చైనాతో ఘర్షణలో భారత్ సైనికులు ఆయుధాలు వాడకపోవడానికి కారణమైన ఆ ఒప్పందంలో ఏముంది? ప్రాణాపాయ పరిస్థితుల్లో సైనికులు ఆయుధాలు వాడొచ్చా? లేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శుభం కిశోర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జూన్ 15-16 అర్థ రాత్రి పూట గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో 20మంది భారతీయ సైనికులు మరణించారు. ఇనుప మేకులున్న రాడ్లతో చైనా సైనికులు భారత సైనికుల మీద దాడి చేశారు. సరిహద్దుల్లో భారత సైనికులను కొట్టి చంపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రకటించారు. అయితే చైనా సైనికులతో ఘర్షణ సందర్భంగా భారత సైనికులు తుపాకులు వాడలేదన్న విషయం బయటపడింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.
"అసలు ఆయుధాలు లేకుండా వారిని సరిహద్దులకు ఎందుకు పంపారు'' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అయితే గతంలో చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్లే ఆయుధాలను వాడలేకపోయామని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు.
సరిహద్దులో పోస్ట్ చేసిన సైనికులందరి దగ్గరా ఆయుధాలున్నాయని జయశంకర్ ట్విటర్లో పేర్కొన్నారు. పోస్ట్ నుంచి దూరంగా వెళ్లేటప్పుడు వారు ఆయుధాలను తప్పకుండా తీసుకెళతారని, జూన్ 15న గాల్వాన్ లోయలో పోస్ట్ చేసిన సైనికుల దగ్గర ఆయుధాలున్నాయని ఆయన తెలిపారు, 1996, 2005లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండో-చైనా సైనికులు ముఖాముఖి తలపడినప్పుడు తుపాకులను ఉపయోగించకూడదని విదేశాంగ మంత్రి వెల్లడించారు.

ఫొటో సోర్స్, Pacific Press
విదేశాంగమంత్రి చెప్పిన ఆ ఒప్పందంలో ఏముంది?
"ఇరుపక్షాలు ఒకదాని మీద మరొకటి ఎలాంటి బలాన్ని ప్రయోగించవు. సైనిక ఆధిపత్యాన్ని సాధించడం కోసం ఇతరులను బెదిరించవు'' అని 1996లో కుదిరిన ఒప్పదంలో ఉంది. అందులోని మొదటి పేరాలో "రెండు దేశాలు ఏవీ మిలటరీ శక్తిని మరొక దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించవు. ఎల్ఎసి (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) రెండువైపులా మోహరించిన ఏ సైన్యం, దాని సైనిక సామర్ధ్యంతో మరొక సైన్యంపై దాడి చేయదు. అలాంటి సైనిక కార్యకలాపాల్లో పాల్గొనదు. అలా చేసేలా మరోదేశంపై ఒత్తిడి చేయదు. తద్వారా ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు కొనసాగుతాయి'' అని రాసి ఉంది.
విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రస్తావిస్తున్న ఒప్పందంలోని ఈ భాగం ఆర్టికల్ 6లో ఉంది. దీని ప్రకారం "ఎల్ఎసికి రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఏ దేశమూ కాల్పులు జరపదు. జీవరసాయన ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, తుపాకులతో దాడులకు దిగదు.''
1993లో కూడా చైనాతో ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో "భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం శాంతియుతంగా, స్నేహపూర్వక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఇరుపక్షాలు నమ్ముతున్నాయి. ఏ దేశమూ బలప్రయోగానికి దిగదు'' అని ఉంది. 1993, 1996 నాటి ఒప్పందాలలోని అనేక అంశాలు 2005 ఒప్పందంలో పునరావృతమయ్యాయి.

ఫొటో సోర్స్, TPG
ఈ ఒప్పందం ఆయుధాలను పూర్తిగా నిషేధించిందా ?
ఆయుధాలను ఉపయోగించడానికి ఏ దేశానికి అనుమతిలేదని ఒప్పందాలను బట్టి అర్ధమవుతోంది. అయితే పరిస్థితులు పరస్పర దాడి వరకు వచ్చినప్పుడు ఈ నియమాలు వర్తిస్తాయా? ఈ సందర్భంలో భారత సైన్యం చేస్తున్న వాదనలు సరైనవేనా? రిట్రీట్ మేజర్ జనరల్ అశోక్ మెహతాతో ఈ విషయంపై బీబీసీ మాట్లాడింది.
''మనపై మెరుపు దాడి జరుగుతుంటే, అనూహ్యంగా రాళ్లతో దాడికి దిగితే మీరు మీ దగ్గరున్న ఆయుధాలను వదిలేయలేరు. ఆత్మరక్షణ కోసం ఒప్పందాలను ఉల్లంఘించాలా వద్దా అని అక్కడున్న కమాండర్ నిర్ణయించాలి. కమాండర్ లేకపోతే సెకండ్-ఇన్-కమాండ్ ఆదేశించాలి. ఆత్మరక్షణ కోసం ఆయుధాన్ని ఉపయోగించడంలో తప్పులేదు" అన్నారు మెహతా. జయశంకర్ చెబుతున్న ఒప్పందాన్ని చైనా అప్పటికే ఉల్లంఘించిందని అంటారు మెహతా. "సాధారణంగా సరిహద్దు వివాదాలు సమయంలో బ్యానర్లను తొలగిస్తారు. ఇక్కడ కూడా బ్యానర్ లేదు. వారు సాయంత్రంపూట అకస్మాత్తుగా దాడికి దిగారు. అంటే సరిహద్దు ఒప్పందాన్ని అప్పటికే వారివైపు నుంచి ఉల్లంఘించారు" అన్నారాయన.
"అయితే అక్కడ పరిస్థితులు ఏమిటో మనకు తెలియదు. అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది కాల్పులు జరపగలిగే స్థితిలో ఉన్నారో తెలియదు. ముందుగా దాడి చేసిన వారిదే సాధారణంగా పై చేయి అవుతుంది" అన్నారు మెహతా.
అంతర్జాతీయ వ్యవహరాల నిపుణులు ఎస్.డి. మున్షి ''పూర్తి వివరాలు తెలిసే వరకు రెండువైపులా ఎవరు ఎలాంటి బలప్రయోగం చేశారు, ఎవరు ఒప్పందాన్ని ఉల్లంఘించారో చెప్పడం కష్టం. కానీ చాలామంది సైనికులు మరణించడం మామూలు విషయం కాదు. ప్రాణాలను కాపాడుకోడానికి ఆయుధాలు వాడవచ్చనేది నిజం. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, ఆయుధాలను ఉపయోగించవచ్చని అంతర్జాతీయ ప్రోటోకాల్ చెబుతోంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, AFP Contributor
ఈ ఒప్పందాల భవిష్యత్తు ఏమిటి?
"ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారని భారత ప్రభుత్వం నమ్మితే, చైనాతో ఈ ఒప్పందాల గురించి మళ్లీ మాట్లాడాలి, ఇరుదేశాల మధ్య విశ్వాసాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా? అని భారత ప్రభుత్వం చైనాను అడగాలి" అన్నారు ఎస్.డి. మున్షి. అంతేకాదు చైనాకు సంబంధించిన ఇతర సమస్యలను భారతదేశం అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.... సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు చర్యలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- చైనా మీద భారత్ విరుచుకుపడిన 1967 నాథూలా యుద్ధం గురించి తెలుసా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనావైరస్ ఇటలీలో గత ఏడాది డిసెంబర్ నాటికే ఉందని తేల్చి చెబుతున్న మురుగు నీటి పరిశోధనలు
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









