నుంచి అరెస్ట్, పార్టీ సస్పెన్షన్, కోర్టు వరకు - ఈ మూడు రోజుల్లో ఏం జరిగింది ?

ఫొటో సోర్స్, RAJASINGH/FB
రాజా సింగ్ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖ్ ప్రదర్శనను వ్యతిరేకిస్తూ ఆయన తీవ్రంగా స్పందించారు. మునావర్ కామెడీ షోను అనుమతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
''మునావర్ ను ఎలాగైనా పట్టుకుని తంతాం. ఒకవేళ పోలీసుల భద్రత నడుమ అతను షో చేస్తే, అప్పుడు నేను కూడా మరో షో చేస్తా. నా షో హిందువులు అందరికీ గర్వంగా ఉంటుంది. నా షో తరువాత దేశంలో కమ్యూనల్ వాతావరణం వస్తుంది'' అని స్థానిక మీడియాకు చెప్పారు రాజా సింగ్. అనుకున్నట్టుగానే ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
రాజా సింగ్ వీడియో విడుదల చేసినప్పటి నుంచీ, హైదరాబాద్ పాత నగరంలో అలజడి మొదలైంది. పెద్ద సంఖ్యలో ముస్లిం యువత రోడ్లపైకి వచ్చి రాజా సింగ్ కు వ్యతిరేక నినాదాలు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు, పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాల ముందు ఆందోళనకు దిగి, రాజా సింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై ఐపీసీ సెక్షన్లు 295 ఎ, 153 ఎ ల కింద కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన్ను ఇంటి దగ్గర అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్టేషన్ ముందు గుమిగూడారు.
అరెస్టు అయ్యే ముందు కూడా మీడియాతో మాట్లాడిన రాజా సింగ్, తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ''నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. జైలు నుంచి విడుదల అయిన తరువాత మరో వీడియో విడుదల చేస్తాను. ధర్మం కోసం చావడానికి అయినా సిద్ధం'' అన్నారు రాజా సింగ్.
"ఆయనపై మాకు రకరకాల ఫిర్యాదులు వచ్చాయి. దాంతో, మేం ఆయనను అదుపులోకి తీసుకున్నాం" అని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ చెప్పారని ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసింది.

ఫొటో సోర్స్, UGC
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ రాజాసింగ్ను ఆయన నివాసంలో అరెస్ట్ చేసింది. రాజాసింగ్ తన వీడియోలో చేసిన వ్యాఖ్యలు ముస్లిం మతాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, తన వీడియోను పోలీసులు యూట్యూబ్ నుంచి తీసేయడాన్ని ప్రశ్నించారు. "పోలీసులు అసలేం చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను విడుదలై వచ్చిన తరువాత వీడియో పార్ట్-2 చేస్తాను" అని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ తీవ్రంగా స్పందించారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
"హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండడం బీజేపీ నాయకులకు ఇష్టం లేనట్లుగా ఉంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ సమర్థిస్తారా? లేదంటే వెంటనే దీనిపై ప్రతిస్పందించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మాతో పోరాడాలంటే రాజకీయంగా పోరాడాలి కానీ, ఇది పద్ధతి కాదని ఒవైసీ అన్నారు.
''బీజేపీ హైదరాబాద్లో మత కలహాలు సృష్టించాలనుకుంటోంది. దేశంలోని ముస్లింల మనోభావాలు దెబ్బతీసి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి అనుకుంటోంది. నూపుర్ శర్మ వ్యవహారంలో ప్రపంచం మొత్తం ఏమన్నదో చూసిన తరువాత కూడా, బీజేపీ ముస్లింలను అవమానిస్తూనే ఉంది. ప్రవక్తపై అటువంటి భాష ఎందుకు వాడాలి. ఇవాళ ప్రతీ ముస్లిం కన్నీరు పెట్టుకున్నాడు. బీజేపీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, నగరాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది'' అని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

ఫొటో సోర్స్, TWITTER/TIGERRAJASINGH
అయితే, ఒవైసీ ఇంతకన్నా మంచిగా ఎలా మాట్లాడతారాని బీజేపీ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.
"ఒవైసీ పూర్తిగా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన బీజేపీ గురించి కానీ, ప్రధాని మోదీ చేసిన మంచి పనుల గురించి కానీ ఎప్పుడూ మాట్లాడరు. మోదీని అప్రతిష్ఠపాలు చేయడమే ఆయన పని" అని కిషన్ రెడ్డి ఏఎన్ఐతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అధికార టీఆర్ఎస్ పార్టీ రాజా సింగ్ వ్యాఖ్యలను ఖండించింది. ''ఆకుపచ్చని తెలంగాణలో బీజేపీ అగ్గి రాజేస్తున్నది, ఇక్కడ నెలకొన్న మత సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర చేస్తోంది. పరమత సహనం పాటించకుండా అడ్డుగోలు వ్యాఖ్యలు చేయడం దారుణం. తెలంగాణ లౌకిక రాష్ట్రంగా వర్థిల్లుతుండడాన్ని చూసి ఓర్వలేక బిజెపి నాయకులు కుట్రలు పన్నుతున్నారు. విషం చిమ్ముతున్నారు.'' అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
''ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి. దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని ఆర్ఎస్ఎస్ వాళ్లు అనుకుంటున్నారు. ఇలా మాట్లాడితే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండకూడదు. ఇతర మతాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎమ్మెల్యే పదవి కూడా పోవాలి. గొడవలు జరిగి కర్ఫ్యూలు వస్తే, చిన్న చితక వ్యాపారులు, పని చేసుకునే వారుఎలా బతకాలి?'' అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ కూడా మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఆమె చేసిన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విదేశాల నుంచి దౌత్యపరమైన సమస్యలు కూడా తలెత్తాయి. దాంతో, బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా నూపుర్పై పదికి పైగా కేసులు నమోదయ్యాయి.
తాజాగా, రాజాసింగ్ కూడా ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా పార్టీ అధినాయకత్వం ఆయనను ఆదేశించింది.

ఫొటో సోర్స్, TWITTER/TIGERRAJASINGH
ఎవరీ రాజా సింగ్?
ఆయన పూర్తి పేరు ఠాకూర్ రాజా సింగ్. ఒకప్పుడు కార్పొరేటర్ గా పోటీ చేశారు. ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి 2014, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన బీజేపీ విప్గా కూడా ఉన్నారు.
ఉత్తరాది నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డ కుటుంబానికి చెందిన రాజా సింగ్, బీజేపీలో చేరక ముందు శివసేనలో పనిచేశారు.తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్కు వచ్చి ఆయన కోసం ప్రచారం చేశారు.
‘‘నాకు ముస్లింల ఓట్లు అక్కర్లేదు. ధర్మం కోసం అవసరమైతే చంపడానికి అయినా, చావడానికి అయినా సిద్ధం’’ వంటి అనేక వివాదాస్పద ప్రకటనలు గతంలో చాలాసార్లు చేశారు. ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన అనేక పోలీసు కేసులు ఉన్నాయి.
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఫిర్యాదులతో ఫేస్బుక్ ఆయన అకౌంట్ను 2020 సెప్టెంబర్లో రద్దు చేసింది. ఇన్స్టాలో నుంచి కూడా ఆయనను తొలగించింది.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ మద్యం విధానం పై వివాదంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరెందుకు వినిపిస్తోంది?
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- బంగారు జాడీలో చక్రవర్తి గుండె, ప్రత్యేక విమానంలో తరలింపు, సైనిక లాంఛనాలతో స్వాగతం - బ్రెజిల్లో ఏం జరుగుతోంది
- కశ్మీర్ లోయలో హిందువులను ఎందుకు చంపేస్తున్నారు, 1980 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయా?
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- Asia Cup 2022: భారత్-పాకిస్తాన్ జట్లు తలపడేదెప్పుడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













