రైతుల నిరసనలు: అమిత్ షాతో చర్చలు విఫలం... బుధవారం సమావేశం రద్దు

మంగళవారం రాత్రి 13 మంది రైతు సంఘాల నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం తేలలేదు.

నవంబర్ 9న బుధవారం ప్రభుత్వంతో చర్చలు ఉండవని, రైతు నేత హనన్ ముల్లా ఈ సమావేశం నుంచి బయటికి వచ్చాక చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలకు దీనిపై ఒక లిఖిత ప్రతిపాదన పంపనుందని చెప్పారు.మంగళవారం అర్థరాత్రి చర్చలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

"రైతు సంఘాల నేతలకు రేపు(బుధవారం) ఒక లిఖిత ప్రతిపాదన పంపిస్తామని అమిత్ షా చెప్పారు. ఏపీఎంసీ, ఎస్‌డీఎం పవర్ సహా ఆయన నాలుగైదు విషయాలు లేవనెత్తారు. మేం వాటి గురించి రాసి ఇచ్చేస్తాం. మీరు వాటిపై చర్చించండి, ఎల్లుండి మళ్లీ సమావేశం అవుదామని అమిత్ షా చెప్పారు" అన్నారు.

ప్రభుత్వం లిఖిత ప్రతిపాదన పంపిన తర్వాత రైతు నేతలందరూ చర్చించి, తర్వాత ఏం చేయాలనే వ్యూహాన్ని రూపొందిస్తారని హనన్ ముల్లా చెప్పారు.

"మీరు ప్రతిపాదనపై మొదట చర్చించండి, దానిని చదివి రండి, తర్వాత మాట్లాడుకుందామని అమిత్ షా అన్నార"ని ఆయన చెప్పారు.

"ప్రభుత్వం తమ సవరణల గురించి ఒక లిఖిత ప్రతిపాదన పంపిస్తుందని అమిత్ షా చెప్పారు. కానీ మేం చట్టాలు వెనక్కు తీసుకోవాలనే కోరుతున్నాం. మధ్యేమార్గం ఏదీ ఉండదని చెప్పాం" అని తెలిపారు.

ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకోడానికి సిద్ధంగా లేదని, రైతు నేతలు మరోసారి చర్చలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువని హనన్ ముల్లా చెప్పారు. "గత ఐదు సమావేశాల్లో దేనిపై మాట్లాడామో, ఈ సమావేశంలో కూడా అదే చర్చించాం. చట్టాల్లో మీరు ఏ సవరణలు కోరుకుంటే అవి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని వారు ప్రతిపాదించార"ని చర్చలకు హాజరైన మిగతా రైతు సంఘాల నేతలు ఏఎన్ఐతో చెప్పారు.

దీనిపై, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సింధు బోర్డర్‌లో రైతు సంఘాల నేతలు సమావేశం అవుతారని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హనన్ ముల్లా చెప్పారు.

పూసా ఇన్‌స్టిట్యూట్ గెస్ట్ హౌస్‌లో రైతు సంఘాల నేతలకు, కేంద్ర మంత్రి అమిత్ షాకు మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ముగిసేవరకూ బీబీసీ పంజాబీ జర్నలిస్ట్ సరబ్‌జీత్ అక్కడే ఉన్నారు. సమావేశం జరుగుతున్న ప్రాంతం బయట నుంచి ఫొటోలు పంపించారు.

అమిత్ షాతో అనధికారిక సమావేశానికి రైతు సంఘాల ప్రతినిధులు వెళ్లకుండా ఉండాల్సిందని పంజాబ్‌కు చెందిన ప్రధాన రైతు సంఘాల్లో ఒకటైన భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహా) నాయకుడు జోగిందర్ సింగ్ ఉగ్రహా అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. అమిత్‌ షాతో సమావేశానికి సంబంధించి తమ యూనియన్‌కు ఎలాంటి ఆహ్వానం రాలేదని ఆయన చెప్పారు.

9వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరగాల్సి ఉండగా ముందురోజు రాత్రి ఇలా అనధికారిక సమావేశానికి వెళ్లడం, అందులోనూ కొన్ని సంఘాల నాయకులు మాత్రమే వెళ్లడం ద్వారా యూనియన్ల మధ్య విభేదాలు ఉన్నాయకే అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అమిత్ షాతో సమావేశానికి 13 రైతు సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం అందిందని బీబీసీ ప్రతినిధి సరబ్‌‌జీత్ ఘాలీవాల్ తెలిపారు.

మంగళవారం రాత్రి 7 గంటలకు ఈ భేటీ జరుగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ సమావేశంలో అటో ఇటో తేల్చేయాలని హోం మంత్రిని కోరతామని, మధ్యేమార్గం ఏమీ లేదని రైతు సంఘం ప్రతినిధి రుద్రు సింగ్ మాన్సా పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

అయితే, రాత్రి 7.30 తర్వాత కూడా భేటీపై స్పష్టత రాలేదు.

కొందరు నాయకులు ఈ భేటీ హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో జరుగుతుందని చెప్పగా, మరికొందరు అమిత్ షా అధికారిక నివాసంలో జరుగనుందని తెలిపారు. ఇంకొందరు పూసా ఇన్‌స్టిట్యూట్‌ గెస్ట్‌ హౌస్‌లో జరుగనుందని వెల్లడించారు.

ఇలా కొందరు నాయకులనే సమావేశానికి ఆహ్వానించడం ద్వారా రైతు సంఘాల్లో విభజన తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ, ఈ ఆందోళనలో భాగమైన సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యతో అన్నారు.

ముగిసిన బంద్

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపుతో మంగళవారం భారత్ బంద్ జరిగింది.

ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు చేపట్టిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల నుంచి మద్దతు లభించింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా దేశవ్యాప్తంగా 24 పార్టీలు రైతుల భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. అందులో కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ ఉన్నాయి.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ బంద్ జరుగుతుందని రైతు సంఘాల యూనియన్ ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం నుంచే బంద్ మొదలయింది.

ఆంధ్రా, తెలంగాణల్లో ముగిసిన బంద్

దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్ ఆంధ్ర, తెలంగాణల్లో జరిగింది. ఆంధ్రాలో ప్రభుత్వం అధికారికంగా బంద్ నిర్వహించగా, తెలంగాణలో అధికారిక టిఆర్ఎస్ బంద్ లో విస్తృతంగా పాల్గొంది.

టిఆర్ఎస్ బంద్ కు మద్దతు ప్రకటించి, తన మంత్రులు, ఎమ్మెల్యేలను వివిధ ప్రాంతాల్లో మొహరించింది. ఆ పార్టీ మంత్రులూ, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. హైవేలపై కూర్చుని ట్రాఫిక్ ఆపారు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైకులతో ప్రదర్శన నిర్వహించారు.

కామారెడ్డి శివార్లలోని ఎల్లారెడ్డి దగ్గరలోని టెక్రియాల్ దగ్గర హైవేపై కవిత బంద్ పాటించారు. కాజీపేట దగ్గర్లో మంత్రి యర్రబెల్లి దయాకర రావు, సూర్యాపేటలో ట్రాక్టర్లతో జగదీశ్ రెడ్డి, మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోర్, నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్, నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్, ఆలంపూర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి, తూప్రాన్ దగ్గర మంత్రి హరీశ్ రావు, షాద్ నగర్ దగ్గర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, ఎంపీ కేశవ రావులు ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నిలదీసిన ప్రజలు

హైదరాబాద్లో బంద్ విషయంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నిరసన తలపెట్టిన ప్రదేశంలో సామాన్యులు బంద్ ను ప్రశ్నించారు. గంటన్నరగా తమను ట్రాఫిక్ లో ఇబ్బంది పెట్టారని ఒక మహిళ నిలదీసింది. మరో వ్యక్తి నేరుగా ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తిని తోసేశారు ఎమ్మెల్యే. స్వయంగా ఎమ్మెల్యేనే చేయెత్తి తోసేయడంతో, ఆయన అనుచరులు ఇంకా రెచ్చిపోయి ఆ వ్యక్తిని ఫుట్ పాత్ నుంచి బస్ స్టాప్ వరకూ తోసేశారు.

ఇక యాదగిరిగుట్టలో బంద్ పాటించిన ఒక దుకాణదారుపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. షాపులో వస్తువులను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు అక్కడే ఉండి కూడా భద్రత కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ వ్యక్తి.

మహబూబాబాద్ లో ఆందోళన నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోర్, ఎమ్మెల్యే శంకర నాయక్ లను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ లో బంద్ సందర్భంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్న కొట్లాట జరిగింది.

ఇక కోఠి మహిళా కాలేజీ దగ్గర వామపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల ఆందోళనల్లో పాల్గొంది. టిఆర్ఎస్ కార్యకర్తలు ట్యాంక్ బండ్ పై ర్యాలీ నిర్వహించగా, ఫర్ ఐటి సంస్థ ప్రతినిధులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన నిర్వహించారు.

ఇక ఆంధ్రలో కూడా బంద్ సాగింది. ఇక్కడ ప్రభుత్వమే నేరుగా బంద్ కు సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, మధ్య నుంచే తెరిచారు. ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం నుంచే నడిపారు. ప్రభుత్వమే బంద్ కి మద్దతివ్వడంతో పలుచోట్ల దుకాణాలు తెరవలేదు.

తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్, వామపక్షాలు విజయవాడ బస్టాండ్ దగ్గర ఆందోళన చేపట్టాయి. ముద్రగడ పద్మనాభం రైతు సమస్యలపై మోదీకి లేఖ రాశారు. తెలుగుదేశం కార్యకర్తలు జిల్లా కలెక్టర్లకు రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

బీజేపీ స్పందన

రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ లు బంద్ కు వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడారు. ఈ బంద్ చేయడాన్ని తప్పు పట్టారు. ఇవి రైతులకు మేలు చేసే చట్టాలని చెప్పుకొచ్చారు.

రైతులు శాంతిపూర్వక ప్రదర్శనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు కొనసాగేలా చూడాలని కూడా కోరారు. బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుతామన చెప్పాయి. వాణిజ్య రవాణా, ట్రక్ యూనియన్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తెల్లవారుజామునే భారత్ బంద్ ప్రభావం మొదలైంది. ముందు జాగ్రత్తగా బస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించింది.

విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతల్లో బస్టాండ్ల దగ్గరకు చేరుకున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతు సంఘాల నేతలు నిరసనలు ప్రదర్శనలకు దిగారు. రహదారులపై వాహనాలను అడ్డుకున్నారు. చాలా ప్రాంతాల్లో వ్యాపారాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.

తెలంగాణలో కూడా భారత్ బంద్ ఉదయం నుంచే మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేశారు. తెల్లవారు జాము నుంచే డిపోల దగ్గరకు చేరుకున్ న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు నిరసన తెలిపారు.

బంద్‌ను ప్రశ్నించిన పౌరుడిపై చేయిచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు

ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కొందరు ప్రశ్నించారు.

ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు ఇప్పుడే వచ్చాయా అని నిలదీశారు. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని అడిగారు. ఉషముళ్ల పూడి దగ్గర ఈ ఘటన జరిగింది.

దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నారు.

దిల్లీ, హరియాణాలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. రెండు రాష్ట్రాల్లో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించాలని తెలంగాణ పోలీసులు సూచించారు. బలవంతంగా మూసివేయడం, అడ్డుకోవడం లాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సోమవారం సింగూరు బోర్డర్‌లో ఉన్న రైతులను కలిసినప్పటి నుంచి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను దిల్లీ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది. తర్వాత కాసేపటికే ఉత్తర దిల్లీ డీసీపీ దీనిపై స్పందించారని, ఆప్, ఇతర పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులను మోహరించామని, ముఖ్యమంత్రిని గృహనిర్బంధంలో ఉంచలేదని చెప్పారని ఏఎన్ఐ చెప్పింది.

భారత్ ‌బంద్‌లో కొన్ని శక్తులు బలగాలకు సమస్యలు సృష్టించే అవకాశం ఉండడంతో సంయమనం పాటించాలని, శరీరానికి ఉన్న ప్రొటెక్టివ్ జాకెట్లు, హెల్మెట్లు తీయవద్దని పారామిలిటరీ బలగాలకు సూచించారు.

బిహార్‌లో భారత్ బంద్‌కు ఆర్జేడీ మద్దతు ప్రకటించిందని, ఆ పార్టీ కార్యకర్తలు దర్భంగాలోని గంజ్ చౌక్‌లో టైర్లు తగలబెట్టి కేంద్రం వైఖరికి నిరసన తెలిపారు.

కర్ణాటక కాంగ్రెస్ నేతలు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. బెంగళూరులోని విధాన సౌధ ముందున్న గాంధీ విగ్రహం దగ్గర నల్లజెండాలతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)