హాథ్‌రస్: అత్యాచార కేసుల్లో ఎఫ్ఐఆర్ తప్పనిసరి.. విచారణ రెండు నెలల్లో పూర్తిచేయాలి

అత్యాచార కేసులు

ఫొటో సోర్స్, Getty Images

మహిళలపై జరిగే నేరాల్లో పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవివర ప్రకటనను విడుదల చేసింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విధివిధానాలను అనుసరించాలని హోం శాఖ తెలిపింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో 19ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. హాథ్‌రస్ కేసు విషయంలో పోలీసులతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు వచ్చాయి.

దీంతో మహిళల భద్రత, వారిపై జరిగే నేరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని శనివారం కేంద్రం సవివర విధివిధానాలను విడుదల చేసింది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి చర్యలు తీసుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని దీనిలో సూచించింది.

మహిళలపై నేరాల విషయంలో తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారంటూ డిసెంబరు 5, 2019లో విడుదల చేసిన మార్గదర్శకాలను దీనిలో ప్రస్తావించారు.

అత్యాచార కేసులు

వీటిలో ఏముంది?

మహిళలపై జరిగే నేరాల విషయానికి సంబంధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోందని నిబంధనల్లో పేర్కొన్నారు.

''మహిళలపై జరిగే నేరాల నియంత్రణ, కేసుల విచారణ విషయంలో స్పష్టమైన సూచనలు, సలహాలు, మార్గదర్శకాలను కేంద్రం ఎప్పటికప్పుడే విడుదల చేస్తోంది.

ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఆధారాల సేకరణ, లైంగిక నేరాల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఇప్పటికే విడుదల చేసింది.

రెండు నెలల్లోగా విచారణ పూర్తి చేయడం, నేరస్థులతో జాతీయ స్థాయిలో జాబితా తయారు చేయడం లాంటివి వీటిలో ఉన్నాయి''అని విధివిధానాల్లో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఎన్ని చట్టాలున్నా నేరాలు ఎందుకు తగ్గడం లేదు

ఇంకా ఏమున్నాయంటే..

  • నేరస్థుల్ని అరెస్టు చేసే తీవ్రత గల నేరాల విషయంలో పోలీసులు వెంటనే ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్‌ఐఆర్)ను నమోదు చేయాలి. తమ పోలీస్ స్టేషన్‌కు వెలుపల ఘటన జరిగితే జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలి.
  • ఐపీసీలోని సెక్షన్ 166 ప్రకారం నేరస్థుల్ని అరెస్టు చేసే తీవ్రత గల నేరాల విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి.
  • సీఆర్‌పీసీలోని సెక్షన్ 173 ప్రకారం.. అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలి. ఈ కేసుల విచారణను ట్రాక్ చేయడానికి కేంద్ర హోం శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా తీసుకొచ్చింది.
  • లైంగిక దాడి/అత్యాచార కేసుల్లో బాధితులకు 24 గంటల్లోనే వైద్యుల సాయంతో పరీక్షలు నిర్వహించాలి.
  • మృతులు చనిపోవడానికి ముందు ఇచ్చిన లిఖితపూర్వక లేదా మౌకిక వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలి.
  • లైంగిక దాడుల విషయంలో ఫొరెన్సిక్ ఆధారాల సేకరణపై కేంద్ర హోం శాఖ ఇదివరకే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కేసుల విచారణ సమయంలో ఎస్‌ఏఈసీ కిట్లను ఉపయోగించాలి. వీటిని ఇప్పటికే పోలీసులకు అందించాం.
  • కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమైతే దేశ నేర న్యాయ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి ఘటనలకు బాధ్యులపై విచారణ చేపట్టి, తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి.
  • ఈ విషయంలో సంబంధిత అధికారులకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేయాలి. వీటిని తప్పనిసరిగా అనుసరించేలా చూడాలి.

ఇప్పుడు ఎందుకు?

హాథ్‌రస్ కేసులో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆగ్రహంతో ఉంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మహిళల రక్షణ పట్ల తాము నిబద్ధతతో ఉన్నామని చెప్పడానికే తాజా విధివిధానాలను కేంద్రం విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)